పబ్లిక్హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంపై విమర్శలు
ఒకే స్టేషన్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఇంజినీర్లు
మంత్రుల సిఫారస్, అధికారుల సాకులతో నిబంధనలకు తూట్లు?
జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పేర్లతో నగరంలోనే కొనసాగించే యత్నాలు
సాక్షి, సిటీబ్యూరో: పబ్లిక్హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో బదిలీల ప్రక్రియపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే స్టేషన్న్లో నాలుగేళ్లు పూర్తిచేసుకున్న అధికారులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ, పలువురు కీలక ఇంజినీర్లు అదే స్థానాల్లో కొనసాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఇంజినీరింగ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. పలువురు ఇంజినీర్లు ఇద్దరు, ముగ్గురు మంత్రుల సిఫారస్ లేఖలతో బదిలీలపై ప్రభావం చూపుతున్నారనే విమర్శలన్నాయి. ప్రభుత్వం బదిలీలు పారదర్శకంగా జరగాలని స్పష్టంగా ఆదేశించినా పట్టించుకోకపోవడం గమనార్హం.
‘గ్రేటర్’కు ప్రత్యేక నిర్వచనమా?
జీహెచ్ఎంసీ విభజనకు ముందు ఉన్న మొత్తం నగర ప్రాంతాన్ని ఒకే స్టేషన్గా పరిగణించాల్సి ఉండగా, ఇప్పుడు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలను వేర్వేరు స్టేషన్లుగా చూపిస్తూ కొందరిని నగరంలోనే కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇంజినీర్ల సంఘం నాయకులు తెలిపిన సమాచారం ప్రకారం.. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ, వాటర్బోర్డు, ఎంఆర్డీసీఎల్ వంటి నగర పరిధిలోని ఏ విభాగంలో పనిచేసినా అది ఒకే స్టేషన్ కిందకే వస్తుంది. అయినప్పటికీ బదిలీల్లో వేర్వేరు కార్పొరేషన్లుగా చూపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కౌన్సెలింగ్పైనా అనుమానాలే
బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎంసీ, సీఎంసీల్లో పనిచేస్తున్న కొందరు అధికారులను తొలుత కౌన్సెలింగ్కే పిలవలేదని సమాచారం. నిరీ్ణత గడువులో కౌన్సెలింగ్ నిర్వహించలేదని, కొందరికి సమాచారం కూడా అందలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అధికారుల పనితీరుకు సంబంధించిన కాని్ఫడెన్షియల్ రిపోర్టులు సమయానికి అందించడంలో విభాగాధిపతులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఉన్నాయి.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో..
గతంలో జీహెచ్ఎంసీలో పనిచేసే ఇంజినీర్లకు ఇతర ప్రాంతాలకు బదిలీలు లేకపోవడంతో, చాలామంది పదవీ విరమణ వరకు ఒకేచోట కొనసాగేవారు. దీని వల్ల అవినీతి పెరిగిందనే ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వం నగరం బయటకు కూడా బదిలీలు చేసే విధానాన్ని తీసుకొచి్చంది. అయితే ఇప్పుడు అదే విధానాన్ని నిర్వీర్యం చేసేలా జీహెచ్ఎంసీ–సీఎంసీ–ఎంఎంసీ వేర్వేరు అన్న వాదనను తెరపైకి తీసుకొస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


