
ఆంద్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించడం ఎలాంటి సంకేతం అవుతుంది. ఆమెను నియమించడం వల్ల బీజేపీకి ఏమైనా ప్లస్ పాయింట్ అవుతుందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. అధికారంలోకి వచ్చే పార్టీ అయితే ఇలాంటి పదవులు తీసుకోవడానికి ఎవరైనా పోటీపడతారు.ఆ పరిస్థితి లేకపోతే, జాతీయ పార్టీ కనుక, కేంద్రంలో అధికారంలో ఉంది కనుక తప్పదన్న భావనతో బాద్యత తీసుకుంటారు. ప్రస్తుతం పురందేశ్వరి అదే స్థితిలో ఉండవచ్చు.
రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే నేతలకు ఇలాంటి పదవులపై ఆపేక్ష ఉంటుంది. కాని ఆ విషయంలో పురందేశ్వరి ప్రజలందరికి తెలిసిన నేతే. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమార్తెగా, కేంద్ర మంత్రిగా పాపులరే. బీజేపీలో కూడా జాతీయ స్థాయిలో పదవులు నిర్వహించారు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మూడు పార్టీలలో ప్రముఖంగా ఉండడం. ఎన్టీఆర్ మూడో అల్లుడు చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేతగా ఉండగా, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండి, క్యాబినెట్ హోదా కలిగిన అకాడమీ పదవిలోకొనసాగుతున్నారు.ప్రస్తుతం పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలయ్యారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చడానికి ఆమెను నియమించి ఉండవచ్చన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.
వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలవలేకపోతే, భవిష్యత్తులో బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి పురందేశ్వరి నాయకత్వం ఉపకరించవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు వైపు ఉండాలా? లేక పురందేశ్వరి వైపు ఉండాలా? అన్న మీమాంస ఏర్పడుతుంది. ఎన్టీఆర్ కుమారులు ఎవరూ ఈ స్థాయికి చేరుకోలేకపోయారు. వారంతా చంద్రబాబుకు సరెండర్ అయిపోయారు. పురందేశ్వరి ఇప్పుడు పోటీ నేతగా ఎదిగి తనకంటూ ఒక స్థాయి తెచ్చుకున్నారు. ఇది ఆమె నాయకత్వ పటిమకు ఒక పరీక్షే అవుతుంది. జనసేన తో పొత్తు కొనసాగించడంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించవలసి ఉంటుంది. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్లపై రెండు ప్రధాన సామాజికవర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అబిప్రాయం నేపధ్యంలో గతంలో బీజేపీ కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించాలని ప్లాన్ చేసింది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ మాజీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను తొలుత బీజేపీ అధ్యక్షుడిని చేసింది.
ఆయనవల్ల పార్టీకి పెద్ద ప్రయోజనం లేదని భావించడం, ఎన్నికల నిధుల విషయంలో విమర్శలు రావడం, తెలుగుదేశంతో ఆయన రహస్య అవగాహన పెట్టుకున్నారన్న సందేహాలు రావడంతో ఆయనను తొలగించి సోము వీర్రాజును నియమించారు. ఈయన ఒరిజినల్ బీజేపీ నేతగా గుర్తింపు పొందారు.ఈయనా కాపు సామాజికవర్గం వారే . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే వర్గం వారు కావడంతో ప్రయోజనం ఉంటుందని ఆయన పార్టీతో పొత్తుకు బీజేపీ అధిష్టానం ఓకే చేసింది. కాని ఆ తర్వాత రోజులలో పవన్ కళ్యాణ్ బీజేపీతో బంధం, టీడీపీతో అక్రమ సంబంధం అన్న రీతిలో వ్యవహరించి బీజేపీ ఆలోచనలను దెబ్బతీశారు.రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడలేదు.
ఈ పార్టీలు కలిసి కార్యక్రమాలు నిర్వహించలేకపోయాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా పురందేశ్వరి నియామకాన్ని స్వాగతించడం విశేషమే. బీజేపీ, జనసేనల పొత్తు యధాతధంగా కొనసాగడానికి ఈ పరిణామం ఉపయోగపడుతుందా?లేదా? అన్నది కూడా అప్పుడే చెప్పలేం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్డు పెట్టుకుని కాపు వర్గం ఓట్లను ఆకట్టుకోవాలని ప్లాన్ చేశారు. ఇదే తరుణంలో బీజేపీలో చేరిన టీడీపీ నేతల ద్వారా ఆ పార్టీతో కూడా పొత్తుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. దానికి సోము వీర్రాజు సమ్మతించ లేదు. ఆయన ఓపెన్ గానే వ్యతిరేకించారు.కాపులకు ప్రాతినిద్యం వహించే పార్టీగా ఎదగాలనుకుని మొదట వేసిన ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో బీజేపీ ఈ దశలో పురందేశ్వరిని కొత్త అధ్యక్షురాలిని చేశారు.
ఆమె ఎన్టీఆర్ కుమార్తె అయినా, తెలుగుదేశం లో చీలిక వంటి భిన్నమైన రాజకీయ పరిణామాలలో కాంగ్రెస్ లో చేరి రెండుసార్లు ఎమ్.పి గా ఎన్నికై కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా కాంగ్రెస్ కు దూరం అయి బీజేపీలో చేరారు. బీజేపీ నాయకత్వం కూడా పార్టీ పరంగా ఆమెకు మంచి ప్రాధాన్యత ఇచ్చి జాతీయ స్థాయిలో పదవులు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆమెను ఏపీ శాఖ అద్యక్షురాలిని చేశారు. దీనివల్ల పార్టీకి ఎంత ప్రయోజనం అన్నది ఆలోచించవలసిన అంశమే. కాంగ్రెస్ నుంచి వీడాక ఆమె బీజేపీ పక్షాన పోటీచేసినా ఓడిపోయారు.2014లో తెలుగుదేశంతో పొత్తు కూడా ఉన్నా గెలవలేకపోయారు.
బీజేపీ అగ్రనేత వెంకయ్య నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి ఆమెకు కష్టసాధ్యమైన రాజంపేట సీటు కేటాయించారని, తద్వారా ఆమెను ఓటమిపాలు చేశారని రాజకీయవర్గాలలోఒక ప్రచారం ఉంది. దగ్గుబాటి కుటుంబం చంద్రబాబు చేతిలో పలుమార్లు పరాభవానికి గురైన విషయం బహిరంగ రహస్యమే. ఆమె కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఆమె ఆ వర్గాన్ని ఎంతమేర ఆకర్షించగలుగుతారన్నదానిపై చర్చ ఉంది. చంద్రబాబుకు ధీటుగా ఆ వర్గాన్ని ప్రభావితం చేయగలిగితే ఆమెకు మంచి గుర్తింపే వస్తుంది. ఆ ఉద్దేశంతో ఆమెకు బాధ్యత అప్పగించారా?లేక ఆమెకు కేంద్ర మంత్రి గా పనిచేసిన అనుభవం, ఇమేజీ ఉండడం తో తద్వారా బీజేపీకి పరపతి వస్తుందని ఆశించారా అన్నది చూడాల్సి ఉంటుంది. చంద్రబాబుతో రాజకీయంగా దగ్గుబాటి కుటుంబానికి అంత సత్సంబందాలు లేవు.
పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావు గత ఎన్నికలలో వైసిపి నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందారు. తదుపరి ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు.టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, గతంలో వెంకయ్య నాయుడు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి, తదుపరి రాజకీయాలలోకి వచ్చిన సత్యకుమార్ లు కూడా ఈ పదవికి ట్రై చేశారు. వీరిలో ఎవరు అధ్యక్ష బాద్యతలు తీసుకున్నా టీడీపీ ఆశించిన విధంగా బీజేపీ పొత్తు తేలిక అయ్యేదని భావిస్తున్నారు. అలాకాకుండా పురందేశ్వరికి అప్పగించడం ద్వారా చంద్రబాబుకు షాక్ ఇచ్చారా? అన్న సందేహం వస్తుంది. అయితే అదే సమయంలో పురందేశ్వరి గతంలో మాదిరి టీడీపీ పట్ల అంత వ్యతిరేకతతో లేరని , అందువల్ల ఇప్పుడు కూడా పొత్తుకు అవకాశం లేకపోలేదని అనేవారు ఉన్నారు.
ఆమె ఈ పదవి చేపట్టిన తర్వాత అదికారంలో ఉన్న వైసిపిని, ప్రతిపక్ష టీడీపీని రెండిటిని సమానంగా విమర్శిస్తే బీజేపీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. అలాకాకుండా ఆమె కేవలం వైసిపినే విమర్శిస్తే మాత్రం భిన్నమైన సంకేతం వెళుతుంది. అలాగే జనసేన పార్టీని తిరిగి బీజేపీ కూటమిలోనే ఉంచగలిగితే ఆమెకు ప్రాదాన్యత పెరుగుతుంది. అలాకాకుండా ఆమె తనవరకు ఎలాగొలా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీతో పొత్తును ఆశిస్తే ,తిరిగి బీజేపీ ఏపీలో ఎదుగదలకు అవకాశం లేకుండా చేసినట్లే అవుతుందని భావిస్తున్నారు.
ఇవన్ని కొద్ది రోజులలోనే తేలిపోవచ్చు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించడం కూడా ప్రాముఖ్యత కలిగిన అంశమే. రాయలసీమలో బలమైన సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి ఆయన ఉపయోగపడవచ్చన్న భావన ఉండవచ్చు. ఈ రకంగా ఏపీలోని రెండు ప్రధాన సామాజికవర్గాలలో బలం పెంచుకునే దిశలో బీజేపీ అధిష్టానం ఆలోచన చేసినట్లు కనిపిస్తుంది. అంతేకాక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వపరంగా గతంలో ఒక హోదా కలిగిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. అయినా ఏపీలో బీజేపీ పుంజుకోవడం అంత తేలికకాదు. అయితే టీడీపీకి ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో పార్టీ ఎదుగుదలకు కొంతమేర ఉపయోగపడవచ్చు. అది కూడా చిత్తశుద్దితో కృషి చేస్తేనే!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్