ఎంపీడీవోల ద్వారా అన్ని శాఖల కార్యక్రమాల పురోగతి పర్యవేక్షణకు తాజాగా సీఎం ఆదేశాలు
టీచర్లు, ఇతర వ్యవస్థలు వారికే రిపోర్ట్ చేసేలా చర్యలు చేపట్టనున్న ప్రభుత్వం
1985కు ముందు ఉమ్మడి ఏపీలోనూ బీడీవో వ్యవస్థ ద్వారానే అన్ని పనుల నిర్వహణ
మెజారిటీ రాష్ట్రాల్లో బ్లాక్ డెవలప్మెంట్ వ్యవస్థ ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు.. గతంలో 2,3 మండలాలకు ఇన్చార్జీగా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు
మళ్లీ తెలంగాణలో ఆ వ్యవస్థ అమలు.. సాధ్యాసాధ్యాలపై అధికారుల్లో సందేహాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ గతంలోని ‘బ్లాక్ లెవల్’గ్రామీణ పరిపాలనకు రంగం సిద్ధమవుతోందా ? ముఖ్యంగా మండలాల స్థాయిలో అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలపై పర్యవేక్షణ అనేది పాత పద్ధతుల్లో సాగనుందా ? ఈ ప్రశ్నలకు ప్రభుత్వవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. 1985లో మండల వ్యవస్థ అమల్లోకి రాకముందు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ‘బ్లాక్ డెవలప్మెంట్ సిస్టమ్’కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం సందర్భంగా మండలాల్లో అన్ని శాఖల అభివృద్ధి పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) ద్వారా పర్యవేక్షింపజేయాలని పీఆర్శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మండలస్థాయిలో టీచర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర వ్యవస్థలన్నీ కూడా ఎంపీడీవోకే రిపోర్ట్ చేసేలా చర్యలు ప్రభుత్వం చేపట్టే అవకాశాలున్నాయనే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్లాక్ డెవలప్మెంట్ వ్యవస్థ ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో మనరాష్ట్రంలోనూ 2,3 మండలాలకు ఇన్చార్జీగా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు (బీడీవో) వ్యవహరించిన విషయం తెలిసిందే.
అయితే మళ్లీ తెలంగాణలో ఆ వ్యవస్థ అమలు సాధ్యాసాధ్యాలపై అధికారుల్లో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మండలస్థాయిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి పరిశీలన, అన్ని శాఖలకు సంబంధించిన పనుల పర్యవేక్షణ వంటివి ఎంపీడీవోల ద్వారా చేయొచ్చునేమో కానీ మొత్తం బ్లాక్ డెవలప్మెంట్ వ్యవస్థను మళ్లీ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం ఏ మేరకు సాధ్యమనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఆర్థిక పరంగా చూస్తే, బ్లాక్ డెవలప్మెంట్ వ్యవస్థ ఎక్కువ నిధులతో, మెరుగైన ఆర్థిక స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుంది. దీనికి భిన్నంగా మండల వ్యవస్థ పరిపాలనా పరంగా ప్రజలకు దగ్గరగా ఉన్నప్పటికీ, నిధులు, ఆర్థిక ఆమోదాల కోసం ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం వైపు చూడాల్సి రావడం దీని ప్రధాన బలహీనతగా పరిగణిస్తున్నారు. బ్లాక్ లెవల్ అభివృద్ధి (మధ్యస్థాయి పంచాయతీ) వ్యవస్థ మనదేశంలోని 20కు పైగా రాష్ట్రాలు, ఎంపిక చేసిన కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉంది. దేశవ్యాప్తంగా 6,700 కంటే ఎక్కువ మధ్యంతర బ్లాక్ పంచాయతీల ద్వారా పనిచేస్తోంది.
బ్లాక్ డెవలప్మెంట్ 3–అంచెల వ్యవస్థ ఇదీ...
–మొదటి అంచె (గ్రామ స్థాయి):గ్రామ పంచాయతీ
–రెండవ అంచె (మధ్యస్థ / బ్లాక్ స్థాయి): పంచాయతీ సమితి– ఇదే బ్లాక్ డెవలప్మెంట్ సిస్టమ్
–మూడవ అంచె (జిల్లా స్థాయి): జిల్లా పరిషత్
మండల వ్యవస్థ ఇలా...
– ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ పదవుల ఆధారంగా క్షేత్రస్థాయిలో ప్రజలు, నాయకులు దీనిని సహజంగా 5–అంచెల వ్యవస్థగా పరిగణిస్తారు. గ్రామీణ ఓటరు 5 రకాల ప్రతినిధులు/స్థాయిలను చూస్తారు.
– చట్టప్రకారం ఇవి 3 అంచెలే (గ్రామం, మండలం, జిల్లా) అయినప్పటికీ, అధికారాలు, ఎన్నికల విభజన వల్ల ఇది 5 అంచెలుగా (ఫైవ్ టైర్) కనిపిస్తాయి.
– గ్రామ పంచాయతీ కింది స్థాయి పాలన (సర్పంచ్ల ద్వారా)
– మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ): మండల స్థాయి ప్రజాప్రతినిధి
– మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్షుడు : మండల స్థాయి రాజకీయ అధినేత
– జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (జడ్పీటీసీ): జిల్లా స్థాయి ప్రజాప్రతినిధి.
– జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ (జడ్పీపీ) : జిల్లా స్థాయి రాజకీయ అధినేత 


