Wrestler Not 'Minor'? New Twist In Case Against WFI Chief Brij Bhushan - Sakshi
Sakshi News home page

భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం..

Published Thu, Jun 8 2023 7:09 AM

New Twist in the Case Against BJP MP Brij Bhushan - Sakshi

న్యూఢిల్లీ: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షులు బీజేపీ ఎంపీ బ్రిజ్  భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సదరు ఎంపీ లైంగికంగా వేధించినట్టు కేసు నమోదు చేసిన రెజ్లర్ మైనర్ కాదంటూ స్వయంగా ఆమె తండ్రే తెలిపారు.  దీంతో ఎంపీపై నమోదైన కేసుల్లో పోక్సో చట్టం కింద ఎంపీపై నమోదైన కేసు నుండి ఆయనకు ఉపశమనం లభించే అవకాశముంది.

పతకాలు గంగలో... 
గత కొంత కాలంగా భారత రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్  భూషణ్ శరణ్ సింగ్ పై ఏప్రిల్ 29న నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరితగతిన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ భారత రెజ్లర్లు నిరవధికంగా నిరసన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నూతన పార్లమెంట్ వద్ద రెజ్లర్లపై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం, రెజ్లర్లు దీన్ని అవమానంగా భావించి తాము సాధించిన పతకాలను గంగానదిలో కలిపేయాలనుకోవడం, రైతు సంఘం నాయకులు కల్పించుకుని రెజ్లర్లను వారించడం వంటి వరుస పరిణామాల మధ్య రెజ్లర్లు ఈ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు. 

కేంద్ర మంత్రి హామీ... 
అనంతరం భారత టాప్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో ఆరు గంటల పాటు చర్చించి విచారణ విషయమై  రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో అప్పటికి సమస్య సద్దుమణిగింది. 

తీరా చూస్తే... 
ఇంతలో ఎంపీ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణ చేసిన రెజ్లర్ సంఘటన జరిగే సమయానికి అసలు మైనరే కాదని స్వయంగా ఆమె తండ్రే వెల్లడించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. కేసు నమోదు చేసిన సమయంలో ఆమె ఇచ్చిన వాంగ్మూలంలో పుట్టుక వివరాల్లో తప్పులు దొర్లాయని ఆయన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఎంపీపై పోక్సో చట్టం కింద నమోదైన కేసు నుంచి ఉపశమనం లభించే అవకాశముంది.  

ఇది కూడా చదవండి: రాతపూర్వక హామీ.. ఓ మెట్టుదిగిన రెజ్లర్లు    

Advertisement
Advertisement