
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రోజుకో కొత్త డైలాగు నేర్చుకుని వచ్చి జనం మీద వదలుతున్నారు. తనది విజన్ అట. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది పాయిజన్ అట. డెబ్బైనాలుగేళ్ల వయసులో కూడా ఆయన నిజాలు చెప్పడం లేదు. చంద్రబాబుది అమరావతి రియల్ ఎస్టేట్ విజన్ అయితే, జగన్ది రియల్ డెవలప్ మెంట్ విజన్ అని చెప్పాలి. చంద్రబాబు తన టైమ్ లో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కాకుండా తాను ఫలానా పని చేశానని చెప్పుకోగలిగే పరిస్థితి లేదు.
అందుకే ఎంతసేపు వైఎస్ జగన్ను విమర్శించడమే తన విజన్ అన్నట్లుగా పాయిజన్ అంటే విషం వెదజల్లుతున్నారు. నిజంగా చంద్రబాబుకు విజన్ అన్నది ఉంటే ఏపీలో స్కూళ్లను ఎందుకు బాగు చేయించలేదు? ఏపీలో ఆస్పత్రులను ఎందుకు ఆధునీకరించలేదు. ప్రజల వద్దకే పాలనను ఎందుకు తీసుకు వెళ్లలేకపోయారు? ఏపీలో ప్రస్తుతం సాగుతున్న పోర్టుల నిర్మాణం, వైద్య కళాశాలల అభివృద్ది, పలు చోట్ల పారిశ్రామికవాడల అభివృద్ది మొదలైనవి ఎందుకు ఆయన హయాంలో చేయలేకపోయారు? నిజంగా చంద్రబాబుకు విజన్ ఉంటే ఒకసారి ప్రత్యేక హోదా అని మరోసారి ప్రత్యేక ప్యాకేజీ అని ఎందుకు అన్నారు.
ప్రధాని మోదీని మోసగాడు అని ఒకసారి, గొప్పవాడు అని మరోసారి వ్యాఖ్యానించిన చంద్రబాబు ఎలా విజనరీ అవుతారో తెలియదు. బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని, నరేంద్ర మోడీ హంతకుడు అని పెద్ద గొంతుతో అరిచిన చంద్రబాబు ఆ తర్వాత బీజేపీ చంక ఎక్కడంలో ఆయన విజన్ ఉందని అనుకోవాలి. హైదరాబాద్లో ఒక భవనం కట్టి ,మొత్తం నగరం అంతా తానే కట్టానని చెప్పడంలో చంద్రబాబు విజన్ ఉంది.
ఎక్కడ ఎవరు ఏమి చేసినా, అదంతా తన ఖాతాలో వేసుకోవడంలో ఆయన విజన్ ఉందని ఒప్పుకోక తప్పదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్లో రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తుంటే అడ్డుపడే యత్నం చేసిన చంద్రబాబు ఆ తర్వాత రోజుల్లో తానే దానిని వేశానని చెప్పడానికి ఏ మాత్రం సిగ్గుపడలేదు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేస్తుంటే తన పార్టీవారితో దానికి వ్యతిరేకంగా విజయవాడ ప్రకాశం బారేజీ వద్ద ధర్నా చేయించిన చంద్రబాబు, తానే రాయలసీమకు మేలు చేశానని మిగిలినవారు ద్రోహులని ప్రచారం చేసుకోవడంలో ఆయన విజన్ కనిపిస్తుంది.
ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా అన్నీ తనవే అని అంటారు. రామోజీరావు, రాధాకృష్ణ వంటివారి అవసరాలు తీర్చుతూ, వారితో అబద్దాలు ప్రచారం చేయించుకోవడంలో చంద్రబాబు విజన్ ఉందని అంగీకరించవచ్చు. చంద్రబాబు టైమ్లో కియా తప్ప, ఇంకొక పరిశ్రమ ఏదైనా వచ్చిందేమో చెప్పమనండి. అందులో కూడా పట్టుమని వెయ్యి ఉద్యోగాలు రాలేదు. కాని బిల్డప్ మాత్రం చాలా ఉంటుంది. అయినా ఫర్వాలేదు.
కాని రాజశేఖరరెడ్డి సమయంలో వచ్చిన శ్రీసిటీ, అచ్యుతాపురం సెజ్, ఇలా ఒకటేమిటి. అనేకం ఉన్నాయి. వైఎస్ జగన్ పాలనకు వచ్చాక శ్రీ సిటీలో పలు పరిశ్రమలు వచ్చాయి. అచ్యుతాపురం లో పరిశ్రమలు వచ్చాయి. నక్కపల్లి పార్మాహబ్ రాబోతోంది. రామాయంపట్నం వద్ద ఇండో సోలార్ పానెల్ ప్లాంట్కు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. బద్వేల్ వద్ద సెంచురి ప్లై వుడ్ ప్యాక్టరీ శంకుస్థాపన, ప్రారంభోత్సం రెండూ జగనే చేశారు.
వైఎస్ఆర్ కాలంలో శ్రీ సిటీకి భూములు సేకరిస్తుంటే ఇదే చంద్రబాబు, ఇదే రామోజీరావు దానికి వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేశారు? ఆ తర్వాత చంద్రబాబు అధికారంలోకి రాగానే అదంతా తమ ఘనతే అన్నట్లు ఎలా చెప్పుకునే యత్నం చేశారో అందరికి తెలుసు. చంద్రబాబు తాజా అబద్దం ఏమిటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పడం. దేశం అంతటా కలిపే అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో, రావో కాని ఈయన మాత్రం ఏపీలో అన్నీ ఇచ్చేస్తారట. లేకుంటే నిరుద్యోగులకు మూడు వేల రూపాయల చొప్పున భృతి ఇస్తారట.
గత టర్మ్లో కూడా ఇలాంటి హామీలు ఎన్నో చేసి 90 శాతం చేయకుండా మోసం చేసిన చంద్రబాబు విజనరీ అట. అది జనం నమ్మాలట. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలు ప్రచారం చేస్తే జనం అంతా నోట్లో వేలేసుకుని వినాలట. అమరావతిలో ఎంత విజన్ అంటే సింగపూర్ నుంచి ప్రైవేటు కంపెనీలు తీసుకు వచ్చి ఆ దేశ ప్రభుత్వమే వచ్చిందని ప్రచారం చేసేంత. చివరికి ఈయనతో సావాసం చేసిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కుకుని పదవి పోగొట్టుకున్నారు. ఇది కూడా విజనేనేమో! తల్లికి వందనం కింద ఎందరు పిల్లలు ఉంటే అందరికి డబ్బులు వేస్తానని అసత్యపు హామీ ఇవ్వడంలో ఆయనకు విజన్ ఉంది.
ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని తప్పుడు వాగ్దానం చేసే విజన్ చంద్రబాబుకు ఉందని ఒప్పుకోవాల్సిందే. చంద్రబాబు ఇస్తున్న ఇలాంటి మోసపూరిత వాగ్దానాలను కదా పాయిజన్ అని అనాల్సింది. మరి జగన్ ఇలాంటి మోసాలు చేశారా? తను ఏమి చెప్పారో అవి చేసి చూపించారా? లేదా? పలాస వద్ద కిడ్నీ బాధితులకోసం తీసుకు వచ్చిన సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, వాటర్ స్కీమ్ చాలు జగన్ ఎంత విజనరీ అన్నది చెప్పడానికి.
రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడల వద్ద సాగుతున్న ఓడరేవుల నిర్మాణం చాలు ఆయన ఎంత విజనరీ అన్నది వివరించడానికి, పాడేరు వంటి గిరిజన ప్రాంతంలో కూడా వైద్య కళాశాల పెడుతున్న జగన్ది విజన అవుతుంది కాని అసలు ఈ ఆలోచనలే చేయని చంద్రబాబుది విజన్ ఎలా అవుతుంది. వలంటీర్ల వ్యవస్థ తెచ్చి వృద్దులకు ఇళ్లవద్దే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయడం, రేషన్ను కూడా ఇళ్లకే పంపించడం, గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా 500 పైగా పౌర సేవలను అందించడం, ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఆధునిక విద్య, టాబ్ లు ఇవ్వడం, స్కూళ్లలో పరిశుభ్రమైన టాయిలెట్లు ఏర్పాటు చేయడం, విలేజ్ క్లినిక్స్ నిర్మించడం, రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ..ఇవన్ని జగన్ విజన్కు నిదర్శనాలు కాదా!
చంద్రబాబేమో లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేస్తే, జగన్ మాత్రం రెండున్నర లక్షల కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా పేదల ఖాతాలలో వేసి చరిత్ర సృష్టించారు. దీనిని కదా మాట నిలబెట్టుకోవడం అని అనాల్సింది. వలంటీర్ల వ్యవస్థపై నోరుపారేసుకుని అవమానించడాన్ని పాయిజన్ అంటారు తప్ప, జగన్ తీసుకువచ్చిన సంస్కరణలను కాదు. ఏ రకంగా చూసినా జగన్లో ఉన్న విజన్ చంద్రబాబుకు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు అవుట్ డేటెడ్. జగన్ అప్డేటెడ్ నేత.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు