ఫైల్ఫోటో
- జీవో నెంబర్ 15ని తక్షణం రద్దు చేయాలి
- వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు డిమాండ్
- ఆలయ భూముల దోపిడీకే ఆ జీవో విడుదల
విజయవాడ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆలయాల్లో అపచారాలు, దారుణాలు, దుర్ఘటనలు నిత్యకృత్యమయ్యాయని, వాటిని సమీక్షించి సరిదిద్దాల్సిన ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేయడంతో కూటమి నాయకులు చివరకు ఆలయాల అర్చకులపైనా దాడులు చేస్తున్నారని వైయస్సార్సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మండిపడ్డారు.« ధార్మిక సంస్థలకు లీజు పేరుతో ఆలయాలకు చెందిన విలువైన భూములు కాజేసేందుకే కొత్తగా జీఓ నెం:15 జారీ చేశారని ఆరోపించిన వారు, ప్రభుత్వం తక్షణమే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆలయాల్లో ఇటీవల వరసగా అపచారాలు, దుర్ఘటనలు జరుగుతున్నాయని, దీంతో దర్శనాల కోసం వచ్చే భక్తులు తగ్గిపోతున్నారని చెప్పారు. మరోవైపు అర్చకుల మీదా దాడులు జరుగుతున్నాయని గుర్తు చేసిన వారు, వాటిని అరికట్టేందుకు తక్షణం ప్రత్యేక చట్టం తేవాలన్నారు. దుర్గ గుడి ఘాట్ రోడ్ వద్ద ఉన్న ‘శ్రీ కామధేనువు అమ్మవారి’ ఆలయం వద్ద మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు స్పష్టం చేశారు.
దుర్గగుడిలో జరుగుతున్న అపచారాలకు ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టేలా చూడాలని, ఆ దిశలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని.. ముఖ్యంగా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు కోరారు. అమ్మవారికి ప్యాకెట్ పాలతో అభిషేకాలను తీవ్రంగా తప్పు పట్టిన వారు, తక్షణం గోశాలను కానూరు నుంచి కొండ మీదకు తరలించాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో భక్తులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. తనకుతాను సనాతన హిందూవాదిగా ప్రకటించుకున్న డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇకనైనా స్పందించాలన్నారు.


