breaking news
Defence forces
-
78 మందికి శౌర్య పురస్కారాలు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిలో 78 మందికి శౌర్య పురస్కారాలు ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. వీటిలో 13 మరణానంతర పురస్కారాలు ఉన్నాయి. 9 కీర్తిచక్రలు, 19 శౌర్యచక్రలు, 5 బార్ టు సేనా మెడల్స్(గ్యాలంట్రీ), 36 సేనా మెడల్స్(గ్యాలంట్రీ)తోపాటు మరికొన్ని అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. అశోక చక్ర తర్వాత ప్రదానం చేసే భారతదేశపు రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తిచక్ర. శౌర్యచక్ర అనేది మూడో అత్యున్నత శౌర్య పురస్కారం. కీర్తిచక్ర అవార్డు గ్రహీతలు 21 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ ఫ్రాన్సిస్, 2 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన మేజర్ జితేంద్ర రాఠీ. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ గజేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుళ్లు జగ్బీర్ సింగ్, బషీర్ అహ్మద్, కానిస్టేబుళ్లు జశ్వంత్ సింగ్, బల్వీందర్ సింగ్, తారిఖ్ హుస్సేన్, ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్కు కూడా కీర్తిచక్ర పురస్కారాలను ప్రకటించారు. మేజర్ పరమ్వీర్, మేజర్ తరుణ్ వాసుదేవన్, మనోజ్ కేశవ్ కుమార్, మేజర్ గౌరవ్ సింగ్ బ్రిజ్వాల్, మేజర్ విపీన్ కుమార్, నాయబ్ సుబేదార్ శంకర్ రామ్, నాయబ్ సుబేదార్ దబ్బాల్ సింగ్ బిష్త్ తదితరులకు శౌర్యచక్ర పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. -
చిన్న ఆయుధాల తయారీలోకి ఐకామ్, దుబాయ్ కంపెనీతో డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిఫెన్స్, ఏరోస్పేస్, టెలికం రంగాలకు సమగ్ర సేవలు అందిస్తున్న ఐకామ్ తాజాగా యూఏఈ కంపెనీ ఎడ్జ్ గ్రూప్నకు చెందిన కారకల్తో చేతులు కలిపింది. మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ అయిన ఐకామ్.. అధునాతన సాంకేతికత, రక్షణ ఆయుధాల తయారీలో ఉన్న కారకల్తో కలిసి సైన్యానికి ఉపయోగపడే ఉత్పతులను తయారు చేయనుంది. గుజరాత్లోని గాంధీనగర్లో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో–2022 సందర్భంగా ఇరు సంస్థలు ఈ ఒప్పందంపై గురువారం సంతకం చేశాయి. కారకల్ సహకారంతో హైదరాబాద్లోని ప్రపంచ స్థాయి డిజైన్, అభివృద్ధి, తయారీ కేంద్రంలో పూర్తి చిన్న ఆయుధాలను ఉత్పత్తి చేస్తామని ఐకామ్ ఎండీ పి.సుమంత్ తెలిపారు. -
దేశీ గన్లతో డ్రాగన్పై గురి
సాక్షి, న్యూఢిల్లీ : కార్బైన్ (లాంగ్ గన్స్)లను దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర వినియోగానికి మేడిన్ ఇండియా కార్బైన్లను సమీకరించాలని రక్షణ బలగాలు యోచిస్తున్నాయి. ప్రత్యర్ధులతో నేరుగా తలపడే సమయంలో పదాతిదళాలు వాడే తేలికపాటి పొడవైన గన్లను కార్భైన్లుగా వ్యవహరిస్తారు. ఈ తరహా ఆయుధాల సేకరణ కోసం భారత సైన్యం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. పశ్చిమ బెంగాల్లోని ఇషాపోర్ కేంద్రంలో తయారైన కార్బైన్ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ రక్షణ బలగాలకు అప్పగించగా వీటి కొనుగోలుకు సాయుధ బలగాలు ఆసక్తి చూపుతున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ దళాల కోసం ఈ ఆయుధాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న అధికారులు ఇప్పటికే ఈ ఆయుధాలపై ప్రాథమికంగా పరీక్షించినట్టు తెలిసింది. ఈ ఆయుధాలను ఎగుమతి చేసే దేశాలు కొద్ది దేశాలకే అదీ తక్కువ సంఖ్యలో ఎగుమతి చేస్తున్న క్రమంలో దేశీయ కార్బైన్ కొనుగోలుకు సాయుధ బలగాలు మొగ్గుచూపాయి. విదేశాల నుంచి కార్భైన్ల కొనుగోలు ప్రతిపాదన రెండేళ్లుగా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నియమించిన ఉన్నతస్ధాయి కమిటీ పరిశీలనలో ఉండటం కూడా వీటి సమీకరణలో జాప్యానికి కారణమవుతోంది. సాయుధ బలగాలకు 3.5 లక్షల కార్బైన్స్ అవసురం కాగా, ఫాస్ట్ట్రాక్ మార్గంలో 94,000 ఆయుధాలనే దిగుమతి చేసుకోనున్నారు. ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్బైన్ను సాయుధ బలగాలు ఎంపిక చేస్తే వీటిని కఠినంగా పరీక్షించి తొలుత పరిమిత సంఖ్యలోనే రక్షణ బలగాలకు అందచేస్తారు. చదవండి : ఏకకాలంలో చైనా, పాక్లతో యుద్ధానికి రెడీ -
'ఉగ్రదాడిని ఎదుర్కొనడంలో మా వైఫల్యం లేదు'
చంఢీగడ్: పఠాన్ కోట్ ఎయిర్ బేస్పై ఉగ్రదాడిని ఎదుర్కొనడంలో తమ వైఫల్యం లేదని పంజాబ్ డీజీపీ సురేశ్ అరోరా అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకున్నారని తెలిపారు. తమ అధికారులు అప్రమత్తంగా ఉండి, అన్ని శాఖలతో సమన్వయంగా వ్యవహరించడం వల్లే దాడి తీవ్రతను గణనీయంగా తగ్గించగలిగామన్నారు. మొదటిసారి తాము ఎన్ఎస్జీని వినియోగించామని డీజీపీ పేర్కొన్నారు. అలాగే ఎయిర్బేస్లో ఏఐజీ కౌంటర్తో పాటు సీసీ నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కాగా చెక్పోస్ట్ వద్ద ఓ ప్రయివేట్ కారును ఎలా అనుమతించారని విలేకర్ల ప్రశ్నకు డీజీపీ అరోరా సమాధానమిస్తూ ఆ ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడికి సంబంధించి స్థానికుల మద్దతు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయన్న దానిపై కూడా ఆయన విచారణ అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.


