భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పవర్‌ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి | Parliament Budget Session 2025-26 Day 1 Live Updates | Sakshi
Sakshi News home page

భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పవర్‌ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి

Jan 31 2025 8:51 AM | Updated on Jan 31 2025 1:48 PM

 Parliament Budget Session 2025-26 Day 1 Live Updates

ఒకటో తేదీన సాధారణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న విత్త మంత్రి నిర్మల

వక్ఫ్‌ సవరణ బిల్లు సహా 16 బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం

అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల సహకారం కోరిన కేంద్రం

ఫిబ్రవరి 13 వరకు తొలి సెషన్‌

👉 వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు పడుతున్నాయి. బడ్జెట్‌లో రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యం ఉంటుంది. వికసిత్ భారత్‌ దిశగా భారత్‌ అడుగులు వేస్తోంది. మూడోసారి మా ప్రభుత్వం మూడు రెట్లు అధిక వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. వ్యవసాయ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా లక్షలాది మంది ఇంటి కల నెరవేర్చాం. కోట్లాది మందిని ప్రభుత్వం పేదరికం నుంచి బయటపడేసింది. మూడు కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నాం.

👉మహాకుంభమేళాలో కోట్లాది మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు. మహాకుంభమేళా భారత సంస్కృతికి చిహ్నం. మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు నివాళి అర్పిస్తున్నాను.

👉 ఇటీవల 76వ రిపబ్లిక్‌ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నాం​. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా లక్షలాది మంది సొంత ఇంటి కల నెరవేరబోతుంది. అమృత్‌భారత్‌, నమో భారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.

👉 వందో ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. ఇస్రో భారత కీర్తి పతాకం ఎగురవేసింది. స్పేస్‌ డాకింగ్‌తో మరో అడుగు ముందుకేశాం. అంతరిక్షంలో భారతీయుడు అడుగుపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మేకిన్‌ ఇండియాతో అద్భుత విజయాలు సాధిస్తున్నాం. ఇండియా ఏఐ మిషన్‌ను ప్రారంభించాం. సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్‌ నేరాలు, డిజిటల్‌ నేరాల నుంచి బయటపడేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రపంచస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.

👉 ఖేలో ఇండియా మన దేశ యువతకు ఎంతో ఉపయోగకరం. మన దేశ మహిళలు ఒలంపిక్స్‌లో పథకాలు సాధిస్తున్నారు. మహిళా సాధికారిత కోసం డ్రోన్‌ దీదీ పథకం తీసుకువచ్చాం. లక్షా 15వేల మంది మహిళలు లక్‌పతి దీదీలుగా మారారు. మూడు లక్షల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. డ్రోన్‌ దీదీ స్కీమ్‌ మహిళలకు ఉపయోగపడుతోంది. మధ్య తరగతి కుటుంబాలకు హోం లోన్స్‌ ఇస్తున్నాం. దేశంలో 70 ఏళ్లు దాటిన ఆరు కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తాం. రైతులను ఆదుకునేందుకు, వారి ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యువతను వారి వారి మాతృ భాషల్లో ఎడ్యుకేట్‌ అయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. 

👉 భారత ఆర్థిక వ్యవస్థకు చిరు వ్యాపారులే కీలకం. భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పవర్‌ హౌస్‌గా మారుస్తాం. టెక్నాలజీ రంగంలో భారత్‌ అద్భుతంగా దూసుకుపోతోంది. డిజిటల్‌ చెల్లింపుల్లో రికార్డులు సాధిస్తున్నాం. నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రారంభించాం. ఎంఎస్‌ఎంఈ కోసం క్రెడిట్‌ గ్యారంటీ స్కీం తీసుకొచ్చాం. 

👉 వైద్య, ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. క్యాన్సర్‌ ట్రీట్మెంట్‌ కోసం నూతన టెక్నాలజీ తీసుకొచ్చాం. దేశవ్యాప్తంగా చాలా మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశాం. టీబీ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతున్నాం. తక్కువ ధరకే క్యాన్సర్‌ మందులను అందుబాటులోకి తీసుకొచ్చాం.

👉 ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జిని కశ్మీర్‌లో నిర్మించాం. దేశంలో మెట్రో వ్యవస్థలను వేగంగా విస్తరిస్తున్నాం. ఢిల్లీలో మెట్రో వ్యవస్థను విస్తరిస్తున్నాం. స్వచ్చమైన నీటి కోసం నదులను అనుసందానం చేస్తున్నాం. దేశంలో పౌరవిమానయాన రంగం అభివృద్ధి చెందుతోంది. రైతులు, పరిశ్రమలు, సైన్స్‌పై మా ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది.

👉చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు. ఆదివాసీల్లో సికెల్‌సెల్‌ వ్యాధిని నివారించాం. మహిళలతోనే ఆర్థిక అభివృద్ధి అని మా ప్రభుత్వం నమ్ముతోంది. దళితుల కోసమే కొన్ని ప్రత్యేక పథకాలు తీసుకువచ్చాం. వన్‌ నేషన్‌-వన్‌ ట్యాక్స్‌ అభవృద్ధి చేశాం. 

👉త్వరలోనే ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్‌ అవతరించబోతుంది. భారత రాజ్యాంగానికి నా సెట్యూట్‌. వక్ఫ్‌ బోర్డులో సంస్కరణపై మా ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. మహిళా సాధికారితకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందరికీ ఫలాలు అందాలన్నదే మా ఉద్దేశ్యం. 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాం. దేశాభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.70వేల కోట్లు కేటాయించాం. ట్యాక్స్‌ విధానాలను సరళీకరించాం. ఉద్యోగుల కోసం ఎనిమిదో వేతన సంఘాన్ని నియమించాం. విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. పేదలకు లబ్ధి కలిగిస్తున్నాయి. 


 

👉మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఇటీవల మరణించిన పార్లమెంట్‌ సభ్యలకు ఉభయ సభలు సభ్యులు నివాళి అర్పించారు.

 

👉బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. 

👉కాసేపట్లో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ వద్ద ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. మూడోసారి దేశ ప్రజలు మాకు విజయాన్ని అందించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్నాం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పాన్ని పరిపూర్ణం చేస్తాం. వికసిత్‌ భారత్‌కు ఈ బడ్జెట్‌ ఊతమిస్తుంది. దేశంలోని పేదలు, మధ్య తరగతిపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ప్రార్థిస్తున్నాను. 

👉ఈ సమావేశాల్లో చర్చకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాం. పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను. దేశాన్ని భౌగోళిక, సామాజిక, ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం. ఇన్నోవేషన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తాం. ఈ బడ్జెట్‌ భారతీయులకు నూతన శక్తిని ఇస్తుంది. ఈ బడ్జెట్‌ యువతకు ఆశాజనకంగా ఉంటుంది. చారిత్రాత్మక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెడతాం. వక్ఫ్‌, బ్యాంకింగ్‌, రైల్వేలు సహా 16 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతున్నాం. పార్లమెంట్‌లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఆకాంక్షిస్తున్నాను అని కామెంట్స్‌ చేశారు.

 
👉ఈరోజు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్ధేశించి లోక్‌సభ హాల్‌లో ప్రారంభోపన్యాసం చేస్తారు. అనంతరం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను లోక్‌సభలో, రాజ్యసభలో ప్రవేశపెడతారు. శనివారం నిర్మల లోక్‌సభలో 2025–26 సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చకు రాజ్యసభ, లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇస్తారు. బడ్జెట్‌ సమావేశాల తొలి సెషన్‌ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 దాకా, రెండోసెషన్‌ మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ దాకా జరుగుతుంది.

 

నిలదీసేందుకు విపక్షాల వ్యూహరచన
మోదీ సర్కార్‌ను నిలదీసేందుకు విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల కష్టాలు, కుంభమేళాలో అపశ్రుతి సహా కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, చైనా సరిహద్దు వివాదం వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం కొన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించి వాకౌట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సీపీఐ, సీపీఎం పార్టీలు, చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్లకు మాత్రం అన్ని కాంట్రాక్టులు దక్కేలా కుట్ర వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్‌ వ్యూహాన్ని సిద్ధంచేశాయి. 
 
సహకరించాలన్న మోదీ సర్కార్‌
శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలతో పాటు రాష్ట్రాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని పలు పార్టీలు డిమాండ్‌చేశాయి. మహాకుంభమేళాలో భక్తులను గాలికొదిలేసి వీఐపీ సంస్కృతికి యోగి ప్రభుత్వం జై కొట్టిందని, ఈ నిర్లక్ష్య ధోరణిపై చర్చ జరపాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పట్టుబట్టగా ఎజెండాలో ఏమేం ఉండాలో సభావ్యవహా రాల సలహా కమిటీ నిర్ణయిస్తుందని మంత్రి కిరెణ్‌ రిజిజు చెప్పారు.

వక్ఫ్‌ సహా కీలక బిల్లులు ఈ సమావేశాల్లోనే.. 
ఈ సమావేశాల్లోనే అత్యంత కీలకమైన వక్ఫ్‌ సవరణ బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును సమీక్షించేందుకు ఏర్పాటుచేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన నివేదికను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు గురువారం సమర్పించింది. వక్ఫ్‌ సవరణ బిల్లును గత ఏడాది లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టడం తెల్సిందే. కాగా గురువారం నాటి అఖిలపక్ష భేటీలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను అఖిలపక్ష నేతలకు ప్రభుత్వం అందజేసింది. ఈ జాబితాలో వక్ఫ్‌ సవరణ బిల్లు సైతం ఉంది. 16 బిల్లులను ఈ సెషన్‌లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉభయసభల ముందుకొచ్చే బిల్లుల జాబితాలో బ్యాంకింగ్‌ చట్టాల(సవరణ) బిల్లు, రైల్వే(సవరణ) బిల్లు, విపత్తు నిర్వహణ బిల్లు, చమురు క్షేత్రాల(సవరణ) బిల్లు, షిప్పింగ్‌ బిల్లు, వైమానిక వస్తువుల ప్రయోజనాల పరిరక్షణ బిల్లు, త్రిభువన్‌ సహకారీ యూనివర్సిటీ బిల్లు, వలసల, విదేశీయుల బిల్లు వంటివి ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement