అప్రమత్తతే కీలకం.. | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే కీలకం..

Jul 21 2026 1:54 AM | Updated on Jul 21 2026 1:54 AM

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పంటల మార్పు అవసరం

మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్సీ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పంటల సాగులో మార్పులు అనివార్యమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి సుదర్శన్‌రెడ్డి అన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో రైతులు వేసే పంటల విషయంలో ఆలోచన చేయాల్సి ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావం, నష్ట నివారణ చర్యలపై సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా ప్రత్యేకాధికారిణి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, నిజామాబాద్‌, కామారెడ్డి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్‌ సంగ్వాన్‌, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, రాకేశ్‌రెడ్డి, లక్ష్మీకాంతరావుతో కలసి ఉ మ్మడి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ఉద్యానవన, విద్యుత్‌, డీఆర్‌డీఏ, మున్సిపల్‌, ఇంజినీరింగ్‌ తదితర శాఖల అధికారులతో సమగ్రంగా చర్చించడంతోపాటు పలువురు రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని శ్రీ రాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టులతో పాటు అలీసాగర్‌, మాసాని ట్యాంక్‌, మంచిప్ప రిజర్వాయర్ల నీటినిల్వను తాగునీటి అవసరాలకే వినియోగించాలని చెప్పారు. ప్రాజెక్టులు ఈ సీజన్‌లో నిండే అవకాశం లేదని, రైతులు ప్రత్యామ్నయ పంటల సాగు ద్వారా నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తక్కువ నీటి అవసరాలు ఉన్న పంటలపై దృష్టిపెట్టాలని, అధికారులు సైతం ఆ యా పంటల సాగు కోసం ప్రోత్సాహం అందించాలన్నారు. ఆయిల్‌పామ్‌, జొన్నలు, రాగులు, కంది, కొర్రలు తదితర ప్రత్యామ్నయ పంటల సాగు తో ఎల్‌నినో లాంటి విపత్కర పరిస్థితులను సైతం రైతులు అధిగమించే అవకాశం ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ డిజైన్‌ రూపకల్పన నాటి నుంచే లోపాలు ఉన్నాయని, నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ సైతం ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వచేస్తే సమస్యలు వస్తాయని చెప్పిందన్నారు. ఆ ప్రాజెక్ట్‌ నుంచి నీటిని వినియోగించుకునే వీలులేకుండా పోయిందన్నారు. మొత్తానికి పనికిరాని ప్రాజెక్టుగా కాళేశ్వరం మిగిలిందని వ్యాఖ్యానించారు.

ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, ఇండియన్‌ ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ చైర్‌పర్సన్‌ కవితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్‌ నాటికి మరింత నీటి ఎద్దడి

ఈ ఏడాది జూన్‌ ప్రారంభం నుంచే అతి తక్కువ వర్షపా తం నమోదైందని జిల్లా ప్ర త్యేక అధికారిణి డాక్టర్‌ యో గితా రాణా అన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కన్నా 48 శాతం తక్కువ వర్షం కురిసిందన్నారు. సెప్టెంబర్‌ నాటికి నీటి ఎద్దడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసిందని తెలిపారు. ఇలాంటి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని సూచించారు. రైతులు పంటల మార్పిడికి సిద్ధంగా ఉండా లన్నారు. ఇప్పటికే జిల్లాలో 72 శాతం పంటల సా గు పూర్తికాగా, మిగితా పంటల సాగుకోసం స్వల్పకాలిక రకాలను ఎంపికచేసుకోవాలని కోరా రు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తా గునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నట్టు చెప్పారు.

సమీక్షా సమావేశంలో పాల్గొన్న కార్పొరేషన్‌ల మాజీ చైర్మన్‌లు మునిపల్లి సాయిరెడ్డి, అన్వేష్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి, ఉమ్మడి జిల్లా అధికారులు

ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోని నీరు

ప్రస్తుతానికి తాగు అవసరాలకే..

ప్రాజెక్టులు నిండే అవకాశాలు లేవు

ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టాలి

ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు

సుదర్శన్‌రెడ్డి

హాజరైన ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు

ప్రత్యామ్నాయం తప్పదు

ఎల్‌నినో ప్రభావం తీవ్రమవుతున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలి. జిల్లాలో చెరుకు సా గును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం. షుగర్‌ ఫ్యాక్టరీ సహకార సంఘం పునరుజ్జీవనానికి కృషిచేస్తాం. ఆయిల్‌పామ్‌, కూరగాయలు, కందులు, పెసర్లు, జొన్నలు వంటి ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత ప్రభు త్వం తీసుకుంటుంది. ఛత్తీస్‌గఢ్‌ తరహాలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం అందించే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. ఎల్‌నినో అనేది ఒక మార్పు.. ఈ మార్పుకు అనుగుణంగా రైతులు పంటల్లో మార్పులు చేసుకోవాలి.

‘‘ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశాం. క్షేత్రస్థాయిలో రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.’’

– నిజామాబాద్‌ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

‘‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆయిల్‌పామ్‌ వంటి పంటల సాగుపై దృష్టి పెట్టాలి. నాలుగేళ్ల తర్వాత ఈ పంటల రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కూరగాయలు, పప్పు దినుసులు, మిల్లెట్స్‌ సాగుకు రైతులు మొగ్గుచూపాలి.’’ – కామారెడ్డి కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement