మీడియాతో చిట్చాట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
డీలిమిటేషన్ బిల్లుపై సీఎం రేవంత్ వ్యాఖ్యల్లో తీవ్రత లేదు
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలపైనా తమకు ఒక స్పష్టత ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని భారత్ మండంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ అన్యాయం జరగదు..: డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో తీవ్రత లేదని అమిత్ షా కొట్టిపారేశారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లును ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. లోక్సభలో ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతమున్న నిష్పత్తి ప్రకారం అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లును రూపొందించినట్లు చెప్పారు. అందుకు కావాల్సిన మద్దతు లభించగానే బిల్లును ఆమోదింజేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.
బిల్లుకు అవసరమైన మద్దతు అభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వన్ నేషన్ వన్ బిల్లుపై ప్రస్తుతం కమిటీ అధ్యయనం చేస్తోందని.. నివేదిక రాగానే సబంధింత బిల్లుకు అవసరమైన మద్దతు లభిసుందని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీలు బలంగానే ఉన్నాయని.. తమతో కలిసి నడుస్తున్న ఏ ప్రాంతీయ పార్టీకీ ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యురాలిగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరణతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కమలనాథ్ ఆమె నామినేషన్ పత్రాలను నింపారు కాబట్టే తిరస్కరణకు గురై ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు.


