రాజ్యసభకు సుధామూర్తి.. ‘నారీ శక్తికి నిదర్శనం’: మోదీ | Sudha Murty Nominated To Rajya Sabha: Nari Shakti Says PM Modi | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు సుధామూర్తి.. ‘నారీ శక్తికి నిదర్శనం’: మోదీ

Mar 8 2024 1:30 PM | Updated on Mar 8 2024 7:06 PM

Sudha Murty Nominated To Rajya Sabha: Nari Shakti Says PM Modi - Sakshi

న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రచయిత, సామాజిక వేత్త, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్‌ చేశారు. సుధామూర్తి ఎంపికపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభలో ఆమె ప్రాతినిధ్యం భారత ‘నారీ శక్తి’కి శక్తివంతమైన నిదర్శమని మోదీ పేర్కొన్నారు.

సామాజిక సేవలో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని కొనియాడారు. విద్య, దాతృత్వంతో సహా విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి ఆపారమైనదని ప్రశంసించారు. మహిళల శక్తి, సామర్థ్యాలను చాటిచెప్పేలా ఆమె పార్లమెంట్‌ పదవీకాలం ఉన్నతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు చేశారు.

కాగా సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్‌ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement