తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు | Suresh Khanderao Petition In Supreme Court Over Tirumala Laddu, More Details Inside | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

Sep 23 2024 10:50 AM | Updated on Sep 23 2024 12:36 PM

Suresh Khanderao Petition In Supreme Court Over Tirumala Laddu

సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సురేష్  ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌లో లడ్డూ వివాదంపై సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని కోరారు. దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్థించారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు.. తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీపై వాస్తవాలను తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఒకవేళ సిట్టింగ్‌ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే, విచారణ నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. తద్వారా వాస్తవాల నిగ్గుతేల్చాలని కోరారు.

ఈ అభ్యర్థనతో తాము ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయనున్నామని, దీనిపై విచారణ జరపాలని ఆయన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనాన్ని కోరారు. శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి విషయంలో వాస్తవాలను తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని.. అందువల్ల నిజానిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు.

అందుకోసమే తాము ఈ వ్యాజ్యం దాఖలు చేస్తున్నామన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను తాము బుధవారం విచారిస్తామని, ఈలోపు పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్‌కు చురకలు

Advertisement
 
Advertisement
Advertisement