ఆస్తులు బ‌య‌ట‌పెట్టండి.. దాచ‌డానికి ఏమీ లేదు | Priyank Kharge seeks RSS funding and Mohan Bhagwat responds | Sakshi
Sakshi News home page

ఖర్గే లేఖ‌.. ఘాటుగా స్పందించిన‌ భగవత్

Jun 16 2026 1:30 PM | Updated on Jun 16 2026 1:36 PM

Priyank Kharge seeks RSS funding and Mohan Bhagwat responds

ఆర్‌ఎస్‌ఎస్ పార‌ద‌ర్శ‌క‌త‌పై కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ ఖర్గే లేఖాస్త్రం సంధించారు. ఆస్తులు, ఆదాయ ప‌న్ను చెల్లింపు వివ‌రాలు తెలియ‌జేయాల‌ని కోరారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఏ సంస్థ అయినా చ‌ట్టానికి అతీతం కాద‌ని, ఆర్‌ఎస్‌ఎస్ కూడా అన్ని సంస్థ‌ల్లా పార‌ద‌ర్శ‌క‌త పాటించాల‌ని లేఖ‌లో కోరారు. దీనికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ స్పందించారు. తమ సంస్థ దాచడానికేమీ లేదని, బహిరంగంగా పనిచేస్తోంద‌ని చెప్పారు.

రిజిస్టర్‌ చేయించుకోండి: ప్రియాంక్‌ ఖర్గే 
బెంగళూరు: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సంస్థ తన పేరును అధికారికంగా నమోదు చేయించుకుని, నిధుల లావాదేవీలను బహిర్గతం చేసి రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్‌ ఖర్గే డిమాండ్‌ చేశారు. వందేళ్లు పూర్తి చేసుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌ తన సంస్థాగత హోదాపై స్పష్టత ఇవ్వాలంటూ ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు మంత్రి ప్రియాంక్‌ సోమవారం లేఖ రాశారు. ఈ లేఖను మంత్రి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

దేశ, విదేశాల్లో 60 వేల పైచిలుకు శాఖలు, కోట్లాది మంది స్వయం సేవకులను కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ పారదర్శకతతో మెలగాలని సూచించారు. కర్ణాటకలో 4,127 రోజువారీ శాఖలు, 1,389 వీక్లీ మిలన్స్, 60 మంత్లీ మండలులను కలిగి ఉన్నట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంగా ప్రకటించుకుందన్నారు. సంస్థ కార్యకలాపాలు చట్టపరమైన హోదా, జవాబుదారీతనం, ఆర్థిక పారదర్శకత, ప్రజా భద్రత, అనుమతులు, నిధుల మూలాలు, చట్టాలకు లోబడి ఉండటం గురించిన అనేక సహేతుకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు.

ఇది రాజకీయమే: భగవత్‌ 
త్రిస్సూర్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ను రిజిస్టర్‌ చేయించాలంటూ కర్ణాటక మంత్రి ప్రియాంక్‌ చేసిన డిమాండ్‌పై ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తప్పుబట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను రిజిస్టర్‌ చేసే ప్రసక్తే లేదన్నారు. తమ సంస్థ రహస్యం కాదు, ప్రజా పరిశీలనకు అతీతంగా పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ఆదివారం కేరళలోని త్రిస్సూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. తమ సంస్థ దాచడానికేమీ లేదన్నారు. వందేళ్లుగా కొనసాగుతున్న తమ సంస్థను ఇప్పటివరకు ఎవరూ రిజిస్టర్‌ చేయించుకోవాలని అడగలేదన్నారు.

చ‌ద‌వండి: స‌యోనీ సూప‌ర్ ట్విస్ట్‌.. అస్స‌లు ఊహించ‌లేదు!

‘దేశంలో అధికారంగా నమోదు కాని ఎన్నో వ్యవహారాలు సాగుతున్నాయి. కానీ మాదేమీ రహస్య సంస్థ కాదు. మేం బహిరంగంగా పనిచేస్తాం. ప్రజలను పిలిచి మరీ మేం ఏమి చేస్తున్నామో వారికి చెప్తాం’ అని భగవత్‌ అన్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ రిజిస్ట్రేషన్‌ కోరడమంటే రాజకీయమే తప్ప మరేమీ కాదు, ఇలాంటి డిమాండ్లు గతంలోనూ ఎన్నోమార్లు వచ్చాయి. ఇలాంటి డిమాండ్లు రాకుంటేనే మేం వెలితిగా ఫీలవుతాం’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘హిందూ ధర్మం రిజిస్టర్‌ కాలేదు. దేశంలో రిజిస్టర్‌ కానివి ఎన్నో జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు కోరేవారు మాత్రమే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ పనిచేస్తున్న విషయం ప్రభుత్వానికీ తెలుసు’అని భగవత్‌ పేర్కొన్నారు. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement