
తిరువనంతపురం: పాఠశాల విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించడానికి, వారు మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపకుండా ఉండేందుకు కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జుంబా శిక్షణను అందిస్తోంది. అయితే ప్రభుత్వం సదుద్దేశంతో ప్రారంభించిన ఈ శిక్షణపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేరళలోని పాఠశాలల్లో జుంబా ఫిట్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడంపై రాష్ట్రంలోని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు పాఠశాలల్లోని విద్యార్థులకు జంబాలో శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధమంటూ కేరళ సున్నీ యువజన సంఘం (ఎస్వైఎస్) రాష్ట్ర కార్యదర్శి అబ్దుస్సమద్ పూక్కొట్టూర్ ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు.
విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి టికె అష్రఫ్ కూడా దీనిని వ్యతిరేకించారు. బాలురు, బాలికలు పొట్టి దుస్తులు ధరించి సంగీతానికి అనుణంగా గెంతులు వేయడం ఏమిటి? ఇది నృత్యం చేసే సంస్కృతి కాదని, ఇటువంటి పాఠశాలలో తన కుమారుడిని తాను జాయిన్ చేయనని అన్నారు. ఉపాధ్యాయునిగా తాను ఈ తరహా నృత్యాన్ని పాఠశాలలో అమలు చేయనివ్వనని, దీనికి ప్రతిగా ఏ చర్య తీసుకున్నా, తాను సిద్ధమేనని ఆయన అన్నారు. ముస్లిం సంఘాల నుండి ఎదురవుతున్న విమర్శల మధ్య కేరళ విద్యా శాఖ.. జుంబా నృత్యం అనేది మానసిక, శారీరక శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని పేర్కొంది. మనం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. ఇది 2025. మనం ఆదిమ కాలంలో జీవించడం లేదు. ప్రతి ఒక్కరూ కాలానికి అనుగుణంగా నడుచుకోవాలని కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: నిందితులతో టీఎంసీ దోస్తీ?.. ఫొటోతో బీజేపీ ఆరోపణ