
వారణాసి: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ రోజుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలకు పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులలో తొలి రోజున శైలపుత్రి రూపాన్ని పూజిస్తారు.
శివుని నగరంగా పేర్కొనే వారణాసిలో శైలపుత్రి అమ్మవారి పురాతన ఆలయం ఉంది. నవరాత్రుల తొలిరోజున ఈ ఆలయంలో ఎంతో ఘనంగా పూజలు జరుగుతాయి. ఈ నేపధ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ పురాతన ఆలయం వారణాసి సిటీ స్టేషన్కు కొద్ది దూరంలో ఉంది. ఈ శైలపుత్రి ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు.
ఆలయ పూజారి మీడియాకు ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథను తెలిపారు. శైలపుత్రి అమ్మవారు శైలరాజు ఇంట్లో జన్మించారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి, శైలపుత్రి ఎంతో ప్రతిభావంతురాలవుతుందని తెలిపారట. శైలపుత్రికి చిన్నప్పటి నుంచే మహాశివునిపై ఇష్టం ఏర్పడింది. ఆమె పెరిగి పెద్దయ్యాక కాశీకి చేరుకుని, శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసింది. కుమార్తె కోసం వెదుకుతూ కాశీ చేరుకున్న శైలరాజు కూడా తపస్సు ప్రారంభించాడని చెబుతారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో శైలపుత్రితో పాటు ఆమె తండ్రి శైలరాజు ఆలయాలు నిర్మితమయ్యాయి. శైలపుత్రి ఆలయంలో మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.
ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి