రేవంత్‌ రెడ్డికి సంబీత్‌ పాత్రా చురకలు | Sambit Patra Condemn Revanth Reddy Rafale Question | Sakshi
Sakshi News home page

రేవంత్‌ రెడ్డికి సంబీత్‌ పాత్రా చురకలు

May 30 2025 4:08 PM | Updated on May 30 2025 5:32 PM

Sambit Patra Condemn Revanth Reddy Rafale Question

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బీజేపీ ఎంపీ సంబీత్‌ పాత్రా(Sambit Patra) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)ను శంకించే బదులు.. పోయి పాకిస్తాన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోవాలంటూ చురకలంటించారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 

ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో కాంగ్రెస్‌ నేతలు జైరాం రమేశ్‌, రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) తదితరులు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ రాహుల్‌ గాంధీ, ఆయన పార్టీ నేతలు.. పాకిస్తాన్‌లో ఎన్ని ఎయిర్‌బేస్‌లు ధ్వంసం అయ్యాయి?. ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారు? అని వాళ్లు అడగడం లేదు. కేవలం ఎన్ని రఫెల్స్‌ యుద్ధ విమానాలు పాక్‌ నేల కూల్చిందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు రెండు వర్గాలు తయారయ్యాయి. ఒకటి పాకిస్తాన్‌కు మద్దతు తెలిపేది. రెండో వర్గం.. వీళ్ల కారణంగా భారత్‌కు మద్దతు గళం వినిపించలేకపోతున్నది.

.. మీ జై హిందూ యాత్ర(Jai Hind Yatra).. పాకిస్తాన్‌ హింద్‌ యాత్రలా తయారైంది. మీరు మీ యాత్రను ఆపేస్తే మంచిది. అలాగే వెళ్లి పాకిస్తాన్‌తో కలిసి  మీడియా సమావేశం నిర్వహించుకోండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశిస్తూ సంబీత్‌ పాత్రా ఎద్దేవా చేశారు.

అలాగే అఖిలపక్ష ఎంపీల బృందాన్ని.. టెర్రరిస్టులతో పోలుస్తూ(ఎంపీలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.. ఉగ్రవాదులూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు అనే కామెంట్‌) జైరామ్‌ రమేష్‌ వ్యాఖ్యలు చేశారు. వాళ్లేం సరదా పర్యటనలకు వెళ్లలేదు. ఉగ్రవాదంపై భారత్‌ జరుపుతున్న పోరును ప్రపంచానికి తెలియజేసేందుకే వెళ్లారు. అందులో మీ ఎంపీలు కూడా ఉన్నారనే విషయం గుర్తిస్తే మంచిది’’ అని జైరామ్‌ను ఉద్దేశించి సంబీత్‌ పాత్రా అన్నారు.

ఇదిలా ఉంటే.. ఉగ్రవాదంపై పోరు, పీవోకేను తిరిగి భారత్‌లో విలీనం చేసే చర్యలకుగానూ కేంద్రానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తోందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అంతేకాదు పాక్‌ను రెండు ముక్కలు చేయడానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెబితేనే మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని ఆపేసి వెనక్కి వచ్చిందన్న అంశంపై రేవంత్‌ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

‘‘ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి రఫెల్‌ యుద్ధ విమానాల(Rafale Fighter Jets)ను కొనుగోలు చేశారు. అలాంటప్పుడు ఆ యుద్ధ విమానాల్లో ఎన్నింటిని పాక్‌ నేల కూల్చింది? ఈ విషయంపై చర్చ జరగదా?. వీటికి సమాధానాలు తెలియాల్సిందే’’ అని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో బీజేపీ చేపట్టిన తిరంగా ర్యాలీని ఆయన తప్పుబట్టారు. బీజేపీ తన చర్యలతో భారత సైనికుల్లో మనోస్థైర్యాన్ని దెబ్బ తీసిందని, ఆ పార్టీ చేపట్టిన తిరంగా ర్యాలీకి కౌంటర్‌గా కాంగ్రెస్‌ పార్టీ ‘జై హింద్‌ యాత్ర’ చేపడుతోందని తెలంగాణ సీఎం అన్నారు.

ఇదీ చదవండి: తప్పు చేసి ఉంటేనే క్షమాపణలు చెబుతా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement