అందుకే విష ప్రచారం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి | Brs And Congress Spreading Lies Against Sir: Kishan Reddy | Sakshi
Sakshi News home page

అందుకే విష ప్రచారం చేస్తున్నారు: కిషన్‌రెడ్డి

Jun 27 2026 10:00 PM | Updated on Jun 27 2026 10:00 PM

Brs And Congress Spreading Lies Against Sir: Kishan Reddy

సాక్షి, హైదరాబాద్‌: ‘‘సర్‌’ ప్రక్రియ ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చే కీలక కార్యక్రమం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా చాలాసార్లు జరిగిందని.. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా నిర్వహించే సాధారణ చట్టబద్ధమైన ప్రక్రియగా కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

‘‘అర్హులైన వారికి ఓటు కల్పించాలి.. కానీ దీనిపై కూడా కొందరు రాజకీయం చేస్తున్నారు. ‘సర్‌’పై సుప్రీంకోర్టు కూడా దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి. భారత పౌరుల విలువ పెంచే ప్రక్రియ ‘సర్‌’. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును భద్రపరచుకోవాలి.. స్వచ్ఛందంగా పాల్గొనాలి. బోగస్ ఓట్లు ఉండకూడదు. ‘‘సర్‌’ వచ్చాక ఓటు పర్సంటేజ్ పెరగడం అందరం చూశాం. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా బీహార్, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఓటు శాతం పెరగడానికి కారణం ‘సర్‌’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.

‘‘ప్రజాస్వామ్యానికి భారత దేశం తల్లి లాంటిది.. మదర్ ఆఫ్ డెమోక్రసీ అని ప్రధాని మోదీ చెబుతుంటారు. ఎన్నికల కమిషన్ ఎవరి కనుసన్నల్లో పనిచేసే సంస్థ కాదు. కాంగ్రెస్ దీనిపై లేనిపోని అపోహలు సృష్టిస్తోంది. ఎన్నికల కమిషన్‌పై బురద చల్లాలని చూస్తున్నారు. ఆటం బాంబులు వేస్తా.. ప్రళయం సృష్టిస్తా అని చెప్పి వారి పరువు వారే తీసుకుంటున్నారు. ‘సర్‌’ వల్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు గుండెలు బాదుకుంటున్నాయి?. ఓటర్లను అవగాహన, చైతన్యం కల్పించాల్సిన పార్టీలు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాయి’’ అంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

‘‘బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు.. రేషన్ కార్డులు పొందారు. ఆధార్ కార్డులు పొందారు. లోన్లు కూడా తీసుకున్నారు. వీటిపై ఎందుకు ఈ పార్టీలు మాట్లాడటం లేదు. ‘సర్‌’ను మతంతో ముడిపెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సీఎం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని చాలా బస్తీల్లో రోహింగ్యాలు ఉన్నది వాస్తవం కాదా?. ఎవరు గుండెలు బాదుకున్నా? ఈ ప్రక్రియను ఎవరూ అడ్డుకోలేరు. కానీ రేవంత్ మాత్రం లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ‘సర్‌’ చేసేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా. కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఉద్యోగులపై విశ్వాసం లేదు. అందుకే అబద్ధపు, విష ప్రచారం చేస్తున్నారు.. రెచ్చగొడుతున్నారు

..కాంగ్రెస్ నేతలు బీఎల్ఓలను బెదిరిస్తున్నారు. మజ్లిస్ కూడా ఎవరి ఇళ్లకు వెళ్లొద్దు.. మా వద్దకు వస్తే మేము చెప్పిన డేటా తీసుకోవాలని బెదిరిస్తున్నారు. మజ్లిస్ కనుసైగల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తోంది. ఉద్యోగులు బెదరవద్దు.. మేము అండగా ఉంటాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ దిగజారి వ్యవహరిస్తున్నాయి. పౌరసత్వంతో కూడా ఓటు హక్కుకు ముడిపెట్టారు. ఓటు ఎక్కడున్నా సరే.. దానికి సంక్షేమ పథకాలకు సంబంధం లేదు. అలాగే పౌరసత్వంతో కూడా ‘సర్‌’కు సంబంధం లేదు. ఇవే మాటలు కేరళలో ఎందుకు మాట్లాడటం లేదు.

..బెంగాల్‌లో రాష్ట్ర ప్రభుత్వ కబంధ హస్తాలోనే ఈ ప్రక్రియ జరిగింది. దీనిపై అక్కడ ఎందుకు మాట్లాడలేదు. ఇవన్నీ నిరాధారమైన విమర్శలు మాత్రమే. ప్రజల్లో ఆందోళన రేకెత్తించి ప్రయోజనం పొందాలని కొందరు చూస్తున్నారు. ఓటర్ లిస్టును చెక్ చేసి ఎక్కడ నివాసముంటే అక్కడకు ఓటు హక్కు పొందేలా చూడాలి. అలాగే తప్పుల సవరణ కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కంటోన్మెంట్‌లో ‘సర్‌’కు వెళ్ళిన బీఎల్ఓలతో ఇందిరమ్మ చీరలు అందించాలని కాంగ్రెస్ నీచంగా వ్యవహరించింది. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫోటోతో సహా ఫిర్యాదు చేశాం. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి

‘సర్‌’కు వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే ఎవరైనా బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని అడిగారా?. అదే నిజమైతే కేసీఆర్, కేటీఆర్, అసదుద్దీన్ ఇంటికి కూడా సిబ్బంది వెళతారు.. వారు కూడా సభ్యత్వం తీసుకుంటారా మరి?. అసదుద్దీన్ బారిస్టర్‌లో రాజ్యాంగం గురించి సరిగ్గా చదవలేదు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎలా అబద్ధాలు మాట్లాడాలో నేర్చుకున్నాడు. పాత బస్తీలో దొంగ ఓట్లు ఉన్నాయి.. నగరంలో కూడా చాలా ఉన్నాయి.. అవి తొలగిస్తే వారి పప్పులు ఉడకవని భయంతో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో ఉండే ఇతర రాష్ట్రాలు, జిల్లాల ప్రజలు.. ఇక్కడే ఓటు హక్కు తీసుకోవాలి’’ అని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement