Minister Buggana Rajendranath Comments On Yellow Media, TDP Party - Sakshi
Sakshi News home page

ఆర్థిక నిర్వహణలో ఏపీ అత్యుత్తమం

Published Fri, Jun 24 2022 5:46 PM

Minister Buggana Rajendranath Comments On TDP - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కష్టాలు, ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ సమర్ధ ఆర్థిక నిర్వహణ విధానాల వల్ల 2021– 22లో ద్రవ్య లోటును 2.10 శాతానికే పరిమితం చేయగలిగినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. అతి తక్కువ ద్రవ్యలోటుతో దేశంలోనే ఏపీ ఆర్థిక నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిందని వెల్లడించారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ (కాగ్‌) ప్రొవిజనల్‌ ఖాతాలే ఇందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే దుగ్ధతో ఉనికి కోసం టీడీపీ దుష్ట చతుష్టయం అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. తప్పుడు లెక్కలతో రాష్ట్రంతో పాటు ప్రజల ప్రతిష్ట దెబ్బ తీయాలనే కుట్రతో టీడీపీ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 

అతి తక్కువ ద్రవ్యలోటుతో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ను తరచూ శ్రీలంకతో పోలుస్తూ విపక్షాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల కాగ్‌ నివేదికలను కూడా తప్పుబట్టడం ఆయన అవివేకానికి నిదర్శనమని  మండిపడ్డారు. ఆర్బీఐ ఎక్కడ ఆంక్షలు విధించిందో యనమల చూపగలరా? అని సవాల్‌ చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలన కన్నా వైఎస్సార్‌ సీపీ మూడేళ్ల పాలనలో అప్పులు, వడ్డీలు, ద్రవ్యలోటు తక్కువేనని కాగ్‌ గణాంకాలతో స్పష్టమైందని తెలిపారు. బడ్జెట్‌ అంచనాలు, వ్యయం కూడా టీడీపీ హయాంలో కంటే ఇప్పుడే ఎక్కువని చెప్పారు. బుగ్గన శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అప్పులపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని గణాంకాలతో సహా ఖండించారు. ఆ వివరాలివీ..

అతి తక్కువ ద్రవ్యలోటుతో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ను తరచూ శ్రీలంకతో పోలుస్తూ విపక్షాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల కాగ్‌ నివేదికలను కూడా తప్పుబట్టడం ఆయన అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆర్బీఐ ఎక్కడ ఆంక్షలు విధించిందో యనమల చూపగలరా? అని సవాల్‌ చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలన కన్నా వైఎస్సార్‌ సీపీ మూడేళ్ల పాలనలో అప్పులు, వడ్డీలు, ద్రవ్యలోటు తక్కువేనని కాగ్‌ గణాంకాలతో స్పష్టమైందని తెలిపారు. బడ్జెట్‌ అంచనాలు, వ్యయం కూడా టీడీపీ హయాంలో కంటే ఇప్పుడే ఎక్కువని చెప్పారు. బుగ్గన శుక్రవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అప్పులపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని గణాంకాలతో సహా ఖండించారు. ఆ వివరాలివీ..

అవకాశం ఉన్నప్పటికీ..
2021–22లో ఏపీ రూ.37 వేల కోట్లకు పైగా అప్పులు చేసేందుకు అవకాశం ఉన్నా కేవలం రూ.25,194.62 కోట్లే తీసుకున్నట్లు కాగ్‌ ప్రొవిజనల్‌ అకౌంట్స్‌ స్పష్టం చేశాయి. దీంతో ద్రవ్య లోటు 2.10 శాతానికి పరిమితమైంది. 15వ ఆర్థిక సంఘం విధించిన లక్ష్యం కన్నా తక్కువకే  ద్రవ్యలోటును పరిమితం చేశాం. టీడీపీ హయాంలో సగటున 4 శాతం మేర ద్రవ్యలోటు ఉండగా కోవిడ్‌ ఏడాది మినహా ఇప్పుడు 2.10 శాతానికి తగ్గించడం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ సమర్థ ఆర్థిక విధానాలకు నిదర్శనం. 

పేదలను ఆదుకోవడం తప్పా?
కోవిడ్‌ సమయంలోనూ పేదలను ఆదుకుంటూ పెన్షన్లు, రైతు భరోసా, ఆసరా, విద్యా దీవెన, అమ్మ ఒడి, చేయూత లాంటివి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అందచేసింది. ఇది తప్పని చెప్పే సాహసం టీడీపీ చేయగలదా? సంతృప్త స్థాయిలో అర్హులందరికీ నేరుగా రూ.1.46 లక్షల కోట్లు పారదర్శకంగా ఖాతాల్లో జమ చేశాం. నగదేతర బదిలీ ద్వారా మరో రూ.44 వేల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం.

బాబు హయాంలోనే భారీ వడ్డీతో అప్పులు
బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సైతం బెదిరిస్తూ రాష్ట్ర ప్రతిష్టను విపక్షం రచ్చకీడుస్తోంది. టీడీపీ హయాంలో క్లిష్ట పరిస్థితులు లేకున్నా అధిక వడ్డీకి ఎక్కువ అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని రుణభా రంలోకి నెట్టేశారు. ఇప్పుడు కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులను సైతం ఎదుర్కొంటూనే తక్కువ అప్పులు చేశాం. అది కూడా పేద ప్రజలను ఆదుకునేందుకే. ఎలా చూసినా గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువ అప్పులు, తక్కువ వడ్డీకే తీసుకున్నాం. టీడీపీ పాలనలో సగటున 8 శాతానికి పైగా వడ్డీతో అప్పులు చేస్తే ఇప్పుడు ఏడు శాతానికే పరిమితం చేశాం.

నాడు ద్రవ్య లోటు డబుల్‌..
బాబు అధికారంలో ఉండగా వార్షిక ద్రవ్యలోటు సగటున నాలుగు శాతం ఉండగా ఇప్పుడు 2.10 శాతం మాత్రమే ఉంది. ఎవరి ఆర్థిక నిర్వహణ సమర్థంగా ఉందో కాగ్‌ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం దారుణం. ఏవైనా అనుమానాలుంటే వివరణ కోరితే ఇస్తాం. అంతేగానీ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీయొద్దు. యనమల తప్పుడు లెక్కలతో కేంద్రం, బ్యాంకులు, ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. 

ఎవరి హయాంలో ఏది ఎంత?
టీడీపీ ఐదేళ్ల పాలనతో ఉపాధి హామీ పథకం కింద రూ.27,340 కోట్ల మేర పనులు చేస్తే ఇప్పుడు మూడేళ్లలో రూ.27,448 కోట్ల విలువైన పనులు చేశాం. 2019–20లో ఎగుమతుల్లో రాష్ట్రం ఏడో స్థానంలో ఉండగా 2020–21లో నాలుగో స్థానానికి ఎగబాకింది. 2018–19లో పెద్ద, మధ్యతరహా పరిశ్రమల పెట్టుబడులు రూ.11,994 కోట్లు కాగా  2019–20లో ఏపీకి రూ.13,201 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2018–19లో బడ్జెట్‌ అంచనాలు రూ.1,91,063 లక్షల కోట్లు కాగా వాస్తవ వ్యయం రూ.1,64,841 లక్షల కోట్లు మాత్రమే. ఇది అంచనాల్లో 86.28 శాతం మాత్రమే. అదే 2021–22లో బడ్జెట్‌ అంచనాలు రూ.2,29,779 కోట్లు కాగా వాస్తవ వ్యయం రూ.2,20,633 లక్షల కోట్లు. ఇది అంచనాల్లో 96 శాతం. 

అప్పుల వార్షిక సగటువృద్ధి రేటులోనూ.. 
టీడీపీ సర్కారు విద్యుత్‌ సంస్థలతో పాటు పలు పనులకు సంబంధించి భారీ బిల్లులు పెండింగ్‌లో పెట్టినా వాటిని తీరుస్తూ, కోవిడ్‌ కష్టాలను ఎదుర్కొంటూనే  అన్నిట్లోనూ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాం. టీడీపీ పాలనలో అప్పుల వార్షిక సగటు వృద్ధి రేటు 19.46 శాతం కాగా ఇప్పుడు 15.77 శాతానికే పరిమితమైంది. గత సర్కారు పాలనలో ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి పది రోజులు సమయం పడితే ఇప్పుడు మూడు నాలుగు రోజుల్లోనే చెల్లిస్తున్నాం. ఆయా శాఖలు వివరాలు అందించడంలో జాప్యం జరిగినప్పుడే కొంతమంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఆలస్యమైంది.


Advertisement

తప్పక చదవండి

Advertisement