ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఓటు వేయక తప్పలేదు. నిజమే!మీరు చదువుతున్నది కరెక్టే!. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.. జగన్ కొన్నాళ్ల క్రితం ఏమన్నారు?. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు(మావిగన్) లను కలిపి రాజధాని కారిడార్గా అభివృద్ది చేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించవలసిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో మావిగన్ కు ఆమోదం తెలిపేవారు వైఎస్సార్సీపీకి, అమరావతికి అంగీకారం తెలియచేసేవారు కూటమికి ఓటు వేయవచ్చని, ఇది ఎన్నికల అంశంగా తీసుకుంటామని ఆయన సవాల్ చేశారు.
జగన్ ఈ ప్రతిపాదన చేసినప్పుడు చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అవహేళన చేశారు. మతిస్థిమితం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తులతో రాజకీయం చేయాల్సి వస్తోందని చంద్రబాబు విమర్శించారు. కానీ, ప్రజలు కూడా అటువైపే మొగ్గు చూపుతున్నారన్న సంగతి గ్రహించారేమో తెలియదు కాని, చంద్రబాబు కూడా యూటర్న్ తీసుకుని అమరావతి అంటే 29 గ్రామాలే కాదని, విజయవాడ, గుంటూరు, మంగళగిరి కూడా కలుపుకుని మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారట. ఆయన చెప్పినవాటిలో ఒక్క మచిలీపట్నం మాత్రం లేదు. బహుశా తర్వాత రోజుల్లో మచిలీపట్నాన్ని కూడా కలపవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దీనిని బట్టి అర్ధం అయిందేమిటంటే వచ్చే ఎన్నికలలో జరిగే రిఫరెండమ్ వరకు ఆగకుండా చంద్రబాబే స్వయంగా జగన్ చేసిన మావిగన్ ను దాదాపు ఆమోదించినట్లే అవుతుంది. జగన్ ది మతిలేని ప్రతిపాదన అయితే ఇప్పుడు చంద్రబాబే ఎందుకు జై కొడుతున్నారో వివరణ ఇవ్వాలి కదా! ఈ రకంగా జగన్ కు చంద్రబాబే ఓటు వేసినట్లయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమరావతిలో విజయవాడ, గుంటూరులు కలిస్తున్నాయని చెబుతున్నప్పుడు ఇంకా లక్షన్నర ఎకరాల భూమిని ఎందుకు సమీకరించాలని ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్న వస్తోంది. భూ సేకరణపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ వంటివారు ఆ ప్రాంతాన్ని సందర్శించి బలవంతపు భూ సేకరణ పద్దతి కాదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. అయినా వినే పరిస్థితి లేదు.
ప్రభుత్వం రెండో దశ పూలింగ్ అనగానే అమరావతిలో భూముల ధరలు సగానికి సగం పడిపోయాయని, అయినా కొనేవారు రావడం లేదని, అంతా అయోమయంగా మారిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వారు ఈ విషయాలను సోషల్ మీడియాలో కూడా చెబుతున్నారు. విజయవాడ,గుంటూరు ప్రాంత ప్రజలలో వస్తున్న అసంతృప్తిని గమనించి బహుశా తన వైఖరి మార్చుకుని ఉండవచ్చు. ఆయన చెబుతున్నట్లు అధికారులు ఆ ప్రాంతంలో పనులు చేపట్టదలిస్తే అందుకు నిధులు కేటాయించాలి కదా!అవేమీ లేకుండా మీడియాలో ప్రచారానికి మాత్రమే చెబితే ఏమి ఉపయోగం అన్న భావన వ్యక్తం అవుతోంది. గత ఏడాది డిసెంబర్ లో పార్లమెంటులో అమరావతికి చట్టబద్దత తీసుకువచ్చిన సందర్భంలో కూడా అమరావతి అంటే 29 గ్రామాల పరిధినే ఎందుకు పెట్టారు? విజయవాడ, గుంటూరు కూడా ఇందులో ఉంటాయని ఎందుకు ప్రకటించలేదు?కొద్ది రోజుల క్రితం సిఆర్డిఎ విడుదల చేసిన ఒక ప్రకటనలో 29 గ్రామాలలోనే రాజధాని నిర్మాణం నిమిత్తం భూములు సమీకరించినట్లు తెలిపింది.
ప్రస్తుతం ఈ గ్రామాల పరిధిలోనే సుమారు 50వేల కోట్ల వ్యయం అయ్యే పనులు చేపట్టారు. రోడ్లు నిర్మాణం, తదితర సదుపాయాలు కల్పించడానికి ,భవనాల నిర్మాణానికి వ్యయం చేస్తున్నారు. వీటిలో అత్యధిక భాగం డూప్లికసీ తప్ప మరొకటి కాదనిపిస్తుంది.ఇప్పటికే ఒక అసెంబ్లీ భవనం ఉంది అయినా మరొకటి నిర్మిస్తున్నారు. సచివాలయ భవనాలు ఉన్నాయి. అయినా మళ్లీ కడుతున్నారు. పైగా ఏభై అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారట. ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? ఎంత స్పేస్ అవసరం అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ భవనాలు చేపట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఒక భవనంలో హైకోర్టు ఉంది. మళ్లీ కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు.ఇవేకాదు. విజయవాడలో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది.
జాతీయ రహదారిని ఆనుకుని విమానాశ్రయం ఉంది. గుంటూరులో రైల్వే స్టేషన్ ఉంది. అయినా ఇవన్ని మళ్లీ కడతారట. అది కూడా అమరావతిలో మారుమూల ప్రాంతాలలో అట. ఇందుకోసం రైతులను పీడించి మరీ భూములు తీసుకోవడానికి యత్నిస్తున్నారు. ఇవికాక రైతుల నుంచి తీసుకునే పొలాలకు బదులు వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అవి ఇప్పటికీ గ్రాఫిక్స్ లోనే ఉన్నాయి. ఈ ప్లాట్ల అభివృద్దికి ఎన్నివేల కోట్లు అవుతాయో తెలియదు. వరద సంగతి సరేసరి. వేల కోట్ల వ్యయం చేసి రిజర్వాయిర్లు, లిఫ్ట్ లు ఏర్పాటు చేయవలసి ఉంది. ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఐదెకరాల స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు ఐదారువేల రూపాయల వ్యయం చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా 15వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చు చేయడం అందరిని నివ్వెరపరుస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా అమరావతి స్వయం సమృద్ది(సెల్ఫ్ ఫైనాన్స్ ) నగరం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
అమరావతికి ప్రజల సొమ్ము రూపాయి అవసరం లేదని, అమరావతి భూముల నుంచే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వాదించేవారు. తీరా చూస్తే ఇప్పుడు అప్పులే,అప్పులు. అంతేకాక బడ్జెట్ లో కూడా సుమారు ఆరువేల కోట్లు కేటాయించారు. అంటే ఇదంతా రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినదే. తాజాగా అప్పులు ఇచ్చిన సంస్థలకు రుణ చెల్లింపులకు ప్రభుత్వం 231 కోట్లు విడుదల చేసింది. అంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరం కాదని, ప్రజలపై భారం వేసే సిటీ అని ఒప్పుకున్నట్లయింది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాత్రం అమరావతి పూర్తి అయితే ఏటా 12వేల కోట్ల ఆదాయం వస్తుందని కొత్త ప్రచారం ఆరంభించారు. అది ఎలా సాధ్యమో తెలియదు. గతంలో అయితే ప్రభుత్వం ఇక్కడ తనకు వచ్చే వాటా భూములను అమ్ముతుందని , తద్వారా నిర్మాణాలు చేస్తుందని అనేవారు.
కాని ఆ తర్వాత కాలంలో మాట మార్చి, 33వేల ఎకరాలు చాలదని, మరో ఏభైవేల ఎకరాలు తీసుకుంటామంటూ గాత్రం అందుకున్నారు. అక్కడితో ఆగడం లేదు. ఏకంగా 1.75 లక్షల ఎకరాలకు పూలింగ్ విస్తరించనున్నారు. అంటే ఈ రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందో,ఎప్పటి నుంచి ఆదాయం వస్తుందో ఎవరూ చెప్పలేరన్నమాట. మరోవైపు పూలింగ్ కు ఇవ్వని రైతుల నుంచి బలవంతంగా భూ సేకరణ చేస్తున్నారు. పోనీ వారికి మార్కెట్ రేటు ప్రకారం ధర ఇస్తున్నారా అంటేఅదేమీ లేదు.ఉండవల్లి ప్రాంతంలో ఎకరా ధర ఎప్పటి నుంచో ఐదు కోట్ల నుంచి పదికోట్లు ఉంటే ప్రభుత్వం కేవలం 73 లక్షలు చొప్పునే లెక్క కడుతోందట. రాష్ట్రం అంతటా భూముల విలువలను ప్రభుత్వం పెంచినా అమరావతి ప్రాంతంలో పెంచకపోవడానికి కారణమిదేనట.
వరల్డ్ బ్యాంక్ వంటి వాటికి గజం నలభై ఐదువేల రూపాయల వరకు ఉందని చెబుతున్న ప్రభుత్వం రైతుల వద్దకు వచ్చేసరికి ధరను తగ్గించి వేసిందని అంటున్నారు. అమరావతిలో అభివృద్ది మాటేమోకాని, ఎల్లో మీడియాలో మాత్రం ఏదేదో జరిగిపోతున్నట్లుగా ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు ఈనాడులో ఈ మధ్య వచ్చిన వార్తలు చూడండి. అమరావతిలో మినీ అమెజాన్ అట. ఐదెకరాలలో అమెజాన్ వచ్చేస్తుందట. అతిశయోక్తులతో స్టోరీ వండి వార్చారు. ఎమ్యూజ్ మెంట్ పార్కు, ఎకో టూరిజం రిసార్ట్, స్నో వరల్డ్, లండన్ ఐ మాదిరి అమరావతి ..ఇలా ఒకటేమిటి? వాటిలో కొన్ని వస్తే రావచ్చు.లేకపోతే లేదు.కాని ఎల్లో మీడియా పత్రికలలో చూస్తే మాత్రం అంతా జరిగిపోయినట్లే ఉంటుంది. ప్రజలను మభ్యపెట్టడంలో ఎల్లో మీడియా తన వంతు పాత్ర పోషిస్తోంది.
అమరావతికి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 500 మీటర్ల రింగ్ రోడ్డు వేస్తారట. డల్లాస్ వంటి నగరానికే 250 మీటర్ల రోడ్డు ఉంది.హైదరాబాద్ లో 150 మీటర్లే ఉంది.ఇంకా అభివృద్ది మొదలుకాని అమరావతికి మాత్రం అరకిలోమీటర్ రింగ్ర్ రోడ్డేమిటని అంతా బిత్తరపోతున్నారు.ఇప్పటికే ఉన్న వెస్ట్ బైపాస్ రోడ్డు జగన్ టైమ్ లోనే దాదాపు పూర్తి అయింది.అది చాలదట. చివరిగా ఒక మాట. మావిగన్ అంటూ జగన్ ప్రస్తావించగానే, ఎల్లో మీడియాగా పేరొందిన ఆంద్రజ్యోతి వైసిపి నేతలను అసభ్య పదాలతో దూషిస్తూ ఒక వ్యాఖ్య చేసింది. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా మావిగన్ లో మూడువంతుల భాగానికి ఓటు వేశారు.అంటే ఎల్లో మీడియా ఇంతకు ముందు తప్పుడు కూతలు కూశానని ఒప్పుకుంటుందా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


