అలాంటి వ్యక్తిని సీఎం చేయడమే కాంగ్రెస్ చేసిన అసలైన క్రిమినల్ వేస్ట్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను, చదువుకున్న యువతను ‘క్రిమినల్ వేస్ట్’గా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొనడం అత్యంత అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న లక్షలాది మంది యువతను అవమానించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. నిజంగా క్రిమినల్ వేస్ట్ ఎవరైనా ఉంటే 89 కేసులు ఎదుర్కొంటున్న రేవంత్రెడ్డేనని, అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడమే కాంగ్రెస్ పార్టీ చేసిన అసలైన క్రిమినల్ వేస్ట్ అని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రాహుల్గాందీ, రేవంత్రెడ్డి కలిసి ఇచ్చిన గ్యారంటీలు, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేశారని విమర్శించారు. కనీసం తన ఎన్నికల అఫిడవిట్ను అయినా స్వయంగా నింపే సామర్థ్యం రేవంత్కు ఉందా? అని ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రి బాధ్యత నుంచి వెంటనే తప్పుకోవాలని, రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవ¯న్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వేణు సూసైడ్ లేఖ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్
ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు రాసిన సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పట్టే చార్జిషీట్ లాంటిదని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగాల హామీ అమలు కాకపోవడం వల్లే తాను తీవ్ర నిరాశకు గురయ్యానని వేణు తన లేఖలో పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని అన్నారు. అయితే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులపాటు నిర్వహించి యువతకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్ చేశారు. లేకుంటే యువతకు జరిగిన ద్రోహంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున గట్టిగా ప్రశ్నిస్తామని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.
కాళేశ్వరంపై అసత్య ప్రచారం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీరు ఎలా వస్తోందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. గాయత్రి, మేడారం పంపింగ్ వ్యవస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణను రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం సిద్ధం చేసిన రాయదుర్గం–ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టును రద్దు చేసింది రేవంత్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇటీవల దివంగతుడైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపైనా కేసులు పెట్టారని మండిపడ్డారు. పౌర సరఫరాలు, విద్యాశాఖ అవినీతి అంశాలను బయటపెట్టి ఈడీ, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడినందుకే ఆయనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు.


