జుక్కల్‌ నియోజకవర్గానికి రూ.32 కోట్ల నిధులు | - | Sakshi
Sakshi News home page

జుక్కల్‌ నియోజకవర్గానికి రూ.32 కోట్ల నిధులు

Jun 21 2023 12:54 AM | Updated on Jun 21 2023 10:49 AM

మద్నూర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే - Sakshi

మద్నూర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

మద్నూర్‌(జుక్కల్‌): జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌, జుక్కల్‌, పెద్ద కొడప్‌గల్‌, పిట్లం, నిజాంసాగర్‌ ఐదు మండలాలకు రూ.32 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే హన్మంత్‌సింధే వెల్లడించారు. ఆయా మండలాల్లో నిధులను రోడ్డు వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ కోసం వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి రూ.335 కోట్లు మంజూరు చేశారని అన్నారు.

అతి త్వరలో డిగ్రీ కళాశాల..
మద్నూర్‌ మండల విద్యార్థులు, ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతి త్వరలో రాబోతుందని, దీంతో విద్యార్థుల కళ నెరవేరుతుందని ఎమ్మెల్యే హన్మంత్‌సింధే పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. మద్నూర్‌లో డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు కోసం తీవ్రంగా కృషి చేసినట్లు ఆయన అన్నారు.

ఆలస్యం లేకుండా మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు ఉత్తర్వులు త్వరలో వస్తాయని పేర్కొన్నారు. సెంట్రల్‌ లైటింగ్‌ మంజూరుతో బీఆర్‌ఎస్‌ నాయకులు టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేను స్థానిక ప్రజాప్రతినిధులు సన్మానించారు. సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు సురేష్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బన్సీపటేల్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ గంగాధర్‌, ఉప సర్పంచ్‌ విఠల్‌, నాయకులు కంచిన్‌ హన్మండ్లు, పాకాల విజయ్‌, కుషాల్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement