వివాహితపై కత్తితో దాడి.. యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వివాహితపై కత్తితో దాడి.. యువకుడి ఆత్మహత్య

Feb 28 2024 1:58 AM | Updated on Feb 28 2024 9:36 AM

- - Sakshi

మహిళ పరిస్థితి విషమం వివాహేతర సంబంధమే కారణం

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): వివాహేతర సంబంధం నేపథ్యంలో నెలకున్న వివాదాల కారణంగా వివాహితపై యువకుడు కత్తితో దాడి చేసి.. ఆపై తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్యనారాయణపురం పీఎస్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. వివాహిత కొన ఊపిరితో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం వక్కలగడ్డ పవన్‌కుమార్‌, మాధురి.. వారి ఇద్దరి సంతానం గుడివాడలో నివసించేవారు. వారిద్దరూ ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.

ఈ క్రమంలో గుడివాడకు చెందిన నాని అనే యువకుడితో మాధురికి పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం ఆమె ఇంట్లో తెలియడంతో అతనికి దూరంగా ఉంది. అయినా యువకుడు ఆమె వెంటపడుతూ ఇబ్బందులకు గురిచేస్తుండేవాడు. గత వారం ఆమె తాను పని చేస్తున్న స్కూల్‌ నుంచి విజయవాడ బ్రాంచ్‌కు బదిలి చేయించుకున్నారు. ఇద్దరు పిల్లలతో పాటు శ్రీనగర్‌కాలనీలోని ఆమె తల్లి వద్ద ఉంటోంది. ఇది తెలుసుకున్న నాని తనను కాదంటున్న ఆమెను హత్య చెయ్యాలనే ఉద్దేశంతో మంగళవారం సాయంత్రం ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకుంటుండగా వివాహితతో వాగ్విదానికి దిగాడు. తన వెంటతెచ్చుకున్న కత్తితో ఆమె మెడమీద నరికాడు.

తీవ్ర రక్తస్రావంతో ఆమె అపస్మారకస్థితిలో పడిపోవడంతో మృతి చెందినట్లు భావించాడు. భయంతో నాని (36) కూడా ఇంట్లో ఉన్న నైలాన్‌ తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఎన్‌పురం సీఐ వెంకట నారాయణ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న మహిళను పోలీస్‌ వ్యాన్‌లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనంతరం ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement