నిజామాబాద్ అర్బన్: ఓటర్ల సంఖ్య, ఇతర అంశాలను ప్రాతిపదికగా చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా 28 పోలింగ్ కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ చేయడం జరిగిందన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీసీ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణను చేపట్టి ముసాయిదా జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. మొత్తం 1565 పోలింగ్ కేంద్రాలు ఉండగా, రేషనలైజేషన్ తరువాత ఆ సంఖ్య 1591కి చేరిందని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 12, బోధన్లో 9, బాన్సువాడలో ఒకటి, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో మూడు చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, నిజామాబాద్, బాన్సువాడ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రవీందర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఆయా పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


