కేసీఆర్‌ పగబట్టి ఉంటే కాంగ్రెస్‌ నేతలు జైళ్లలో ఉండేవారు | Harish Rao Comments On Congress Leaders | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పగబట్టి ఉంటే కాంగ్రెస్‌ నేతలు జైళ్లలో ఉండేవారు

Dec 14 2023 5:48 AM | Updated on Dec 14 2023 5:48 AM

Harish Rao Comments On Congress Leaders - Sakshi

నర్సాపూర్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పనితనమే తప్ప.. పగతనం తెలియదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. ఒకవేళ కేసీఆర్‌ పగబట్టి ఉంటే రాష్ట్రంలో చాలామంది కాంగ్రెస్‌ నాయకులు జైలుపాలై ఉండేవారని చెప్పారు. బుధవారం ఆయన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని హరీశ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ గోబెల్స్‌లా ప్రచారం చేసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కేసీఆర్‌ ప్రజల పక్షాన ఆలోచించారని, కష్టపడి సాధించిన తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసే దిశగా ప్రజల కోసం పని చేశారని పేర్కొన్నారు.

2001 నుంచి ఎన్నో విజయాలు, అపజయాలు చూశామని చెప్పారు.  ఓటమి అనేది స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిదని, స్పీడ్‌ బ్రేకర్‌తో వేగం తగ్గుతుందే తప్ప వాహనం పూర్తిగా నిలిచిపోదని చెప్పారు. కొంతకాలం ఆగితే బీఆర్‌ఎస్‌ పార్టీ గమ్యం చేరుతుందని, మున్ముందు అద్భుత భవిష్యత్‌ మనదేనని హరీశ్‌ పేర్కొన్నారు. కాగా, పార్లమెంట్‌పై దాడి అమానుషమని హరీశ్‌రావు అన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో దాడి జరగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement