
పులి అడుగు జాడలు
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ సంతోష్పూర్ గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామంలోని పింటూ నాయక్ అనే రైతు గ్రామ శివారులోని కొండమీద ఆవు కళేబరం కనిపించినట్లు తెలియజేశాడు. ఆవు కళేబరం పక్కనే పులి అడుగు జాడలు కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం అందజేశారు. నారాయణపూర్ అటవీ రేంజ్ అధికారులు సంతోష్పూర్ గ్రామానికి వెళ్లి పులి అడుగులను పరిశీలించారు. సంఘటన స్థలంలో కనిపించిన పాద ముద్రలను భువనేశ్వర్లోని పోరెన్సిక్ ల్యాబ్కు పంపించనున్నామని, అయితే అవి పులి అడుగు జాడలని నిర్ధారించుకోలేదని ఏసీఎఫ్వో అశోక్ కుమార్ బెహరా తెలియజేశారు. రాత్రి సమయంలో గ్రామస్తులు బయట తిరగరాదని, వారి ఆవులు, మేకలు, కోళ్లను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు. రెండు డ్రోన్ల సాయంతో ఆ జంతువు అచూకీ కోసం గాలిస్తున్నామని అటవీ అధికారులు తెలియజేశారు. ఉదయం ఇంటి వద్ద కనబడిన ఆవు, సాయంత్రం ఆరు గంటల తర్వాత కళేబరమై కొండమీద కనబడిందని పేర్కొన్నాడు.

ఆవు కళేబరం