అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా (24) అకాల మరణం చెందడం అత్యంత విషాదకరమని రాష్ట్ర హోం మంత్రి వంగల పూడి అనిత అన్నారు. విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేటలోని ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం నివాసా నికి ఆమె మంగళవారం వచ్చారు. షిరీన్బేగం, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో అఫీఫా ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని హోం మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరును షిరీన్బేగం వీడియోలు చూపించి హోం మంత్రికి వివరించారు. ఈ విషాద సమయంలో షిరీన్ బేగం, ఆమె కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరారు. హోం మంత్రితో పాటు అడ్మిన్ డీసీపీ సరిత, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.


