breaking news
Gurukul school students
-
అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైన గురుకుల పాఠశాల విద్యార్థులు
కర్నూలు (శ్రీశైలం ప్రాజెక్టు) : ఏపీ గిరిజన గురుకుల ప్రతిభా పాఠశాల విద్యార్థులు అమెరికా హార్వర్డ్ యూనివర్శిటీ, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఎంపికైనట్లు ఐటీడీఏ పీఓ ఈసా రవీంద్రబాబు తెలిపారు. ఈ సదస్సు హైదరాబాద్లో ఈ నెల 13 నుంచి 16 వ తేదీ వరకు జరుగనుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న తాటి వెంకటలక్ష్మి, భూమని చెంచులక్ష్మి, యాకసిరి శివకుమార్, చేవూరి నాగరాజులు సదస్సులో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ సదస్సుకు దేశ,విదేశాల నుంచి నిపుణులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొని విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన, అటవీ సంరక్షణలపై చర్చలు జరుపుతారని చెప్పారు. -
‘గురుకుల’ అక్రమాల గుట్టు రట్టు
* పాఠశాలను తనిఖీ చేసిన అధికారులు * అక్రమంగా దాచిన సరుకుల స్వాధీనం * తప్పుదారి పట్టించిన సిబ్బంది * వాచ్మన్పై పోలీసులకు పిర్యాదు నిజాంసాగర్ : గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి నెలా అందిస్తున్న సరుకులలో కోత విధించి వాటిని పక్కదారి పట్టిస్తున్నవారి గుట్టును సోమవారం అధికారులు రట్టు చేశారు. మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గేట్ వద్ద గల తెలంగాణ సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో సరుకులు పక్కదారి పడుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు సోమవారం ఎంపీడీఓ నాగరాజు, ఈఓపీఆర్డీ సాయిబాబా అకస్మిక తనిఖీలు చేశారు. అధికారుల రాకను గమనించిన ప్రిన్సిపాల్తోపాటు ఇతర సిబ్బంది వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. సరుకుల వివరాలను తెలిపేందుకు ప్రిన్సిపాల్ గోదావరి వారిని స్టాక్ రూంకు తీసుకెళ్లగా అదేసమయంలో ఇతర సిబ్బంది సమీపంలోని మరోగదిలో అక్రమంగా దాచిన చింతపండు, బియ్యం, గోధుమపిండి, పప్పుకారం, కొబ్బరి ఇతర సరుకులను దగ్గర్లోని వాచ్మన్ గదిలోకి మార్పించే ప్రయత్నం చేశారు. దీనిని గుర్తించిన అధికారులు వెంటనే వాచ్మన్ గదిని సోదా చేసి, స్నానాల గదిలో అక్రమంగా దాచిన 30 కిలోల చింతపండు, 20 కిలోల గోధుమపిండి, 40 కిలోల బియ్యం, 25 కిలోల పెసరపప్పు, 5 కిలోల కొబ్బరి, 40 ప్యాకెట్ల కారం, 30 ప్యాకెట్ల సేమియాను స్వాధీనం చేసుకున్నారు. వాచ్మన్ను పోలీసులకు అప్పగించారు. వెలుగుచూసిన అక్రమాలు అధికారుల తనిఖీలో గురుకుల పాఠశాలలోని అనేక అక్రమాలు వెలుగు చూశాయి. విద్యార్థులకు అందించే సరుకులలో కోత విధించి, అట్టి సరుకులను ప్రతి వారం ఆటోలో నింపి మార్కెట్కు తరలించి అమ్ముకుంటారని విద్యార్థులు తెలిపారు. రోజూ తమకు సన్న బియ్యంతోపాటు దొడ్డు బియ్యం కూడ కలిపి వండి పెడుతున్నారని చెప్పారు. ప్రతి నెలా విద్యార్థులకు ప్రభుత్వం తరపున వచ్చే డబ్బులను సైతం ఇవ్వడంలేదన్నారు. ఈ వివరాలన్నింటితో కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు ఎంపీడీఓ నాగరాజు తెలిపారు.