స‌యోనీ సూప‌ర్ ట్విస్ట్‌.. అస్స‌లు ఊహించ‌లేదు! | Why Saayoni Ghosh decision surprises TMC Leaders Full Details | Sakshi
Sakshi News home page

స‌యోనీ ఘోష్.. నీకిది త‌గునా?

Jun 15 2026 6:24 PM | Updated on Jun 15 2026 7:35 PM

Why Saayoni Ghosh decision surprises TMC Leaders Full Details

కోల్‌క‌తా: పార్టీ కోసం అంకిత‌భావంతో ప‌నిచేసే నేత‌ల‌ను కాద‌ని సినిమా తార‌ల‌ను అందం ఎక్కించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి త‌గిన శాస్తి జ‌రిగింద‌ని ఆ పార్టీకి చెందిన నాయ‌కులు అంటున్నారు. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాల‌ని, పార్టీ కోసం చిత్త‌శుద్ధితో ప‌నిచేసే వారిని గుర్తించాల‌ని కోరుతున్నారు. 20 మంది టీఎంసీ ఎంపీలు మ‌మ‌తా బెన‌ర్జీపై తిరుగుబాటు జెండా ఎగుర‌వేసి ఎన్డీఏ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అధినేత్రి తీరుపై పార్టీలో గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా స‌యోనీ ఘోష్ (Saayoni Ghosh).. రెబల్ ఎంపీల వర్గంలో చేరడం టీఎంసీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

గుణ‌పాఠం నేర్పారు
మ‌మ‌తా బెన‌ర్జీకి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెన‌ర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న స‌యోనీ ఘోష్.. టీఎంసీని వీడ‌తార‌ని ఊహించ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. స్థాయికి మించి అవ‌కాశాలు క‌ల్పించినా ఆమె పార్టీని వీడ‌డం జీర్ణించుకోలేపోతున్నామ‌ని చెబుతున్నారు. “స‌యోనీ ఘోష్‌ రెబల్ వర్గంలో చేరుతుందని మేమెప్పుడూ ఊహించలేదు. ఆమెను అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. మమతా బెనర్జీ కూడా ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాయకురాలిగా ఎదిగే అవకాశం కల్పించారు. ఇది మమతా, అభిషేక్‌లకు కూడా ఒక పాఠం. పార్టీకి అంకితభావంతో పనిచేసే నేతల కంటే సినీ రంగం నుంచి వచ్చిన వారిపైనే ఎక్కువగా నమ్మకం ఉంచారు” అని టీఎంసీ సీనియ‌ర్ నాయ‌కుడొక‌రు వ్యాఖ్యానించారు.

మ‌హువా మెయిత్రా భావోద్వేగం
పార్టీని వీడి, రెబ‌ల్ గ్రూపు ఎంపీల‌తో స‌యోనీ ఘోష్ చేతులు క‌ల‌ప‌డం త‌న‌ను బాధించింద‌ని టీఎంసీ ఎంపీ మ‌హువా మెయిత్రా వ్యాఖ్యానించారు. “స‌యోనీ నాకు చెల్లెలిలాంటిది, కూతురితో స‌మానం. ఆమె పార్టీని విడిచిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆమె ఎంతో కష్టపడి ఎదిగింది. డబ్బు కోసం లేదా వ్యక్తిగత లాభం కోసం పనిచేసే వ్యక్తి కాదు. గత ఐదేళ్లలో పార్టీ ఆమెకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అలాంటి వ్యక్తి పార్టీని వీడాలని ఆలోచించడం చాలా బాధాకరం. భయాన్ని జయించి ముందుకు సాగాలని నేను ఆమెకు చెప్పాలనుకుంటున్నాను” అని మహువా మొయిత్రా పేర్కొన్నారు.

స‌యోనీ స్థానంలో అర్నాబ్
టీఎంసీలో సంక్షోభం నేప‌థ్యంలో రెబ‌ల్ ఎంపీల వ‌ర్గంలో స‌యోనీ ఘోష్ చేరిన‌ట్టు గత వారం వార్త‌లు వ‌చ్చాయి. ఎన్డీఏకు మ‌ద్ద‌తుగా లోక్‌స‌భ స్పీక‌ర్‌కు రెబ‌ల్ ఎంపీలు స‌మ‌ర్పించిన లేఖ‌లో ఆమె కూడా సంత‌కం చేసిన‌ట్టు తెలియ‌డంతో క‌ల‌క‌లం రేగింది. దీనిపై గత వారాంతంలో ఢిల్లీలో ఆమె స్పందిస్తూ..  “సమయం వచ్చినప్పుడు మాట్లాడుతాను” అని పేర్కొన్నారు. తాజాగా ఆమెతో పాటు పలువురు రెబల్ ఎంపీలతో పాటు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను కలిసి.. నేష‌న‌లిస్ట్ సిటిజ‌న్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో తామంతా విలీనమైనట్లు ప్రకటిస్తూ పార్లమెంట్‌లో ప్రత్యేక గ్రూప్‌గా గుర్తింపు ఇవ్వాలని కోరారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి స‌యోనీ ఘోష్‌ను తొల‌గించి, ఆమె స్థానంలో అర్నాబ్ బెన‌ర్జీ (Arnab Banerjee)ని మ‌మ‌త నియ‌మించారు.

చ‌దవండి: తాను రాఘ‌వ్ చ‌ద్దాను కాదంటూనే.. ఝ‌ల‌క్‌!

స‌యోనీ రాజకీయ ప్రస్థానం
2021 అసెంబ్లీ ఎన్నికల ముందు సయోనీ ఘోష్ అధికారికంగా టీఎంసీలో చేరారు. అంతకుముందు ఆమె బీజేపీపై విమర్శలు చేస్తూ వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. అదే ఏడాది ఆసన్సోల్ సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్‌పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆమె ఎన్నికల ప్రచారంలో చూపిన చురుకుదనం టీఎంసీ అధిష్ఠానాన్ని ఆకట్టుకుంది. ఎన్నికల అనంతరం అభిషేక్ బెనర్జీ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగిస్తూ జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ యువ నాయకురాలిగా స‌యోనీ వేగంగా ఎదిగారు. ప్ర‌స్తుతం జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజ‌వ‌ర్గానికి ప్రాతినిథ్య‌వం వ‌హిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement