సాక్షి, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా “ఛలో అంకాపూర్” కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ధర్నాలు, ర్యాలీలు, బంద్ పిలుపులను పోలీసులు నిషేధించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ అమలు చేశారు.
ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వగా, కాంగ్రెస్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తమ కార్యకర్తలు అంకాపూర్కు తరలిరావాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. దీంతో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
కాంగ్రెస్, బీజేపీ నేతల ఛలో అంకాపూర్ పిలుపుల నేపథ్యంలో ఆయా పార్టీల ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆర్మూర్, అంకాపూర్ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఆర్మూర్, అంకాపూర్ ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ధర్నాలు, ర్యాలీలు, బంద్ పిలుపులను పోలీసులు నిషేధించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ అమలు చేశారు. ఇరు పార్టీల పిలుపులతో ఆర్మూర్ రాజకీయాలు మరింత వేడెక్కింది. మరోవైపు.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముందు పోలీసుల మోహరించారు.


