కాంగ్రెస్‌కు ఏటీఎం: అమిత్‌షా | Amit Shah Fires On Revanth Reddy Govt | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఏటీఎం: అమిత్‌షా

Jun 30 2025 1:04 AM | Updated on Jun 30 2025 1:04 AM

Amit Shah Fires On Revanth Reddy Govt

రేవంత్‌ సర్కార్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధ్వజం

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మించి అవినీతికి పాల్పడుతోంది

ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయి

బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి 

ఆపరేషన్‌ సిందూర్‌పై రాహుల్‌బాబా పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు

పదేళ్లలో పాకిస్తాన్‌కు భారత్‌ తడాఖా ఏంటో చూపించాం

మావోయిస్టులు వెంటనే హత్యాకాండను విడిచి లొంగిపోవాలి

బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఎన్నో ప్రయోజనాలన్న అమిత్‌షా

పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం..లోగో ఆవిష్కరణ

నిజామాబాద్‌ రైతు మహా సమ్మేళనం సభలో ప్రసంగం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ నాయకత్వానికి ఏటీఎంలా మారిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయని అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా కాళేశ్వరం, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, సింగరేణి నియామకాల వంటి వాటి ద్వారా రాష్ట్రాన్ని భారీగా లూటీ చేసి, ఏటీఎంలా మార్చి దోచేసుకుందని ఆరోపించారు. 

ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డిలతో కలిసి అమిత్‌షా ప్రారంభించారు. పసుపు రైతులతో మాట్లాడారు. పసుపు బోర్డు లోగోను ఆవిష్కరించారు. రైతు మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

అధికారం మారినా అవినీతి మారలేదు
‘రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ అవినీతి మారలేదు. బీఆర్‌ఎస్‌ చేసిన అవినీతిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మించి అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి. ఆపరేషన్‌ సిందూర్‌కు ఆధారాలు చూపించాలంటూ రాహుల్‌బాబా ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పాకిస్తాన్‌కు భారత్‌ తడాఖా ఏంటో చూపించింది. 

పదేళ్లలో మూడుసార్లు ఆ దేశంపై దాడి చేసింది. సర్జికల్‌ స్ట్రైక్స్, ఎయిర్‌ స్ట్రైక్స్‌ చేశాం. యూరి, పుల్వామా, పహల్‌గామ్‌ దాడులకు ధీటైన బదులు ఇచ్చాం. ఆపరేష¯న్‌ సిందూర్‌ ద్వారా పాకిస్తాన్‌ గడ్డపైకి వెళ్లి దాడి చేశాం. అక్కడి ఉగ్రవాదుల స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. కీలక టెర్రరిస్టులను మట్టుబెట్టింది. కానీ గతంలో కాంగ్రెస్‌ సర్కార్‌.. పాకిస్తాన్‌ విషయంలో మెతక వైఖరి అవలంబించింది..’ అని అమిత్‌షా విమర్శించారు. 

2026 మార్చిలోగా నక్సల్స్‌ ఏరివేత
‘దేశ భద్రతను మోదీ ప్రభుత్వం పటిష్టం చేçస్తోంది. దేశంలో అశాంతికి కారణమైన నక్సల్స్‌ ఏరివేతకు అపరేషన్‌ కగార్‌ చేపట్టాం. (ఆపరేషన్‌ కగార్‌ చేయాలా.. వద్దా అని సభికులను ప్రశ్నించారు) దశాబ్దాలుగా నక్సల్స్‌ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. లొంగిపోవాలని గతంలోనే హెచ్చరించినా లొంగిపోలేదు. అందుకే కగార్‌ చేపట్టాం. 2026 మార్చిలోగా దేశంలో నక్సల్స్‌ లేకుండా చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. మావోయిస్టులు వెంటనే హత్యాకాండను విడిచి లొంగిపోవాలి..’ అని కేంద్ర హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. 

పసుపు పంటకు రాజధానిగా ఇందూరు
‘తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భారతీయ సంప్రదాయాల్లో, ఔషధాల తయారీలో వినియోగించే పసుపు పంటను నిజామాబాద్‌ జిల్లా రైతాంగం అధికంగా సాగు చేస్తోంది. అందుకే ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రధాని మోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డును నెలకొల్పారు. 

ఇప్పుడు నిజామాబాద్‌ పసుపు పంటకు రాజధాని నగరంగా మారింది. నిజామాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అనేక దశాబ్దాలుగా ఈ పంట పండిస్తున్నప్పటికీ రైతులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా లాభాలు సమకూరడం లేదు. ప్రస్తుతం బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఇప్పుడు అందుతున్న మద్దతు ధర కంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో క్వింటాలుకు అదనంగా కనీసం రూ.7 వేల వరకు ఎక్కువ ధర దక్కుతుంది. 

ఎగుమతులు భారీగా పెరిగితే ధర కూడా భారీగా పెరిగిపోతుంది. పసుపు బోర్డు ద్వారా రైతులకు నాణ్యమైన పంటను సాగు చేసేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతుల వరకు దళారుల ప్రమేయం లేకుండా చేయడం జరుగుతుంది. 

2030 వరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక బిలియన్‌ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్‌ కోఆపరేటివ్‌ ఎక్స్‌పోర్ట్‌ లిమిటెడ్, ఆర్గానిక్‌ పంటను ప్రోత్సహించేందుకు రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లను నెలకొల్పుతోంది..’ అని అమిత్‌షా వెల్లడించారు.

స్థానిక రైతుల పోరాటం ఫలించింది: తుమ్మల
తెలంగాణ పసుపు రైతుల చిరకాల వాంఛను గుర్తించి పసుపు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. బోర్డు ఏర్పాటుతో ఈ ప్రాంత రైతుల పోరాటం ఫలించినట్లయిందని అన్నారు. బోర్డు ద్వారా అధునాతన సాగు విధానాలు, యాంత్రీకరణ, సరికొత్త పరిశోధనలు, మెరుగైన మార్కెటింగ్, ఎగుమతుల వంటి వసతులతో పసుపు రైతులకు ప్రయోజనం కలిగేలా కేంద్రం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తోందని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల కోసం ఏడాది కాలంలోనే రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేశామని చెప్పారు. బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డును ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. 

కార్యక్రమంలో బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్‌ ఆర్‌.భూపతిరెడ్డి, కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, కోఆపరేటివ్‌ యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement