‘బ్రాండ్ మోదీ’పై మాజీ రాష్ట్రపతి కుమార్తె సంచలన వ్యాఖ్యలు | What Pranab Mukherjee Asked PM Modi After His Landslide Victory | Sakshi
Sakshi News home page

‘బ్రాండ్ మోదీ’పై మాజీ రాష్ట్రపతి కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Jun 27 2026 12:20 PM | Updated on Jun 27 2026 12:28 PM

What Pranab Mukherjee Asked PM Modi After His Landslide Victory

న్యూఢిల్లీ: నాటి 2014 లోక్‌సభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే ముందు నరేంద్ర మోదీ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ ముఖర్జీ ఇటీవల ఒక వ్యాసంలో పంచుకున్నారు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనప్పటికీ, ఒకరిపట్ల ఒకరు చూపించుకున్న గౌరవం నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

ప్రణబ్ ముఖర్జీ సంధించిన ఆ ఒక్క ప్రశ్న
‘ప్రణబ్, మై ఫాదర్: ఎ డాటర్ రిమెంబర్స్’ పుస్తక రచయిత్రి అయిన షర్మిష్ఠ ముఖర్జీ కథనం ప్రకారం.. 2014 ఫలితాల అనంతరం మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లినప్పుడు, ప్రణబ్ ముఖర్జీ తనదైన ప్రొఫెసర్ శైలిలో, ‘ఈ ఎన్నికల ఫలితాలపై మీ విశ్లేషణ ఏంటి?’ అని మోదీని ప్రశ్నించారు. దానికి మోదీ స్పందిస్తూ, మూడు దశాబ్దాల తర్వాత దేశంలో ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ లభించిందని చెప్పారు. అయితే ప్రణబ్ అంతటితో ఆగకుండా, ‘ఇంకేముంది విశేషం?" అని అడిగారు. మోదీ మౌనంగా ఉండటంతో, భారత లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే అధికారికంగా ఒక కొత్త ముఖాన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి గెలిచిన తొలి ఎన్నికలు ఇవేనని ప్రణబ్ ముఖర్జీ గుర్తుచేశారు.

‘బ్రాండ్ మోదీ’ ప్రత్యేకత
ఆ ఎన్నికల్లో లభించిన భారీ మెజారిటీ కేవలం బీజేపీ పార్టీకి వచ్చింది మాత్రమే కాదని, అది నేరుగా నరేంద్ర మోదీకి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు (డైరెక్ట్ మాండేట్) అని షర్మిష్ఠ అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఎన్నికల తర్వాత ఎంపీలు ప్రధానిని ఎన్నుకోవడం లేదా కూటమి సమీకరణలను అనుసరించి నిర్ణయించడం జరుగుతుంది, కానీ 2014 లో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ, మోదీ తనదైన శైలిలో ప్రజల్లో ఒక ప్రత్యేక ప్రభావాన్ని (ఆరా) సృష్టించుకున్నారని, 2019, 2024 ఎన్నికల్లోనూ అదే నిరూపితమైందని, ఎవరైనా మోదీని ఇష్టపడవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు కానీ ‘బ్రాండ్ మోదీ’ని విస్మరించలేరని పేర్కొన్నారు.

పార్లమెంట్ మెట్లపై ఆ అపూర్వ క్షణం
మొదటిసారి ఎంపీగా గెలిచి, ఏకంగా ప్రధానమంత్రిగా పార్లమెంట్ భవనంలోకి అడుగుపెడుతున్న సమయంలో మోదీ భావోద్వేగానికి లోనై, పార్లమెంట్ మెట్లకు నమస్కరించిన అపూర్వ క్షణాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ చర్య దేశంలోని కోట్లాది మంది ప్రజల హృదయాలను తాకిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం చూసిన అత్యంత శక్తివంతమైన, అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానులలో నరేంద్ర మోదీ ఒకరని కొనియాడారు. లోపాలను త్వరగా గుర్తించి, తగిన మార్పులు చేసుకోవడం వల్లే బీజేపీ ఈ స్థాయి విజయాన్ని అందుకోగలిగిందని ఆమె విశ్లేషించారు.

ఇది కూడా చదవండి: వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement