
సాక్షి, గుంటూరు: ఏడాది కూటమి పాలనలో సూపర్ సిక్స్ను అమలు చేసేశాం అంటూ నిసిగ్గుగా సీఎం చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులోని క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన, సూపర్సిక్స్తో పాటు 143 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నామని ఆక్షేపించారు. అయినా ఎల్లో మీడియాలో అద్భుతమని పొగిడించుకోవడం, గొప్ప పాలకుడని డప్పు కొట్టించుకోవడం చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని గుర్తు చేశారు. చివరకు తల్లికి వందనం పథకంలోనూ ఏకంగా 30 లక్షల మందిని తగ్గించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:
నిస్సిగ్గుగా ఆత్మస్తుతి:
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చారు. జాతీయ మీడియాలో సక్సెస్ స్టోరీలు రాయించారు. హైదరాబాద్ నుంచి ఎల్లో మీడియా ఛానళ్లను పిలిపించుకుని, ప్రత్యేక ఇంటార్వ్యూలు ఇచ్చి భజన చేయించుకున్నారు. ఆ మూడు ఎల్లో మీడియా సంస్థల ప్రతినిధులు చంద్రబాబే సిగ్గుపడే స్థాయిలో ఆయనను ప్రశంసించారు. అద్భుతమైన పొగడ్తలతో డప్పు కొట్టే కార్యక్రమం చేశారు. అంత నిస్సిగ్గుగా చంద్రబాబు ఆత్మస్తుతి కొనసాగింది.
తల్లికి వందనంలోనూ వంచన:
సూపర్సిక్స్లో తల్లికి వందనం పథకాన్ని తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఈ ఏడాది ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, తాను అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. మా ప్రభుత్వంలో 84 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చాం. కానీ, ఈరోజు చంద్రబాబు కేవలం 58 లక్షల మందికే ఇస్తున్నారు. అంటే 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టేశారు. వైఎస్ జగన్ రూ.15 వేలు ఇస్తూ, టాయిలెట్లు, స్కూల్స్ నిర్వహణ కోసం రూ.2 వేలు మినహాయించారు. దాన్ని ఆనాడు నారా లోకేష్ పెద్ద ఎత్తున విమర్శిస్తూ రెండు వేలు లాగేశారు. రూ.13 వేలు మాత్రమే ఇచ్చారని చెప్పరాని భాషలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
కానీ, ఇప్పుడు కూడా అవే రూ.13 వేలు ఇచ్చారు. స్కూళ్ల కోసం, విద్యా రంగం కోసం మిగిలిన మొత్తం వ్యయం చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంటే మేం చేస్తే తప్పు, మీరు చేస్తే మాత్రం అది ఒప్పు అవుతుందా? ఇలా ఊరసవెల్లిలా మాట్లాడటానికి నారా లోకేష్కు సిగ్గుందా?. తల్లికి వందనంపై ఒకవైపు తండ్రి సీఎం చంద్రబాబు మొత్తం బడ్జెట్ రూ.10,091 కోట్లు అంటుంటే, మరోవైపు ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ మాత్రం రూ.8,745 కోట్లు అని చెబుతున్నారు. మరి ఇలా ఇద్దరు వేర్వేరుగా ఎందుకు తప్పుడు లెక్కలు చెబుతున్నారో అర్థం కావడం లేదు.
సూపర్ సిక్స్కు రూ.81 వేల కోట్లు కావాలి:
సూపర్ సిక్స్తో పాటు 143 హామీలను ఇచ్చి, వాటిని నెరవేరుస్తామని మాట ఇచ్చి, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. తరువాత అన్ని హామీలను గాలికి వదిలేశారు. వాటికి కావాల్సిన నిధులను కూడా కేటాయించలేకపోతున్నారు. సూపర్ సిక్స్ అమలు చేయాలంటే రూ.81 వేల కోట్లు అవసరం. వాటి అమలు లేదు. మరోవైపు ఈ ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.1,58,604 కోట్లు వివిధ సంస్థల నుంచి రికార్డు బ్రేక్ చేస్తూ అప్పులు తెచ్చారు.
ఈ సొమ్ము ఏం చేశారో తెలియదు. కూటమి పాలన ఇంత దౌర్భాగ్యంగా ఉంటే, తమ పాలన అద్భుతం అని ఎల్లో మీడియాలో చెప్పుకోవడానికి సిగ్గు పడాలి. తల్లికి వందనంలో దగా, మోసం. విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమలు చేసిన అమ్మ ఒడి లెక్కలు తనకు అర్థం కావడం లేదంటూ అమాయకంగా మాట్లాడుతున్నాడు. ఆ మాత్రం అర్థం కాని మొద్దు అబ్బాయినని లోకేష్ అంగీకరిస్తున్నారా?.
నాడు పథకాలకు రూ.4.58 లక్షల కోట్లు:
వైఎస్సార్సీపీ కేవలం నాలుగు పేజీల మేనిఫేస్టోను విడుదల చేసి, వాటిలో ఏడాదిలోనే 90 శాతం అమలు చేసింది. తొలి ఏడాదిలోనే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు మేలు చేసింది. రూ.40,627 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. అయిదేళ్ళలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద రూ.2,73,756.17 కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశాం. నాన్ డీబీటీ కింద రూ.1,84,604.32 కోట్లు ప్రయోజనం చేకూర్చాం. అలా మొత్తం రూ.4,58,360.43 కోట్లతో అయిదేళ్ళలో ప్రజలకు వివిధ పథకాల కింద ప్రయోజనం కలిగించాం.
మహిళలకు ఇచ్చిన హామీల అమలు ఏదీ?:
ఆడబిడ్డ నిధి ప్రకారం 18 ఏళ్లు నిండిన మహిళలు రాష్ట్రంలో 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ళ వారు 1.80 కోట్ల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాల్సి వస్తే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా ఈ పథకం ఎగ్గొట్టారు. ఈ ఏడాది ఇస్తారో లేదో తెలియదు. దీపం పథకం కింద 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
ఒక్కో కుటుంబానికి మూడు సిలెండర్లు ఇవ్వాలంటే ఒక్కో సిలెండర్ రూ.850 చొప్పున మొత్తం ఏడాదికి రూ.4,083.48 ఖర్చు చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు కేవలం ఒక్క సిలెండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, దానికి చేసిన వ్యయం రూ.865 కోట్లు మాత్రమే. దీపం పథకాన్ని అమలు చేసేశామని చెప్పుకున్నారు. ఈ పథకంలో మొత్తం రూ.3218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు అన్నారు. ఈ పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.3500 కోట్లు అవసరం. గత ఏడాది పూర్తిగా దీనిని ఎగ్గొట్టేశారు.
హామీల అమలుకు కేటాయింపులు ఏవీ?:
యాబై ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అన్నారు. రాష్ట్రంలో ఈ కేటగిరిలో మొత్తం 20 లక్షల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.4000 చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే ఏడాదికి రూ.9600 కోట్లు ఇవ్వాలి. గత ఏడాది ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000 భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అలా ఇవ్వాల్సి వస్తే రూ.7200 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ, ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే రైతుభరోసా కింద కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.1,716 కోట్లు ఇవ్వాల్సి ఉంటే, దానికీ పంగనామాలు పెట్టేశారు.
సాక్షి కార్యాలయాలపై దాడులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి:
కొమ్మినేని శ్రీనివాసరావు వంటి సీనియర్ జర్నలిస్ట్ను కక్ష సాధింపుతో అరెస్ట్ చేసిన ఘటనపై సుప్రీంకోర్డు మొట్టికాయలు వేసింది. అయినా గుంటూరులో తెలుగుదేశం పార్టీ మహిళలు వైయస్ భారతమ్మ క్షమాపణలు చెప్పాలని ధర్నా చేశారు. అంతకు ముందు టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల సాక్షి మీడియాపై విషం చిమ్మారు. కార్యాలయాలపై దాడులు చేశారు. తక్షణం వీటికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.
సభ్యత, సంస్కారంతో వ్యవహరించాలని చంద్రబాబు, లోకేష్ను హెచ్చరిస్తున్నాం. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీని భూ స్థాపితం చేయాలని చంద్రబాబు కలలు కంటున్నారు. తెలుగుదేశం తప్ప ఈ రాష్ట్రంలో మరే రాజకీయ పార్టీ ఉండకూడదని ఆయన అనుకుంటున్నారు. కానీ, అది ఏ మాత్రం సాధ్యం కాదు. నిజానికి రాబోయే రోజుల్లో చంద్రబాబు మళ్లీ రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి వస్తుందని అంతా అంటున్నారని అంబటి రాంబాబు చెప్పారు.