సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైందని.. వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ(గురువారం) కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి నరేంద్ర పరామర్శించారు.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. విజయలక్ష్మి చెల్లి దుర్గ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు. హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. జూన్ 15వ తేదీన కోర్టు ఆర్డర్ వచ్చాక మా దృష్టికి తెలిసింది. సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే
..సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా?. కసబ్ను కూడా విచారించాకే శిక్ష విధించారు. సాయికృష్ణ డెడ్బాడీ లేకుండా చేశారు. కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది. సాయికృష్ణ కుటుంబం మా పార్టీ కాదు. అయినా మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేం రాజకీయాలు చేయాలంటే చాలా అంశాలున్నాయి
..సాయికృష్ణ అంశాన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా అందరూ సాయికృష్ణ కుటుంబం కోసం కలిసిరావాలి. పోలీసుల దుర్మార్గపు చర్యలను నిలదీద్దాం. మేం ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి. మానవసమాజం తలదించుకునే ఘటన ఇది.
ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి. పోలీస్ కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వానికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?. అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి. పోలీసు విచారణతో న్యాయం జరగదు. సీబిఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేసినట్లే కేసును కూడా బూడిద చేయాలని చూస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళతాం. సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతోనే నేరం సగం అంగీకరించారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.


