బనశంకరి: కన్నడనాట కావేరి నదీ జలాశయాల్లో అరకొరగా నీరున్న తరుణంలో, తమిళనాడుకు రానున్న 15 రోజుల పాటు నిత్యం 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరి జల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్సీ) తాజాగా మంగళవారం ఆదేశించడం అన్ని వర్గాలకూ కలవరాన్ని కలిగిస్తోంది. ఢిల్లీలో నిర్వహించిన కమిటీ సమావేశంలో తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల ముఖ్య అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.
వాదనలు వినిపించినా..
కర్ణాటక అధికారులు రాష్ట్ర వాస్తవ పరిస్థితిని ఏకరువు పెట్టారు. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిశాయని, గత రెండు వారాల నుంచి అంతంతంగా వానలు పడడంతో జలాశయాలకు ఆశించినమేర నీరు చేరలేదని తెలిపారు. మాకు తాగునీరే లేదని, పంట పొలాలకు కాలువలకు నీరు వదలాలని రైతులు కోరుతున్నా, భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని నీరు వదలడం లేదని కమిటీకి వివరించారు. మా ప్రాంతానికే నీరు లేని సమయంలో తమిళనాడుకు వదలడం ఎలా అని పేర్కొన్నారు. తమిళనాడు అధికారులు వాదిస్తూ ఈ సీజన్లో చాలా తక్కువ నీటిని ఇచ్చారని, తమ ప్రాంతం అవసరాలను వివరించారు. ఉభయుల వాదనలను ఆలకించి కమిటీ పెద్దలు.. తమిళనాడుకే మొగ్గు చూపారు. దీంతో కర్ణాటక అధికారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరి డీకేశి ప్రభుత్వం రోజూ టీఎంసీ నీటిని విడుదల చేస్తుందా?, కావేరి అథారిటీకి అప్పీల్ చేస్తుందా, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? అనేది తేలాల్సి ఉంది. మరోవైపు కన్నడ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు సన్నాహాలు చేస్తున్నాయి.
తమిళనాడుకు 15 రోజులు.. నిత్యం 1200 క్యూసెక్కులు వదలాలి
కర్ణాటకకు సీడబ్ల్యూఆర్సీ ఆదేశం
కన్నడ, రైతు సంఘాల్లో ఆగ్రహం
డీకే సర్కారుకు సంకటస్థితి
మరోసారి కావేరి జలాల పంపిణీ ఆదేశం ఉరుము లేని పిడుగులా పడింది. రాష్ట్రంలో వానలు వచ్చినట్లే వచ్చి ముఖం చాటేసిన క్లిష్ట సమయంలో తమిళనాడుకు ఉదారంగా జలాలను పంపిణీ చేయాలనే ఉత్తర్వు.. సర్కారుతో పాటు రైతు, కన్నడ సంఘాలకు ఉలికిపాటుకు గురిచేసింది. దీంతో తిరిగి నిరసనలు భగ్గుమనే అవకాశం పొంచి ఉంది.


