రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిలో 78 మందికి శౌర్య పురస్కారాలు ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. వీటిలో 13 మరణానంతర పురస్కారాలు ఉన్నాయి. 9 కీర్తిచక్రలు, 19 శౌర్యచక్రలు, 5 బార్ టు సేనా మెడల్స్(గ్యాలంట్రీ), 36 సేనా మెడల్స్(గ్యాలంట్రీ)తోపాటు మరికొన్ని అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. అశోక చక్ర తర్వాత ప్రదానం చేసే భారతదేశపు రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తిచక్ర. శౌర్యచక్ర అనేది మూడో అత్యున్నత శౌర్య పురస్కారం.
కీర్తిచక్ర అవార్డు గ్రహీతలు 21 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ ఫ్రాన్సిస్, 2 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన మేజర్ జితేంద్ర రాఠీ. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ గజేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుళ్లు జగ్బీర్ సింగ్, బషీర్ అహ్మద్, కానిస్టేబుళ్లు జశ్వంత్ సింగ్, బల్వీందర్ సింగ్, తారిఖ్ హుస్సేన్, ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్కు కూడా కీర్తిచక్ర పురస్కారాలను ప్రకటించారు. మేజర్ పరమ్వీర్, మేజర్ తరుణ్ వాసుదేవన్, మనోజ్ కేశవ్ కుమార్, మేజర్ గౌరవ్ సింగ్ బ్రిజ్వాల్, మేజర్ విపీన్ కుమార్, నాయబ్ సుబేదార్ శంకర్ రామ్, నాయబ్ సుబేదార్ దబ్బాల్ సింగ్ బిష్త్ తదితరులకు శౌర్యచక్ర పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.


