హైడ్రా పేరుతో వేధింపులు.. ఇదేం రాజకీయం: హరీష్‌ ఫైర్‌ | BRS MLA Harish Rao Serious Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

హైడ్రా పేరుతో వేధింపులు.. ఇదేం రాజకీయం: హరీష్‌ ఫైర్‌

Aug 25 2024 11:43 AM | Updated on Aug 25 2024 12:13 PM

BRS MLA Harish Rao Serious Comments On Congress Govt

సాక్షి, తెలంగాణభవన్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్‌ రావు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్‌ సర్కార్‌ రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

కాగా, హరీష్‌ రావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ నేతలు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ప్రతిపక్షాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. కాంగ్రెస్‌ కండువా కప్పుకోండి.. లేదంటే టార్గెట్‌ చేస్తాం అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హైడ్రా పేరుతో రాత్రికి రాత్రే కూల్చివేతలు చేస్తున్నారు. మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై రాజకీయ కుట్రతోనే ఆరు కేసులు నమోదు చేశారు. రాజేశ్వర్‌ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనే ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో​ లేవని పల్లా విద్యాసంస్థలకు అనుమతి ఇచ్చారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ సంయుక్త సర్వే చేసి రిపోర్టు ఇచ్చాయి. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నిర్మాణాలకు ఎన్‌వోసీ ఇచ్చారు. హెచ్‌ఎండీఏ అనుమతితోనే పల్లా.. విద్యా సంస్థల నిర్మాణం చేశారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలపై రాజకీయ కక్ష సాధింపులు వద్దు. రాజకీయంగా ఎదుర్కొలేకనే పల్లాపై వేధింపులకు దిగుతున్నారు. హైడ్రాను కేవలం రాజకీయంగా కక్ష సాధింపులకు మాత్రమే వాడుకుంటుందని ఆరోపించారు.

ఇక, అంతకుముందు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన విద్యా సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. నాదం చెరువులో ఒక్క ఇంచ్ అక్రమ నిర్మాణం ఉన్నట్టు తేలితే నేనే కూల్చివేస్తాను. అన్ని అనుమతులు తీసుకుని మా విద్యా సంస్థల నిర్మాణం చేపట్టాం. నాపై రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారు. మాపై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయి అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement