గన్నవరం: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్లో భాగంగా కారిడర్–1 కోసం మండలంలోని గన్నవరం, కేసరపల్లి గ్రామాల్లో బుధవారం సామాజిక ప్రభావ మదింపు కార్యక్రమం నిర్వహించారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం నియమించిన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) ప్రతినిధులతో కలిసి రెవెన్యూ, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఈ సర్వే జరిపారు. తొలుత స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మెట్రోరైలు స్టేషన్ నిర్మాణం కోసం భూసేకరణ చేయనున్న స్థలాల్లో ఈ మదింపు చేపట్టారు. తహసీల్దార్ కె. వెంకటశివయ్య పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి మార్కింగ్ చేశారు. భూముల వివరాలు, అనుభవదారుల సమాచారం, ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రజలపై కలిగే సామాజిక, ఆర్థిక ప్రభావాలను నమోదు చేశారు.
61.15 ఎకరాల సేకరణ..
తహసీల్దార్ వెంకట శివయ్య మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కోసం కేసరపల్లిలో ఏర్పాటు చేయనున్న మెట్రో డిపో కోసం 61.15 ఎకరాల భూములు సేకరించనున్నట్లు చెప్పారు. కేసరపల్లి, హెచ్సీఎల్, గన్నవరంలోని బుద్ధవరం బస్టాప్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్మించనున్న నాలుగు మెట్రో స్టేషన్ల కోసం మరో 1.35 ఎకరాలు భూసేకరణ చేయనున్నట్లు తెలిపారు. సామాజిక ప్రభావ మదింపు అనంతరం నివేదికతో పాటు ప్రణాళికను ఏఎస్సీఐ ప్రతినిధులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు చెప్పారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


