● స్టాఫ్ నర్సుకు మెమో
రుద్రూర్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణికి ఎక్స్పైరీ టాబ్లెట్లు ఇచ్చిన ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఈనెల 17న సాక్షిలో ‘గర్భిణికి ఎక్స్పైరీ టాబ్లెట్స్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన సంబంధిత అధికారులు స్టాఫ్ నర్సుకు మెమో జారీ చేశారు. బాధితురాలికి బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రిలో స్కానింగ్ నిర్వహించడంతోపాటు టీ–హబ్ ద్వారా రక్త పరీక్షలు చేయించారు. స్కానింగ్, రక్త పరీక్షల నివేదికలు సాధారణంగా రావడంతో వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్లో పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, ఈ మేరకు జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా నివేదిక సమర్పించినట్లు వైద్య అధికారులు వెల్లడించారు.


