సాక్షి, చెన్నై: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరూ ఉండరంటారు.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అదే విషయం మరోసారి రుజువయ్యేలా కనిపిస్తుంది. ఇటీవలే ఇండియా కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేకు... రాహుల్ గాంధీ మరోసారి కలిసి పనిచేసేలా రాయబారం పంపినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే ...?
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా అధికార ఎన్టీఏ కూటమిని మరింత బలీయంగా మార్చగా అదే సమయంలో ఇండియా కూటమిని బలహీన పరిచాయి. కూటమిలో ప్రధానంగా ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోవడం.. అదే విధంగా టీవీకేకు మద్ధతిచ్చి మిత్ర ధర్మాన్ని పాటించలేదని ఆగ్రహం చెంది.. ఇండియా కూటమి నుంచి వైదొలిగింది. ఈ పరిస్థితులు నడుమ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా డీఎంకే అధినేత స్టాలిన్ "గౌరవనీయ ప్రతిపక్ష నాయకులు తిరు రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను." అని సాధారణంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అయితే దీనికి బదులిచ్చిన రాహుల్ గాంధీ "భారతదేశ భావనను, మన రాజ్యాంగాన్ని, సమాఖ్యవాదాన్ని పరిరక్షించాలనే మన ఉమ్మడి సంకల్పం మనకు మార్గదర్శకంగా కొనసాగుతుంది - ఇది మన ప్రజాస్వామ్య ఆత్మ కోసం చేసే పోరాటం, మనం గెలిచే వరకు దీన్ని కలిసికట్టుగా పోరాడతాం." అని ప్రత్యత్తరమిచ్చారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్టాఫిక్గా మారాయి. ఇండియా కూటమిలోకి మళ్లీ రావాలని రాహుల్ స్టాలిన్కు రాయభారం పంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా గతేడాది రాహుల్ గాంధీకి స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ "రక్త సంబంధంతో కాదు, ఆలోచన, దార్శనికత, లక్ష్య సాధన ద్వారా బంధించబడిన నా ఆదర్శ సోదరుడు మీరు ఇలాగే దృఢంగా నిలబడి, ధైర్యంతో నాయకత్వం వహించాలి. ఉజ్వల భారతదేశం వైపు మన పయనించే ఈ ప్రయాణంలో విజయం మనదే అవుతుంది." అని రాహుల్ ని ప్రశంసిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఏడాది మాత్రం నామమాత్రంగా విషెస్ చెప్పారు.


