అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలకు భరోసాగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ జరిగింది. జేసీ ఇలక్కియతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పెండింగ్లో ఉన్న, ఇప్పటికే పరిష్కరించిన పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా ఫిర్యాదుల పరిష్కార పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గత వారం నుంచి పెండింగ్లో ఉన్న పీజీఆర్ఎస్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అక్కడికక్కడే పరిష్కారమయ్యే సమస్యలను గుర్తించి వెంటనే పూర్తి చేయాలన్నారు. ‘అంకుశం’ బాధితులు న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో కలెక్టర్ లక్ష్మీశ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ‘మీరు మోసపోయారు.. ఇంత డబ్బులు ఇస్తా అంటే నమ్మారు ? కేసు నమోదు చేశారు కదా.. చూద్దాం’ అంటూ కలెక్టర్ చెప్పడంతో బాధితులు తిరుగుముఖం పట్టారు. కలెక్టర్ నుంచి ఆశించిన మేర భరోసా లభించకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దని కలెక్టర్ హెచ్చరించారు. మొత్తం 178 అర్జీలను స్వీకరించినట్లు లక్ష్మీశ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


