వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోం | Supreme Court hears challenge to Waqf Amendment Act | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోం

Apr 18 2025 3:51 AM | Updated on Apr 18 2025 3:51 AM

Supreme Court hears challenge to Waqf Amendment Act

మే ఐదో తేదీదాకా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డులు, మండళ్లలో నియామకాలు చేపట్టబోము  

సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్రప్రభుత్వం

న్యూఢిల్లీ: ఇప్పటికే వక్ఫ్‌ ఆస్తులుగా పరిగణనలో ఉన్న ఆస్తులను డీనోటిఫై చేయబోమని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. మే 5వ తేదీదాకా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డులు, మండళ్లలో నియామకాలు చేపట్టబోమని పేర్కొంది. అయితే వక్ఫ్‌ ఆస్తుల డీనోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామంటూ సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనపై మాత్రం కేంద్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.

 వక్ఫ్‌(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం గురువారం సైతం కొనసాగించింది. ఈ సందర్భంగా వక్ఫ్‌(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏడు రోజుల్లోపు స్పందన తెలియజేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా గురువారం కోర్టుకు తెలిపారు. 

చట్టంలోని సెక్షన్‌ 9, సెక్షన్‌ 14 ప్రకారం వక్ఫ్‌ బోర్డులు, కౌన్సిళ్లలో ఎలాంటి నియామ కాలను కేసు తదుపరి విచారణ తేదీదాకా చేపట్ట బోమని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ‘వక్ఫ్‌ బై యూజర్‌’ విధానం ద్వారా వక్ఫ్‌ ఆస్తులుగా రిజిస్ట్రర్‌ అయిన, ధృవీకరించబడిన ఆస్తులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డీనోటిఫై చేసి గందరగోళం చేయబోమని ఆయన మాటిచ్చారు. ‘‘ ఎంతో విస్తృతస్థాయి చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని చట్టంగా తీసుకొచ్చాక ప్రభుత్వ వాదన వినకుండానే ధర్మాసనం ఆ చట్టాన్ని నిలుపుదలచేయడం సహేతుకం అనిపించుకోదు. 

ప్రభుత్వంలో భాగమైన మేము పార్లమెంట్‌కు, ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు ‘వక్ఫ్‌ బై యూజర్‌’ నిబంధనపై తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి?’’ అని మెహతా ప్రశ్నించారు. దీనిపై సీజేఐ ఖన్నా స్పందించారు. ‘‘ 1995నాటి వక్ఫ్‌ చట్టం ప్రకారం గతంలో రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసుకున్న వక్ఫ్‌ ఆస్తులను ఈ కేసుల తదుపరి విచారణదాకా డీనోటిఫై చేయకూడదు’’ అని కేంద్రాన్ని ఆదేశించారు. గతంలో వక్ఫ్‌ ఆస్తులుగా కోర్టులు ప్రకటించిన ఆస్తుల డీనోటిఫైకు వీలుకల్పించే నూతన చట్టంలోని సెక్షన్లను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులకు ప్రతిపాదిస్తామని బుధవారం కోర్టు వ్యాఖ్యానించడం తెల్సిందే.

ప్రైవేట్‌ ఆస్తులనూ వశపర్చుకున్నారు
సెక్షన్ల నిలుపుదల ప్రతిపాదనను తుషార్‌ మెహతా తప్పుబట్టారు. ‘‘ చట్టంలోని సుదీర్ఘ సెక్షన్లను జడ్జీలు హడావిడిగా, యథాలాపంగా చదివి ఉండొచ్చు. చట్టబద్ధ్దమైన సెక్షన్‌ను నిలుపుదలచేయడం నిజంగా అరుదైన విషయం. ఈ విషయంలో ఈ చట్టం పూర్వాపరాలను జడ్జీలు మరోసారి పరిశీలించాలని వేడుకుంటున్నా. అన్ని వర్గాల నుంచి వినతులను స్వీకరించాకే ప్రభుత్వం ఈ సవరణ చట్టాన్ని తెచ్చింది. వక్ఫ్‌ పేరిట ప్రైవేట్‌ ఆస్తులనూ తమ వశం చేసుకున్నారు. 

కొన్ని చోట్ల గ్రామాల్లోని భూములు మొత్తం వక్ఫ్‌ పేరిట నమోదై ఉన్నాయి. లెక్కలేనన్ని ప్లాట్లు వక్ఫ్‌ ఆక్రమణలో ఉన్నాయి’’ అని మెహతా వాదించారు. ‘‘ప్రభుత్వం నుంచి ప్రాథమికస్థాయి స్పందనను అనుమతించకుండానే చట్టంలోని నిబంధనలను నిలుపుదలచేయడమంటే ధర్మాసనం అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోందని అర్థమవుతోంది’’ అని మెహతా అసహనం వ్యక్తంచేశారు. 

‘‘ మా వాదనలకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్లు, పాత శాసనాలను మీ ముందు ఉంచుతాం. మాకు ఒక వారం గడువు ఇవ్వండి. ఈలోపు ఏమీ జరిగిపోదుగా’’ అని మెహతా వ్యాఖ్యానించారు. ‘‘ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వకుండా వారం రోజులు ఆగినంత మాత్రాన ఆకాశం విరిగిపడదుగా’’ అని ఒక రాష్ట్రం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వ్యాఖ్యానించారు. దీంతో సీజేఐ స్పందించారు.

 ‘‘ మీరు వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించి యతాతథ స్థితిని మార్చకుండా ఉంటే చాలు’’ అని అన్నారు. వక్ఫ్‌ చట్టం అమలుకాకుండా తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్ల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే చట్టం మొత్తం పూర్తిగా నిలుపుదల చేయడం కుదరదని కోర్టు స్పష్టంచేసింది. ‘‘ నూతన చట్టంలోని కొన్ని సెక్షన్లు సమతుల్యతతో ఉన్నాయి. అందుకే మొత్తం చట్టాన్ని నిలుపుల చేయడం అస్సలు కుదరదు. అలా చేయడం సహేతుకం కూడా కాదు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున డీనోటిఫై లాంటి వాటి జోలికి పోవద్దు’’ అని ధర్మాసనం సూచించింది.

ముగ్గురే వాదించాలి
‘‘ఎన్నో పిటిషన్లు వచ్చినా ప్రస్తుతానికి మేం ఐదు పిటిషన్లనే స్వీకరిస్తాం. మీ అందరిలో కేవలం ముగ్గురు న్యాయవాదులనే అన్ని పిటిషన్ల తరఫున వాదించేందుకు అనుమతిస్తాం. ఏ ముగ్గురు వాదించాలో మీరే నిర్ణయించుకోండి’’ అని పలు పిటిషన్ల తరఫు లాయర్లకు సీజేఐ సూచించారు. ఏడు రోజుల తర్వాత కేంద్రప్రభుత్వం స్పందన తెలిపాక  ఐదురోజుల్లోపు రీజాయిండర్లను సమర్పించేందుకు పిటిషన్లకు ధర్మాసనం గడువు ఇచ్చింది. మే ఐదో తేదీన ప్రాథమిక స్థాయి అభ్యంతరాలను ఆలకించాక తాత్కాలిక ఉత్తర్వులిస్తామని బెంచ్‌ తెలిపింది. 

1995 వక్ఫ్‌ చట్టాన్ని, ఆ చట్టానికి 2013లో చేసిన సవరణను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లనూ వేరుగా విచారిస్తామని కోర్టు పేర్కొంది. వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్, జమియత్‌ ఉలేమా–ఇ–హింద్‌ అధ్యక్షుడు అర్షద్‌ మదానీ, డీఎంకే, ఆకాఫ్‌ కర్ణాటక రాష్ట్ర బోర్డు మాజీ ఛైర్మన్‌ అన్వర్‌ బాషా, సమçస్త కేరళ జమియతుల్‌ ఉలేమా, అంజుమ్‌ ఖదారీ, తయ్యబ్‌ ఖాన్‌ సల్మానీ, మొహమ్మద్‌ షఫీ, మొహమ్మద్‌ ఫజుల్‌రహీమ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా, కాంగ్రెస్‌ ఎంపీలు ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీ, మొహమ్మద్‌ జావేద్, ఢిల్లీ ఆప్‌ ఎంపీ అమానతుల్లా ఖాన్, అసోసియేషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ తదితరులు మొత్తంగా దాదాపు 72 పిటిషన్లను వక్ఫ్‌ చట్టాన్ని సవాల్‌చేస్తూ దాఖలు చేయడం తెల్సిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement