పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లెత్తాలి  | Bandi Sanjay in Raitu Deeksha | Sakshi
Sakshi News home page

పార్టీ గేట్లు కాదు.. ప్రాజెక్టుల గేట్లెత్తాలి 

Apr 3 2024 4:43 AM | Updated on Apr 3 2024 11:46 AM

Bandi Sanjay in Raitu Deeksha - Sakshi

రాష్ట్రంలో సాగు, తాగునీటికి తీవ్ర కొరత  

కాంగ్రెస్‌కు చేతకాదంటే కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెస్తా 

ఆరు గ్యారంటీలు అమలు కాకుంటే కాంగ్రెస్‌లో మిగిలేది ఆరుగురే 

ఇక బీఆర్‌ఎస్‌లో మిగిలేది నలుగురే  

‘రైతు దీక్ష’లో బండి సంజయ్‌ 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రంలో సాగు, తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదని, సాగునీటి ప్రాజెక్టుల గేట్లు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. నగరాలు, పట్టణాల్లో మంచినీటి కొరత మొదలైనా పట్టించుకోరా? అని నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే దమ్ము లేదని కాంగ్రెస్‌ లేఖ ఇస్తే తానే కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పిస్తానని అన్నారు.

ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ పార్టీలో ఆరుగురే నేతలు మిగులుతారని, కేసీఆర్‌ కుటుంబలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవితలే ఉంటారని ఎద్దే వా చేశారు. మంగళవారం కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ‘రైతు దీక్ష’లో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రంలో రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లలో తరుగు, రుణమాఫీ, సాగునీటి కొరత, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఈ దీక్ష తలపెట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా దించాలన్న ఆలోచన లేదు 
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా దించాలనే ఆలోచన బీజేపీకి లేదని బండి స్పష్టం చేశారు. కేసీఆర్‌కి 2 బీహెచ్‌కే (బేటా ఔర్‌ బాప్, హరీశ్, కవిత) పరి స్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఫాంహౌజ్‌ నుంచి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్‌ నేతలు హామీల పేరుతో రాజకీయం చేస్తున్నారని బండి విమర్శించారు.

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్‌.. రూ.600కోట్లతో అమలు చేసినట్లుగా మీడియాలో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పంటనష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.25 వేల పరిహారమివ్వాలని డిమాండ్‌ చేశారు. వడ్లు కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో అన్ని పంటలకూ రూ.500 బోనస్‌ ప్రకటించాలని కోరారు. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు ఎందుకివ్వడం లేదని, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.  

ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడు? 
గతేడాది చొప్పదండి నియోజకవర్గంలోని రామగుడులో పంట నష్టపోతే రైతులను పరామర్శించిన కేసీఆర్‌ ఎకరాకు రూ.10 వేలు ఇస్తానని మాట తప్పారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్‌ కరీంనగర్‌కు వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పిన తరువాతే కేసీఆర్‌ కరీంనగర్‌కు రావాలని డిమాండ్‌ చేశారు. మేం బరాబర్‌ శ్రీరాముడి ఫొటోతో ఓట్లడుగుతాం.. కాంగ్రెస్‌కు దమ్ముంటే బాబర్‌ ఫొటోతో ప్రచారం చేసుకోవాలని బండి సవాల్‌ విసిరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement