స్థానిక ఎమ్మెల్యే మొద్దునిద్ర వీడి రైతులకు సమాధానం చెప్పాలి నిరసన ప్రదర్శనలో వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము ర్యాలీలో పాల్గొన్న ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ హారిక, పార్టీ శ్రేణులు
నీరు ఉండి సాగుకు ఇవ్వని
పెడన: కాలువల్లో సరిపడా నీరున్నా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సాగునీరివ్వడం లేదని వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రమేష్(రాము) చెప్పారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఒక్కొక్క రోజు చొప్పున నాలుగు రోజులు రిలేదీక్షలు చేపట్టారు. ఐదో రోజైన సోమవారం పెడనలో నియోజకవర్గ స్థాయి నిరసన ప్రదర్శన(ర్యాలీ) నిర్వహించారు. పెడనలోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు చేరుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోగా, సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ కొనసాగించారు. పెడనలోని బంటుమిల్లి రోడ్డు సెంటర్ వరకు అక్కడ నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా తిరిగి పార్టీ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది.
ఎమ్మెల్యే ఇంటికే పరిమితమయ్యారు..
బంటుమిల్లి రోడ్డు సెంటర్లో రాము మాట్లాడుతూ.. కృష్ణా డెల్టాలో చాలా మంది రైతులు సాగునీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెడన నియోజకవర్గంలో సుమారు 80 వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా వీటిల్లో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో వరి సాగు వేశారని, మరో 30 వేల ఎకరాల్లో వరి సాగు వేయాల్సి ఉందని చెప్పారు. వీరంతా నీటి కోసం ఎదురు చూస్తున్నారని, వీరే కాదని కృష్ణాడెల్టా అంతా సాగునీటి విడుదల ఎప్పుడా అంటూ చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఇంటికే పరిమితం కారాదని, నియోజకవర్గంలోని వారందరికీ జవాబుదారీగా ఉండాలని ధ్వజమెత్తారు. మొద్దు నిద్ర విడిచి పెట్టి రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాగునీరు విడుదల చేయలేని వారు పచ్చిరొట్ట విత్తనాలను, వరి విత్తనాలను ఎందుకు సబ్సిడీపై అందజేశారని నిలదీశారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువులు ఎందుకు ఇస్తున్నారంటూ పేర్కొన్నారు. ఒక పక్క నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందని పేర్కొంటూనే, మరో పక్క ఎల్నినో ప్రభావంతో పంటలు ఎండిపోతున్నాయని, నీరు అందదని, పంటలు వేయొద్దని చెబుతన్నారని మండిపడ్డారు. నీరు ఇవ్వని పక్షంలో దశల వారీగా రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యచరణ వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణం సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ నాయకులు గరికపాటి రామానాయుడు, కొండవీటి నాగబాబు, తిరుమాని శ్రీనివాసరావు, మైలా రత్నకుమారి, మండల కన్వీనర్లు ముత్యాల నాగేశ్వరరావు, జల్లా భూపతిరావు, పిచ్చిక సతీష్, దావు బైరవలింగం, కటకం ప్రసాద్, ఎండీ ఖాజా, వన్నం శ్రీలత, జన్యావుల ఝాన్సీ, కొల్లాటి గంగాధరరావు, ఎంపీపీ రాజులపాటి వాణి, సంగా మధుసూదనరావు, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.


