రాయగడ: దేశ విభజన సమయంలో జరిగిన విషాద ఘటనలను స్మరించుకుంటూ, ఆ దారుణ పరిణామాల్లో ప్రాణాలు కోల్పొయిన లక్షలాది మంది అమాయకులకు ఘన నివాళులు అర్పించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక బిజు పట్నాయక్ ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, అదనపు కలెక్టర్లు రవీంద్రనాథ్ కుహరొ, నిహారి రంజన్ కుహరో, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి సుస్మిత బౌరి తదితరులు పాల్గొన్నారు. రాయగడ మహిళా కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు రౌమ్య రంజన్ సాహు ముఖ్యవక్తగా హాజరయ్యారు. సామూహిక వందేమాతరం గీతాన్ని ఆలపించారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పొయిన వారి స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. విభజన విషాదంపై రూపొందించిన లఘుచిత్రాన్ని, జయ జగన్నాథ్ నాట్యకళా పరిషత్ ఆధ్వర్యంలో నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.


