రాంచీ: స్పెషల్ ఇంటెన్సివ్ (SIR) ప్రక్రియలో దుమారం చెలరేగింది. భారత్ ఓటర్ల జాబితాలో అఫ్ఘనిస్థాన్ దేశస్థుల పేర్లు నమోదవ్వడంపై రాజకీయంగా వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఈ అంశం జార్ఘండ్లో చర్చాంశనీయంగా మారింది.
జార్ఖండ్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ వివాదాలకు దారి తీసింది. జంషెడ్పూర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలోని 286వ పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితాలో అసిల్ ఖాన్, మహమ్మద్ అస్లాం, మహమ్మద్ ఇబ్రహీం అనే ముగ్గురు అఫ్గానిస్థానీయుల పేర్లు వరుసగా 30, 31, 33 నంబర్లతో ఓటర్ల లిస్టులో కనిపించాయి. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విదేశీయుల పేర్ల ఎస్ఐఆర్ జాబితాలో ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు.
ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సందీప్ వర్మ జేఎంఎం- కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విదేశీ చొరబాటుదారుల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, తమ పార్టీ మొదటి నుంచీ చెబుతూనే ఉందన్నారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి కె. రవికుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ " ఓటర్ల జాబితాలో విదేశీయులను చేర్చడం ఒక తీవ్రమైన విషయం. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించాం. ఆ వ్యక్తులకు ఎవరు సహాయం చేశారు, ఏ ప్రక్రియ ద్వారా వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చారు అనే దానిపై దృష్టి సారిస్తాం. ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం," అని ఆయన స్పష్టం చేశారు.
అదే విధంగా ఓటర్ల జాబితాలో ఆ మూడు పేర్లు ఎలా చేర్చబడ్డాయి, ఈ ప్రక్రియలో ఏదైనా వ్యక్తి లేదా నెట్వర్క్ పాత్ర ఉందా అనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.


