సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఎన్నికల నిర్వహణలో అనుభవాల మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం లక్ష్యంగా మూడు రోజుల అధికారిక పర్యటనకు బెల్జియంకు బయలుదేరారు. బెల్జియన్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ – ఇంటీరియర్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియల్లో పారదర్శకత, సమగ్రత, సామర్థ్యాన్ని మెరుగుపర్చే అంశాలపై రెండు దేశాల అధికారుల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. సీఈఓ సుధర్శన్ రెడ్డి నేతృత్వంలోని బృందంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి, సీఈఓ కార్యాలయ రాష్ట్ర శిక్షణ నోడల్ అధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బోయపాటి చెన్నయ్య, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఈఆర్వో కంకనాల అనంత రెడ్డి, నాంపల్లి నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ నం.97 బూత్ స్థాయి అధికారి వేముల ధ్రువ కుమార్ రెడ్డి ఉన్నారు.
పర్యటనలో భాగంగా బెల్జియన్ ఎఫ్పీఎస్ – ఇంటీరియర్, ఎఫ్పీఎస్ – ఫారిన్ అఫైర్స్ ఉన్నతాధికారులతో సమావేశాలు, కేయూ లూవెన్ యూనివర్సిటీ నిపుణులతో చర్చలు, బ్రస్సెల్స్లోని భారతీయ రాయబార కార్యాలయంలో సేవా ఓటర్లతో పరస్పర చర్యలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ (IIIDEM) ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ అవుట్రీచ్ కార్యక్రమంలో భాగమని అధికారులు తెలిపారు.


