-
బీజేపీలో సస్పెన్స్.. బ్రిజ్ భూషణ్కు టికెట్ దక్కేనా?
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. మరోవైపు మొదటి దశ పోలీంగ్ సైతం సమీపిస్తోంది. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కూటమిలోని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఇంకా జాప్యం చేస్తోంది. యూపీలో కీలకమైన ఈ రెండు స్థానాలు.. వాయువ్య ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్, రాయ్బరేలీ. ఈ రెండు స్థానాలకు మే 20 పోలింగ్ జరగనుంది. ఇక.. నామినేషన్కు చివరి తేదీ మే 3. కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీ.. మోదీ హవా కొనసాగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత సోనియా గాంధీ విజయం సాధించారు. అయితే ఆమె ప్రస్తుతం రాజాస్తాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంలో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పార్టీ ఎన్నికల ప్రక్రియకు సిద్ధమవుతోంది’ అని కాంగ్రెస్ నేత మనీష్ హిందవి తెలిపారు. బీజేపీ నిర్ణయంపై మిగతా పార్టీలు.. కైసర్గంజ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళ రెజ్లర్ల చేసిన లైగింక వేధింపుల ఆరోపణలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో రెజ్లర్ల సమాఖ్యకు కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే 2019లో ఇక్కడ ఆయన సుమారు 2,60,000 మెజార్టీతో విజయం సాధించారు. కైసర్గంజ్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీ కాకుండా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సైతం తమ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. అయితే బీజేపీ నిలబెట్టే అభ్యర్థి నిర్ణయంపై మిగతా పార్టీలు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్భూషన్కు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. 2008లో అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో క్రాస్ ఓటింగ్కు పాల్పడినందుకు బ్రిజ్భూషన్ బీజేపీ బహిష్కరించింది. అనంతరం ఆయన ఎస్పీలో చేరారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరారు. ఎస్పీలో సందిగ్ధం.. ‘కైసర్గంజ్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై పార్టీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం. ఇక్కడ ఎవరిని నిలబెట్టినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాం. ఈ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని బహ్రైచ్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు రామ్ వర్ష యాదవ్ తెలిపారు. మరోవైపు.. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఎస్పీ కూడా సందిగ్ధంలో ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కైసర్గంజ్ టికెట్ బ్రిజ్ భూషణ్కు దక్కేనా..? బీజేపీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని బహ్రైచ్ జిల్లా అధ్యక్షుడు బ్రిజేష్ పాండే స్పష్టం చేశారు. బీజేపీ బ్రిజ్భూషన్కు టికెట్ నిరాకరిస్తే మళ్లీ ఆయన ఎస్పీలోకి పార్టీ మారుతారని బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. హర్యానా, పశ్చిమ యూపీలో కీలకమైన జాట్ సాజికవర్గంలో రెజ్లర్లపై వేధింపుల విషయంలో బ్రిజ్భూషన్పై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఉన్న మొత్తం ఓటర్లలో జాట్లు నాలుగింట ఒక వంతు ఉన్నారని ఓ బీజేపీ నేత తెలిపారు. ఇక.. ఏప్రిల్ 19, 26 తేదీల్లో లోక్సభకు పోలింగ్ జరగనున్న పశ్చిమ యూపీలోని పలు జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో జాట్లు ఉన్నారు. అయితే వారిని దూరం చేసుకోడాన్ని బీజేపీ కోరుకోవడం లేదని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ బ్రిజ్భూషన్కు టికెట్ నిరాకరించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు ఉందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
ఇది మహిళలందరి విజయం..మాకూ ధైర్యం: రెజ్లర్ వినేష్ ఫోగట్
బిల్కిస్ బానో కేసులో దోషుల క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ మెడల్ విజేత వినేష్ ఫోగట్ (Vinesh Phogat) స్పందించారు. ఇది మహిళల విజయం అంటూ ఆమె ట్వీట్ చేశారు.ఈ పోరాటంలో విజయం సాధించిన బిల్కిస్ బానోకు అభినందనలు తెలిపారు. “బిల్కిస్ జీ, ఇది మన మహిళలదరి విజయం. మీరు సుదీర్ఘ పోరాటం చేశారు. మీ విశ్వాసం చూసి మాకూ ధైర్యం వచ్చింది” అని ఫోగట్ ట్విటర్లో పేర్కొంది. बिलकिस जी ये हम सब महिलाओं की जीत है। आपने लंबी लड़ाई लड़ी है। आपको देखकर हमें भी हिम्मत मिली है। 🙏 pic.twitter.com/zKWsPMjdhF — Vinesh Phogat (@Phogat_Vinesh) January 8, 2024 బీజేపీ ఎంపీ,మాజీ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు నిరసనగా మహిళా రెజ్లర్లు చేసిన చాలా పెద్ద పోరాటమే చేశారు. దాదాపు ఏడుగురుమహిళా రెజర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపించిన సుదీర్ఘ పోరాటం చేసిన వినేష్ ఫోగట్ ఒకరు. అయితే ఆ ఆరోపణలను సింగ్ ఖండిస్తూ వచ్చారు. (బిల్కిస్ బానో కేసు: ఎవరీ సంచలన మహిళా జడ్జి?) ఇది ఇలా ఉంటే ఇటీవల బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ను ఆ పదవిలో నియమించడం పెద్ద దుమారాన్ని రేపింది. దీంతో తమకు న్యాయం జరగలేదంటూ మహిళ రెజర్లు తీవ్ర అసంతృప్తిని ప్రకటించారు. ముఖ్యంగా ఈ పోరాటంలో మరో కీలక రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. అలాగే వినేష్ ఫోగట్ ప్రతిష్టాత్మక అర్జున, ఖేల్ రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. వీరికి మద్దతుగా రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా తన అవార్డులను వెనక్కి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. (హీరో అయితేనేం.. ఆ కూతురికి నాన్నేగా!) కాగా ఫోగట్ కామన్వెల్త్ , ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్, అలాగే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లలో అనేక ప తకాలు చాటుకుని భారతీయ సత్తా చాటిన ఏకైక భారతీయ మహిళా రెజ్లర్ కూడా. -
సస్పెండ్ చేస్తే సరిపోతుందా?
డిసెంబరు 21న జరిగిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల్లో, మొత్తం పురుషులతో కూడిన 15 మంది సభ్యుల సంఘాన్ని ఎన్నుకున్నారు. వీరిలో 13 మంది సమాఖ్య మాజీ అధ్యక్షుడు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే. ఫలితాలు వెలువడిన తర్వాత విజేత ప్యానెల్ ప్రవర్తించిన తీరు, కొన్ని నెలల క్రితం బ్రిజ్ భూషణ్పై తీవ్రంగా పోరాడిన రెజ్లర్లనే కాకుండా, వారి సాహసోపేత పోరాటానికి మద్దతిచ్చిన వారిని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ఈ సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. అయితే, ఈ కొత్త సమాఖ్యను క్రీడా మంత్రిత్వ శాఖ నాటకీయంగా సస్పెండ్ చేసింది. కానీ క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది మాత్రమే సరిపోతుందా? భారత రెజ్లింగ్ సమాఖ్యకు బ్రిజ్ భూషణ్ సింగ్ విధేయులే ఎన్నిక కావడం, అనంతరం వారి ప్రవర్తనతో తీవ్ర వేదనకు గురైన ఒలింపి యన్ సాక్షి మాలిక్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది. మరో ఒలింపి యన్ బజరంగ్ పునియా తన ప్రతిష్ఠాత్మక పద్మశ్రీని వెనక్కు ఇచ్చే స్తానని చెబుతూ ప్రధానికి లేఖ రాశాడు. అతని తర్వాత, మూడుసార్లు డెఫ్లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్) బంగారు పతక విజేత, ‘గూంగా పహిల్వాన్’గా ప్రసిద్ధి చెందిన రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా సంఘీ భావంగా తన పద్మశ్రీని వెనక్కు ఇచ్చేశాడు. మల్లయోధుల్లో ఈ తీవ్రమైన ప్రతిచర్యలను ప్రేరేపించినది ఫెడరేషన్ ఎన్నికల ఫలితం మాత్రమే కాదు. తన ఆశ్రితుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడు అయిన సంజయ్ సింగ్తో కలిసి నిలబడి... తన మద్దతుదారులతో మెడలో భారీ పూలదండలు వేయించుకుని, విజయ చిహ్నాన్ని రెపరెపలాడించిన బ్రిజ్ భూషణ్ ప్రవర్తన రెజ్లర్లను తీవ్రంగా స్పందించేలా చేసింది. దీనికి తోడుగా, బ్రిజ్ భూషణ్ కుమారుడు ‘దబ్దబా థా... దబ్దబా రహేగా’ (ఆధిపత్యం వహించాం, ఆధిపత్యం వహిస్తాం) అని రాసివున్న ప్లకార్డును పట్టు కోవడం పుండు మీద కారం జల్లింది. ఈ మొత్తం పరిణామాలు, విజేతల అవాంఛనీయ ప్రవర్తన... క్రీడలకు, పౌర సమాజానికి ఇబ్బంది కలిగించే ధోరణిని సూచిస్తున్నాయి. దేశంలో క్రీడాకారిణుల భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఊహించిన ఫలితమే! ఈ ఎన్నికలకు నిజమైన అర్థం ఏమిటి? మహా అయితే 50 మంది ఓటర్లతో కూడిన ఎలక్టోరల్ కాలేజీని నిర్వహించడం బ్రిజ్ భూషణ్కు కష్టమైన పనేం కాదు. పైగా అతను అధికార బీజేపీకి చెందిన శక్తిమంతమైన పార్లమెంటు సభ్యుడు. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు ఊహించనివేం కాదు. కాకపోతే ఈ విజయానికి చెందిన వికార ప్రదర్శన, లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి బ్రిజ్ భూషణ్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మల్లయోధుల ప్రజా ఉద్య మానికి వ్యతిరేక క్లైమాక్స్గా వచ్చింది. జంతర్ మంతర్ వద్ద జరిగిన మల్లయోధుల ప్రత్యేక ఆందోళన చెరగని ముద్ర వేసింది. మహిళలపై లైంగిక వేధింపులు, కుస్తీ పోటీల్లోని ప్రబలమైన అనారోగ్యకర ధోరణి వంటి వాటిని ప్రధాన వేదికపైకి తీసుకురావడంలో ఇది విజయం సాధించింది. మొత్తం జాతి మనస్సాక్షిని కదిలించడంలో 2023లో అత్యంత అద్భుతమైన నిరసన ఉద్యమాలలో ఒకటిగా నిలిచింది. బజరంగ్ పునియాతో పాటు ఇద్దరు మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ చూపిన అద్భుతమైన సంకల్పం, మహిళా సంస్థల నుండి అపూర్వమైన సంఘీభావాన్ని ఆకర్షించింది. రైతు సంఘాలు, క్రీడాకారులు, ఖాప్ పంచాయితీలు, విద్యార్థులు సహా పలు రకాల సామాజిక సంస్థలు సంఘీభావంగా నిలిచాయి. నిరసనను అణచివేసేందుకు పాలక యంత్రాంగం ప్రదర్శించిన మొరటుదనం, పోలీసుల అణచివేత విఫలమవడంతో, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆందోళన చేస్తున్న రెజ్లర్లతో చర్చలు జరపవలసి వచ్చింది. బ్రిజ్ భూషణ్పై కోర్టులో ఛార్జిషీట్ సమర్పిస్తామనీ, అతని సన్నిహితులు రాబోయే ఎన్నికలలో భారత రెజ్లింగ్ సమాఖ్యను స్వాధీనం చేసుకోకుండా చేస్తామనీ హామీ ఇవ్వాల్సి వచ్చింది. కానీ రెండు అంశాలలోనూ మల్లయోధులు మోసపోయారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరాల కింద విచారణ జరిపి దోషిగా తేలేందుకు సరిపడే స్థాయిలో బ్రిజ్భూషణ్సింగ్పై కేసు నమోదైంది. కానీ మైనర్ ఫిర్యాదుదారుల్లో ఒకరిని తన అభియోగాన్ని ఉపసంహరించుకునేలా ప్రభావితం చేశాడని అతడిపై ఆరోపణ వచ్చింది. అలా ఉపసంహరించుకోనట్లయితే పోక్సో చట్టం కింద కచ్చితంగా అతడు అరెస్టు అయ్యే అవకాశం ఉండేది. నిబంధనలను ఉల్లంఘించి... అదేవిధంగా, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత వారి విజయ హాసాలను చూసినప్పుడు, బ్రిజ్ భూషణ్, అతని అనుచరుల ఉడుం పట్టు నుండి రెజ్లింగ్ సమాఖ్యను విడిపిస్తానన్న రెండవ హామీని కూడా ప్రభుత్వం వమ్ము చేసినట్లు తేలింది. జూనియర్ నేషనల్ రెజ్లింగ్ టోర్నమెంట్ వేదికగా ఉత్తరప్రదేశ్లోని గోండాలోని నందిని నగర్ను ఖాయం చేయడం కూడా వారి ఆహంకారానికి నిదర్శనం. ఇది బ్రిజ్ భూషణ్ సొంత నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ప్రదేశం. చాలా మంది అమ్మాయిలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నట్టుగా సాక్షి మాలిక్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. బ్రిజ్ భూషణ్ తన సత్తాను బహిరంగంగా ప్రదర్శించడం, జాతీయ టోర్నమెంట్ల వేదికను నిర్ణయించడంలో నియమాలు, నిబంధనలను ఉల్లంఘించడంపై అవార్డులు గెలుచుకున్న క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయాల్సిందిగా ఇది క్రీడా మంత్రిత్వ శాఖపై ఒత్తిడిని పెంచింది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నూతన బాడీ ఆకస్మిక సస్పెన్షన్ కారణంగా, బహుశా తాత్కాలి కంగానైనా విజేతల ఆనందం ఆవిరైపోయినట్లు కనిపిస్తోంది. మరోవైపున బ్రిజ్ భూషణ్ శిబిరం ఈ ఎన్నికల ఫలితాలను కొత్తగా నిర్వచించడానికి ప్రయత్నించింది. తాము అమాయకులమని చేస్తూవచ్చిన వాదనలకు తగిన నిరూపణగా, ఇది కేవలం రాజకీయ ఉద్దేశ్యాలతో ప్రభావిత మైనదిగా చూపేందుకు వాళ్లు ప్రయత్నించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలి ఏమైనా, సామాజిక నిషేధాలను ధిక్కరించి క్రీడల్లో పాల్గొనేలా తమ కుమార్తెలను ప్రోత్సహిస్తున్నవారు ప్రస్తుత సంక్లిష్ట స్థితిలో తీవ్రంగా ప్రభావితమయ్యారు. క్రీడల్లో మెరుగైన కెరీర్లు, ఉద్యో గావకాశాలు, వారు గెలిచిన పతకాలతో వచ్చే కీర్తిని చూసిన గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను క్రీడలను వృత్తిగా స్వీకరించేలా మొగ్గు చూపారు. కానీ ఇటీవలి నెలల్లో జరిగిన సంఘటనలు కచ్చితంగా వారి విశ్వాసాన్ని సడలించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికైన సంఘాన్ని కేవలం సస్పెండ్ చేయడం క్రీడల్లో మహిళల భద్రతపై ఇప్పటికే సన్నగిల్లిన ప్రజా విశ్వాసాన్ని పున రుద్ధరించదు. కొనసాగుతున్న పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందో నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. బ్రిజ్ భూషణ్పై బీజేపీ ఎటువంటి క్రమశిక్షణ చర్యా తీసుకోలేదనీ, సుప్రీం కోర్టు ఆదేశించే వరకూ ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదనీ ప్రజలకు స్పష్టమైంది. న్యాయమైన విచారణ జరిగేలా, ఫిర్యాదుదారులపై ప్రభావం చూపకుండా నిరోధించడానికి నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం అవసరం. అన్ని క్రీడా సమాఖ్యలు సమగ్రమైన, సంపూర్ణమైన పరివర్తనల దిశగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం అవశ్యం. మహిళల ప్రవేశాన్ని నిరోధించకుండా ఉండేలా ఒక ప్రత్యేక క్రీడా విధానం కావాలి. ఇటువంటి సమూలమైన మార్పునకు విస్తృత ప్రాతిపదికన ప్రచారం అవసరం. ఇందులో భాగస్వాములందరూ మరింత ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసు కోవాలి. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో మల్లయోధులు ప్రదర్శించిన స్ఫూర్తిని, బలాన్ని ఏకీకృతం చేయడం, మరింతగా విస్తరించడం అవసరం. – జగమతీ సాంగ్వాన్, వాలీబాల్ క్రీడాకారిణి, భీమ్ అవార్డు తొలి మహిళా గ్రహీత, ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు; – ఇంద్రజీత్ సింగ్, ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు -
‘కుస్తీ’ పట్టిన రాహుల్ గాంధీ
హర్యానా: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారుడు బజరంగ్ పూనియా, ఇతర రెజ్లింగ్ క్రీడాకారులను హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో ఛారా గ్రామంలొ కలుసుకున్నారు. ఆయన బుధవారం ఉదయమే.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రదేశానికి వెళ్లారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష ఎన్నికకు సంబంధించి.. రెజ్లింగ్ క్రీడాకారులు నిరసన తెపుతున్న విషయం తెలిసిందే. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎంపికను నిరసిస్తూ... బజరంగ్ పూనియా తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డును ఎనక్కి ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయాలో బుధవారం ఎంపీ రాహుల్ గాంధీ క్రీడాకారులతో భేటీ అయి వారికి మద్దతుగా నిలిచారు. దీంతో ఎంపీ రాహుల్ గాంధీ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. वर्षों की जीतोड़ मेहनत, धैर्य एवं अप्रतिम अनुशासन के साथ अपने खून और पसीने से मिट्टी को सींच कर एक खिलाड़ी अपने देश के लिए मेडल लाता है। आज झज्जर के छारा गांव में भाई विरेंद्र आर्य के अखाड़े पहुंच कर ओलंपिक पदक विजेता बजरंग पूनिया समेत अन्य पहलवान भाइयों के साथ चर्चा की। सवाल… pic.twitter.com/IeGOebvRl6 — Rahul Gandhi (@RahulGandhi) December 27, 2023 ‘ఎంపీ రాహుల్ గాంధీ రెజ్లర్ల రోజువారి సాధన, కార్యకలాపాలను తెలుసుకోవడానికి మా వద్దకు వచ్చారు. కాసేపు మాతో పాటు రెజ్లింగ్ కూడా చేశారు’ అని క్రీడాకారుడు బజరంగ్ పూనియా తెలిపారు. ‘రాహుల్ గాంధీ ఇక్కడ వస్తున్నట్లు మాకు ఎవరూ సమాచారం అందించలేదు. మేము రెజ్లింగ్ ప్రాక్టిస్ చేస్తున్న క్రమంలో అకస్మత్తుగా మా వద్దకు ఆయన చేరుకున్నారు. ఆయన ఉదయమే 6.15 గంటలకు ఇక్కడికి వచ్చారు. మాతో పాటు కాసేపు వ్యాయామం చేశారు. ఆయనకు క్రీడల పట్ల ఉన్న అనుభవాలను మాతో పంచుకున్నారు. రాహుల్ గాంధీకి క్రీడాల పట్ల చాలా పరిజ్ఞానం ఉంది’ అని రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర ఆర్య పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్కు నమ్మినబంటుగా పేరున్న సంజయ్ కుమార్ను.. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికపై నిరసన తెలుపుతూ.. తాజాగా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా అర్జున, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డులు వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. రెజ్లర్లు రోడ్డెక్కి పోరాడుతున్న క్రీడాశాఖ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడం గమనార్హం. #WATCH | Haryana: On Congress MP Rahul Gandhi visits Virender Arya Akhara in Chhara village of Jhajjar district, Wrestler Bajrang Poonia says, "He came to see our wrestling routine...He did wrestling...He came to see the day-to-day activities of a wrestler." pic.twitter.com/vh0aP921I3 — ANI (@ANI) December 27, 2023 చదవండి: వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం -
పరువు కోసం కుస్తీ!
ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు... తక్షణమే సరిదిద్దకపోతే, ఆపైన అన్నీ తప్పులే జరుగుతాయట. ప్రాచుర్యంలో ఉన్న లోకోక్తి అది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కథ సరిగ్గా అలానే ఉంది. సమాఖ్యలోని అవకతవకలు, మహిళా మల్లయోధులపై సమాఖ్య అధ్యక్షుడు, కోచ్ల లైంగిక వేధింపుల గురించి ఏడాది పైగా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. అయినా, కంటితుడుపులకే తప్ప, కఠిన చర్యలకు దిగని కేంద్ర పాలకులు తాజాగా సమాఖ్యపై సస్పెన్షన్ వేటువేయక తప్పలేదు. వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ సారథ్యంలో సమాఖ్య గబ్బుపడితే, తాజాగా ఆయన సహచరుడు సంజయ్ సింగ్ సారథ్యంలో ఏర్పడ్డ కొత్త కార్యవర్గం సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఎన్నికైన మూణ్ణాళ్ళకే సస్పెన్షన్ వేటుకు గురైన దుఃస్థితి. ఆదివారం నాటి ఈ సస్పె న్షన్తో మన రెజ్లింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దేశానికి పేరు తెచ్చిపెట్టిన క్రీడాకారులెందరో ఉన్నప్పటికీ, మన కుస్తీ గోదా కథ ఆశించినంత గొప్పగా లేదని మరోమారు తేలిపోయింది. ఒలింపిక్ పతకాలు సాధించిన మన మల్లయోధులు సాక్షీ మాలిక్, బజరంగ్ పూనియా,ప్రపంచ ఛాంపియన్షిప్లో పతక విజేత వినేశ్ ఫోగట్లు సమాఖ్యలో అవతవకలపై గళం విప్పి మరి కొద్ది రోజుల్లో ఏడాది కావస్తోంది. ఈ పన్నెండు నెలల కాలంలో ర్యాలీలు, దేశ రాజధాని నడిబొడ్డున ఆటగాళ్ళ ధర్నాలు, వేధింపుల ఆరోపణలతో బ్రిజ్భూషణ్పై ఢిల్లీ పోలీసుల కేసులు, దర్యాప్తులు... ఇలా అనేక నాటకీయ ఘటనలు చూశాం. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ తప్పనిసరై తన పదవికి దూరం జరిగాడు. అయితే, పేరుకు పదవిలో లేకపోయినా, వెనుక నుంచి చక్రం తిప్పుతున్నది అతగాడేనని సమాఖ్య కొత్త కార్యవర్గం తాజా ఎన్నికల్లోనూ తేలిపోయింది. బ్రిజ్భూషణ్కు దీర్ఘకాలంగా నమ్మిన బంటైన సంజయ్సింగ్ గత గురువారం డిసెంబర్ 21న జరిగిన ఎన్నికల్లో సమాఖ్య కొత్త అధ్యక్షుడ య్యారు. ఎన్నికలు జరిగిన 15 పదవుల్లో 13ను ఆ జట్టే గెలిచింది. పైగా, లైంగిక వేధింపులపై ఇంత రచ్చ జరుగుతున్నా ఎన్నికైనవారిలో కనీసం ఒక్క మహిళైనా లేకపోవడం మరీ విడ్డూరం. అయినా వ్యవస్థ మారకుండా పేరుకు వ్యక్తులు మారితే ప్రయోజనం ఏముంటుంది! పాత తానులోని ముక్కే అయిన కొత్త అధ్యక్షుడు వస్తూనే సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 28 నుంచి యూపీలో అండర్–15, అండర్–20 వారికి జాతీయ ఛాంపియన్షిప్స్ జరుగుతాయని ప్రకటించారు. సమాఖ్య సెక్రటరీ జనరల్ను సంప్రతించడం లాంటి నియమాలేవీ పాటించనేలేదు. పైగా, లైంగిక వేధింపులు జరిగినట్టు ఆరోపణలున్న ప్రాంగణంలోనే, అదే పాత కాపుల కను సన్నల్లోనే కొత్త కమిటీ సాగుతుండడం దిగ్భ్రాంతికరం. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్య వివాదానికీ, ఫిర్యాదులకూ దారి తీసింది. మరోపక్క ఎన్ని పోరాటాలు చేసినా, ప్రభుత్వానికి మరెన్ని వినతులు ఇచ్చినా పాత కథే పునరావృతం కావడం ఆటగాళ్ళే కాదు, ఎవరూ జీర్ణించుకోలేని విషయం. రెజ్లర్ సాక్షీ మాలిక్ కుస్తీకి పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు కన్నీటి పర్యంతమవుతూ ప్రకటించారు. మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ పతకాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేస్తున్నట్టు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో సర్కార్ ఒత్తిడిలో పడింది. హడావిడిగా కొత్త కమిటీపై సస్పెన్షన్ వేటు వేసింది. సమాఖ్య నిర్వహణకు తాత్కాలిక ప్యానెల్ను నియమించాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘాన్ని (ఐఓఏ) కోరింది. రెజ్లింగ్ సమాఖ్యను సరిదిద్దేందుకు ఎప్పుడో చర్యలు చేపట్టాల్సిన సర్కార్ ఇప్పటికి గాఢనిద్ర నుంచి మేలుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ మాత్రమైనా కదలిక రావడం మంచిదే. కానీ, ఇది సరిపోతుందా అన్నది ప్రశ్న. దేశానికి పతకాలు పండిస్తున్న క్రీడాంశంలో, అందులోనూ అంతర్జా తీయంగా మన ప్రతిష్ఠను పెంచిన ఆటగాళ్ళ నిఖార్సయిన ఆందోళనలపై మన పాలకులు ఇన్నాళ్ళు కాలయాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వపక్ష పార్లమెంట్ సభ్యుడే సమాఖ్య అధ్యక్షుడు కావడం, సార్వత్రిక ఎన్నికల బరిలో ఓట్లు – సీట్ల సంఖ్యను ప్రభావితం చేసే శక్తిమంతుడు కావడంతో బీజేపీ పెద్దలు ఇంతకాలం విషయం సాగదీశారనేది సుస్పష్టం. వినేశ్ ఫోగట్ అన్నట్టు... రెజ్లింగ్ సమాఖ్యలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇక దేశంలో కుస్తీ క్రీడ ఆడపిల్లకు భద్రత లేని అంశంగా మిగిలిపోతుంది. కానీ, ‘బేటీ బచావో... బేటీ పఢావో’ అంటూ బీరాలు పలికే పాలకులకు ఇది పెద్దగా పట్టినట్టు లేదు. మన సొంతింటి రెజ్లింగ్ వ్యవహారం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి అప్రతిష్ఠగా పరిణమించింది. నిజానికి, క్రీడా సంస్థలపై వివాదాలు కొత్త కావు. క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు, ఆటగాళ్ళ ఎంపికలో అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు తరచూ వినబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలతోనే సరిపుచ్చుతున్నాయి తప్ప, సమూల ప్రక్షాళనకు సమకట్టడం లేదు. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన క్రీడాసంస్థల్ని అధికార పార్టీల జేబు సంస్థలుగా, వారసత్వపు గడీలుగా నడుపుతున్నారు. పెద్ద స్థానాల్లో ఉన్న ఒకప్పటి స్టార్ ఆట గాళ్ళు సైతం తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి, తమకా పదవులిచ్చిన పార్టీల ప్రయోజనాలకు డూడూ బసవన్నలవుతున్నారు. ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్న, లోపభూయిష్ఠ మైన మన క్రీడా నిర్వహణలో తక్షణ సంస్కరణలు అవసరం. లేదంటే, తీరని నష్టం. పాలకులు స్వపక్షాభిమానం వదిలి, కఠిన కార్యాచరణకు పూనుకోనట్లయితే... మన క్రీడావీరుల కష్టానికీ, కన్నీళ్ళకూ విలువేముంది! రాజకీయం ఆట కావచ్చేమో కానీ, ఆటలు రాజకీయం కాకూడదు!!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement