చికిత్స పొందుతున్న విద్యార్థినులు
27 మంది విద్యార్థినులకు అస్వస్థత
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్తో 27 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారికి స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించారు. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా వారికి ఏఎన్ఎం మాత్రలు అందించగా తగ్గాయని చెబుతున్నారు.
సోమవారం ఉదయం విద్యార్థినులు కిచిడి తిన్నాక కొంతసేపటికి 27 మంది అస్వస్థతకు గురవడంతో వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స అందించారు. సమాచారం అందుకున్న జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి నారాయణరెడ్డి, తహసీల్దార్ విజయసాగర్ ఆస్పత్రిని సందర్శించి విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరాతీశారు. అనంతరం హాస్టల్కు వెళ్లి మిగతా విద్యార్థినుల పరిస్థితిని పరిశీలించారు. కాగా, అన్నంలో పురుగులు వస్తున్నాయని, భోజనం బాగుండడం లేదని విద్యార్థినులు వాపోయారు.
వార్డెన్ షేక్ యాకూబ్ సమయపాలన లేకుండా విధులకు హాజరవుతారని తెలిసింది. విద్యార్థినుల ఆరోగ్యంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విరీన్ మాట్లాడుతూ విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి వచ్చారని, ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు.


