
కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు
చనిపోయిన గిరిజన విద్యార్థులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
చికిత్స పొందుతున్న విద్యార్థులకు రూ.లక్ష ఇవ్వాలి
లేదంటే బాధిత కుటుంబాల తరఫున న్యాయ పోరాటం చేస్తాం
కేజీహెచ్లో గిరిజన విద్యార్థులను పరామర్శించిన మాజీ సీఎం
ప్రతి విద్యార్థితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి ఆరా
తమను ఎవ్వరూ పట్టించుకోలేదని పిల్లల తల్లులు చెబుతున్నారు
హాస్టళ్లలో పిల్లలు చదివేలా, బతికే పరిస్థితులుండేలా చూడండి
చేసిన తప్పులు ఒప్పుకుంటే దేవుడు క్షమించొచ్చని హితవు
మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల పరిహారం
జగన్ను కలవకుండా తల్లిదండ్రులను నిర్బంధించిన పోలీసులు
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆస్పత్రిలో 64 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. 200 కిలోమీటర్ల దూరం నుంచి కేజీహెచ్కు వచ్చారు. ఎంత సీరియస్గా ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారు? అయినా ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మార్గం. గిరిజన విద్యార్థులను పట్టించుకోకపోవడం దారుణం. మరోసారి ఈ తరహా దారుణాలు జరగకుండా సమస్య పరిష్కరించేలా చూడాల్సింది పోయి.. తప్పులు దాచాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చేసిన తప్పులు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షలు, చికిత్స పొందుతున్న విద్యార్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి. లేదంటే బాధిత కుటుంబాల తరఫున న్యాయ పోరాటం చేస్తాం.
కప్పిపుచ్చే కార్యక్రమం ఇకనైనా ఆపండి. హోం మంత్రి వాటర్ కంటామినేషన్ కాదు అని మాట్లాడుతుండటం ఆశ్చర్యం అనిపిస్తోంది. అసలు పచ్చ కామెర్లు నీటి కాలుష్యం వల్లే వస్తాయనే విషయం ఆమెకు తెలీదేమో! ఒకే స్కూల్ నుంచి 170 మందికి ఒకేసారి వచ్చిందంటే దేని వల్ల వచ్చింది? 65 మంది ఒకే స్కూల్కు చెందిన వారు జాండిస్తో ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ప్రభుత్వానికి? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడడం అలవాటైపోయింది. - వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థులను పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రి పాలైతే తప్పులు దాచాలని చూడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కురుపాంలోని గిరిజన బాలికల వసతి గృహంలో పచ్చకామెర్ల బారిన పడి చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని గురువారం రాత్రి ఆయన విశాఖలోని కేజీహెచ్లో పరామర్శించారు.
నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్యటన అనంతరం.. రాత్రి 8.15 గంటలకు కేజీహెచ్లోని పిల్లల వార్డుకు నేరుగా చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న 21 మంది విద్యార్థుల్ని పరామర్శించారు. బాధిత విద్యార్థులు, వారి తల్లులతో మాట్లాడి.. వ్యాధుల బారిన పడటానికి గల కారణాలు, హాస్టల్ వద్ద పరిస్థితులు, చికిత్స అందుతున్న తీరు.. తదితర విషయాలపై ఆరా తీశారు. మొదలైన వివరాల్ని ఆరా తీశారు. అందరికీ భరోసా కల్పించి.. త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించారు. అనంతరం కేజీహెచ్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
నీటి కాలుష్యమని వైద్యులు చెబుతున్నారు..
కురుపాంలోని గిరిజన బాలికల వసతి గృహంలో 5, 6, 7 తరగతుల పిల్లలు పచ్చ కామెర్లతో కేజీహెచ్లో చేరారు. పిల్లలు, వారి తల్లిదండ్రులు నీళ్లు బాగోలేవనే చెప్పారు. వైద్యులు కూడా నీటి కాలుష్యం కారణంగానే వ్యాధులు ప్రబలాయని చెబుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేస్తే వాటర్ కంటామినేషన్ ఎందుకు జరుగుతుంది? అది పని చేయడం లేదు. ఒకే హాస్టల్కు చెందిన దాదాపు 170 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు వస్తే.. ఇక్కడకు వచ్చిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలు దానికి గల కారణాల్ని, ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు. అంతేతప్ప.. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఎలా ఇవ్వాలి.. అక్కడ తలెత్తిన సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దానిపై ఆలోచించక పోవడం దారుణం.
పరిహారం ఇవ్వకపోతే న్యాయపోరాటం
అభం శుభం తెలియని ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. వారి కుటుంబాలకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. చికిత్స పొందుతున్న పిల్లల బాధ్యత ప్రభుత్వం తీసుకుని 170 మందికి రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలి. ఇది మెడికో లీగల్ కేసు. ఎస్టీ పిల్లలను పట్టించుకున్న పరిస్థితి లేని ప్రభుత్వం ఇది. ప్రభుత్వం వీరికి పరిహారం ఇవ్వకపోతే అవసరమైతే వైఎస్సార్సీపీ వీరి తరఫున కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసి మరీ.. పరిహారం ఇప్పించే కార్యక్రమం చేస్తుంది.
దేవుడు కూడా క్షమించడు..
తక్షణమే హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతు చేయించండి. బాత్ రూమ్లు రిపేర్ చేయాలి. శానిటేషన్పై దృష్టి పెట్టాలి. వసతుల
కల్పనపై శ్రద్ధ పెట్టాలి. ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకుని, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం దేవుడు కొద్దో గొప్పొ క్షమిస్తాడేమో. లేకపోతే దేవుడు కూడా క్షమించే పరిస్థితి ఉండదని గుర్తు పెట్టుకోవాలి. దీన్ని కప్పిపుచ్చే కార్యక్రమం ఇకనైనా ఆపండి. హోం మంత్రి వాటర్ కంటామినేషన్ కాదు అని మాట్లాడుతుండటం ఆశ్చÆý‡్యం అనిపిస్తోంది. అసలు పచ్చ కామెర్లు నీటి కాలుష్యం వల్లే వస్తాయనే విషయం ఆమెకు తెలీదేమో. 65 మంది ఒకే స్కూల్కు చెందిన వారు జాండిస్తో ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి ప్రభుత్వానికి? తప్పు ఒప్పుకోమని చెప్పండి. దానికి ప్రాయశ్చిత్తంగా ఏమేం చేయాలో చేయండి. చనిపోయిన ఇద్దరు పిల్లల తల్లులకు తోడుగా ఉండే కార్యక్రమం చేయాలి. పరిహారం ఇవ్వండి. వసతుల మీద ధ్యాస పెట్టండి. పిల్లలు బతికే పరిస్థితి.. చదివే పరిస్థితి ఉండేలా చర్యలు తీసుకోండి.
గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు
ఎవరైనా పట్టించుకున్నారా అని ఓ తల్లిని ప్రశ్నిస్తే.. ఎవరూ పట్టించుకోలేదని ఆవేదనతో చెబుతున్నారు. ఇదే పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణం ఆపకుండా కట్టించి ఉంటే ఆ ఆస్పత్రి అందరినీ కాపాడేది. 200 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆస్పత్రికి రాకుండా అక్కడే మెడికల్ కాలేజీ ద్వారా అందరి ప్రాణాలు బాగుపడేవి. దాన్ని నాశనం చేస్తున్నారు. గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పైగా అబద్ధాలు. నీటి కాలుష్యం లేదంటూ అవే అబద్ధాలు చెప్పుకుంటూ మళ్లీ దాని గురించి దుష్ప్రచారాలు చేయడానికి సిగ్గుండాలి’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)కు వైఎస్ జగన్ ఈ బాధ్యత అప్పగించారు.

ఆయన ప్రతిపక్ష నేత కాదు..
పోలీస్ కమిషనర్ ఓవరాక్షన్
విశాఖలో వైఎస్ జగన్ పర్యటనను ఆద్యంతం అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరికి కేజీహెచ్లో కురుపాం ప్రాంతానికి చెందిన పచ్చకామెర్ల బాధిత విద్యార్థుల్ని పరామర్శించేందుకు వచ్చినా.. అడుగడుగునా అవరోధాలు సృష్టించింది. కేజీహెచ్కు ఎవ్వరూ రాకుండా దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. స్వయంగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ వచ్చి.. కేజీహెచ్ని ఖాకీ వలయంలో బంధించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో వైఎస్ జగన్ మాట్లాడకూడదనే ఉద్దేశంతో.. పక్కనే ఉన్న సీఎస్సార్ బ్లాక్కు తరలించి.. అక్కడ నిర్బంధించారు.
వైఎస్సార్సీపీ నేతలు ఒత్తిడి తేవడంతో ఒక విద్యార్థిని తల్లికి మాత్రమే అనుమతించారు. మీడియాపైనా సీపీ బాగ్చీ చిందులు తొక్కారు. కేజీహెచ్ నుంచి మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ప్రతిపక్షనేత వస్తే మీడియాతో మాట్లాడనివ్వరా.. అని కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి సీపీ మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ఆయన ప్రతిపక్ష నేత కాదని, ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించారు. అలాగైతే.. మీడియా ఆయనతో మాట్లాడకూడదా.. అని అడగ్గానే అక్కడి నుంచి విçసురుగా వెళ్లిపోయారు. కేజీహెచ్ సిబ్బంది, వై§ý ్యులు, రోగుల బంధువులు వైఎస్ జగన్ని చూసేందుకు పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా పెద్ద ఎత్తున పిల్లల వార్డుకు చేరుకున్నారు. వందల మంది పోలీసులతో బందోబస్తు పెట్టినా అభిమానాన్ని ఆపలేక తుదకు చేతులెత్తేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మా పాప చనిపోయింది
మా పాప కల్పనకు సరైన ట్రీట్మెంట్ అందలేదు. ప్రభుత్వం తరఫున ఎవ్వరూ పట్టించుకోలేదు. మా పాపను ఇక్కడికి తీసుకు రావడానికి ఎంత కష్టపడ్డామో.. అయినా మంచి వైద్యం అందలేదు. ఎన్నో రోజుల నుంచి బాగోలేకపోయినా హాస్టల్ వాళ్లు చెప్పలేదు. కురుపాం, పార్వతీపురం, విజయనగరం, వైజాగ్.. ఇలా పలు చోట్ల ఆస్పత్రులకు తిప్పాను. ఎక్కడా సరైన ట్రీట్మెంట్ చేయలేదు. ఐసీయూలో పెట్టలేదు. మా పాపకు ఆక్సిజన్ కూడా పెట్టలేదు. ఎవ్వరూ బతికించలేకపోయారు. ఇంత కష్టం వచ్చినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్లే మా పాప చనిపోయింది. – మృతి చెందిన కల్పన తల్లి తోయక జయమ్మ