
న్యూఢిల్లీ: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ(మే 29న) సాయంత్రం చేపట్టాల్సిన ఆపరేషన్ షీల్డ్(Operation Shield) వాయిదా పడింది. గుజరాత్, రాజస్థాన్, ఛండీగఢ్, జమ్ము, హర్యానాలో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని భావించిన సంగతి తెలిసిందే. అయితే.. పాలనాపరమైన కారణాల వల్ల దానిని వాయిదా వేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
యుద్ధంలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని భద్రతా బలగాలు ఎలా వ్యవహరించాలి, మరీ ముఖ్యంగా పౌర రక్షణ నేపథ్యంతో మాక్ డ్రిల్స్ నిర్వహించే ప్రయత్నది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) కంటే కొన్ని గంటల ముందు.. మే 7వ తేదీన తొలిసారి పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇవాళ మరోసారి సాయంత్రం 5గం.లకు గుజరాత్, రాజస్థాన్, ఛండీగఢ్, జమ్ము, హర్యానాలో రెండోసారి నిర్వహించాలనుకున్నాయి. అయితే..
హర్యానా తప్పించి మిగతా రాష్ట్రాల్లో ఆపరేషన్ షీల్డ్ను వాయిదా వేస్తున్నట్లు బుధవారం సాయంత్రానికే హోం శాఖ ప్రకటించింది. కానీ, హర్యానా కూడా వాయిదాకే మొగ్గు చూపించడంతో తాజా ప్రకటన చేశారు. అధికారిక కారణాల వల్ల మాక్ డ్రిల్స్ వాయిదా వేస్తున్నామని, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని కేంద్ర హోం శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. దీంతో సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర హోం శాఖ మాక్ డ్రిల్స్(Mock Drills) నిర్వహించింది. సైరన్ వినగానే ప్రజలు అప్రమత్తమైన చెవులు మూసుకుని కింద పడుకోవడం, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం.. భద్రతా బలగాలు వాళ్లను తరలించడం.. దాడుల్లో గాయపడిన వాళ్లను రెస్క్యూ చేయడం తరహా చర్యలు ఇందులో ఉంటాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం.
చివరిసారిగా..
1971లో తూర్పు పాకిస్థాన్(ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్థాన్లో పోరాడాల్సి రావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకు ముందు 1962, 65 యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు. అయితే.. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగినా.. అవి సరిహద్దు జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి.
ఇదీ చదవండి: శాంతిని మేం బలంగా కోరుకుంటున్నాం-పాక్ ప్రధాని